ఖమ్మం, డిసెంబర్ 20: అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో ఓటమి బాధ్యత తనదేనని, ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నానని, ఎవరిని తప్పు పట్టడం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఆయన స్వగృహంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. గెలుపోటములు పకపకన తలుపులు లాంటివని, ఎప్పుడు ఏ తలుపు మూసుకుంటుందో.. ఏ తలుపు తెరుచుకుంటుందో ప్రజల నిర్ణయమన్నారు. అంబేదర్, ఎన్టీఆర్, ఇందిరాగాంధీ కూడా ఎన్నికల్లో ఓడిపోయిన వారేనని, ఆయన విలువ కొంచెమైనా తగ్గలేదన్నారు. గెలిచినపుడు పోంగిపోవడం.. ఓడినపుడు కుంగిపోవడం తన తత్వంకాదన్నారు. హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రజలదే పైచేయి అన్నారు. కానీ ఇతర జిల్లాల్లో అది సాధ్యం కాలేదన్నారు. ప్రజలు మార్పు కావాలని కోరుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు అధికారమే పరమావధిగా భావించలేదన్నారు. ఒకరిద్దరి తప్పుల వల్ల బీఆర్ఎస్ అధికారం కోల్పోలేదని, ప్రజలు మార్పు కోరుకోవడం వల్లే ఓటమి పాలైందన్నారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడటానికి కొన్ని రోజులు ఆగాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి గత ప్రభుత్వంపై అభాండాలు వేసేందుకు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నదని మాజీ మంత్రి మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలు, లేనిపోని డిక్లరేషన్లు ఇచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లకు మించి పరిపాలన చేయలేదన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనే ఉచితం అమలు చేస్తున్నదని, అన్ని బస్సుల్లో ఉచితం చేస్తేనే పథకానికి సమగ్రత వస్తుందన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తానన్నారని, అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడంలో, పార్టీకి పునః వైభవం తీసుకొచ్చే క్రతువులో నాయకులు, నేతలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో రాబోయే రోజుల్లో తాను ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులతో మాట్లాడతానన్నారు. ఓటమిని సవాల్గా తీసుకుని పనిచేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు, రఘునాథపాలెం జడ్పీటీసీ ప్రియాంక, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ దొరేపల్లి శ్వేత, నాయకులు కర్నాటి కృష్ణ, ఆర్జేసీ కృష్ణ, పలు డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.