హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చిన సం క్షేమ, మౌలిక వసతుల కార్యక్రమాల్లో మిషన్ భగీరథ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే మహత్తర సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రూపకల్పన చేసిన ఈ బృహత్తర పథకానికి శుక్రవారంతో పది వసంతాలు నిండాయి. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండలో 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ అధికారికంగా ప్రా రంభించారు. సరిగ్గా పదేండ్ల క్రితం ప్రారంభమైన ఈ బృహత్ యజ్ఞం.. నేడు తెలంగాణ తాగునీటి చరిత్రను తిరగరాసిన మహత్తర ప్రణాళికగా గుర్తింపు పొందింది. పురాణాల్లో గంగానదిని భూమిపైకి తీసుకొచ్చిన భగీరథుడి సంకల్పానికి స్ఫూర్తిగా ఈ పథకానికి మిషన్ భగీరథ అని పేరు పెట్టారు. ఒకప్పుడు బిందెలు పట్టుకుని కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకునే పరిస్థితి ఉన్న తెలంగాణలో.. నేడు ఇంటి గుమ్మం వద్దే నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం ఆ పేరును సార్థకం చేసింది.
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో తాగునీటి సమస్య తీవ్రమైన సవాలుగా ఉండేది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి తదితర జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్యతో వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదురొన్నాయి. ఫ్లోరైడ్ రక్కసి వల్ల పిల్లల కాళ్లు, చేతులు వంకర్లు పోయాయి. దంతాలు గార లు (గీతలు) వచ్చాయి. అనేక గ్రామాల్లో మహిళలు రోజూ బిందెలు మోసుకుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తీసుకురావాల్సి వచ్చేది. కలుషిత నీటితో వ్యాధులు ప్రబలేవి. ఈ పరిస్థితికి శాశ్వత పరిషారం చూపాలనే ఆలోచనతో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర తాగునీటి గ్రిడ్ను నిర్మించాలని నిర్ణయించా రు. కృష్ణా, గోదావరి నదుల నుంచి ఉపరితల జలాలను సేకరించి శుద్ధి చేసి భారీ పైప్లైన్ నెట్వర్ ద్వారా గ్రామాలు, పట్టణాలు, తం డాలు, గిరిజన ఆవాసాలకు చేరవేసే అత్యంత భారీ నీటి సరఫరా వ్యవస్థను ప్రభుత్వం ని ర్మించింది. వేలాది కిలోమీటర్ల పైప్లైన్లు, పం పింగ్ స్టేషన్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓవర్హెడ్ రిజర్వాయర్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో దేశంలోనే అతిపెద్ద గ్రామీణ తాగునీటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఒకటిగా మిషన్ భగీరథ నిలిచింది.
మిషన్ భగీరథ అంచనా వ్యయం రూ. 44,933.66 కోట్లు. ఇందులో రూ.36,900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. కేంద్రం నుంచి రూ.8,033.66 కోట్ల ఆర్థిక సహాయం లభించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 23,839 గ్రామీణ ఆవాసాలు, పట్టణ స్థానిక సంస్థలు, గిరిజన ఆవాసాలు సమగ్ర తాగునీటి వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. కృష్ణా, గోదావరి జలాల నుంచి 59.94 టీఎంసీల నీటిని కేటాయిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
మిషన్ భగీరథ సాధించిన అతి పెద్ద విజయాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందించడం ఒకటి. ఒకప్పుడు ఫ్లోరైడ్ కారణంగా ఎముకలు వంకర్లు తిరిగిన పిల్లలు, వికలాంగులైన బాధితులు అధికంగా కనిపించిన ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి రావడంతో గణనీయమైన మార్పు వచ్చింది. తెలంగాణను ఫ్లోరైడ్హ్రిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ పథకం బలమైన పునాది వేసింది. మిషన్ భగీరథతో గ్రామీణ మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పు వచ్చింది.
భగీరథ పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన హర్ ఘర్ జల్ కార్యక్రమానికి కూడా తెలంగాణ మాడల్ స్ఫూర్తిగా నిలిచిందని అప్పట్లో విసృ్తతంగా చర్చ జరిగింది. ఇటీవలి కాలంలో కొన్ని ప్రాంతాల్లో పైప్లైన్ లీకేజీలు, పంపింగ్ సమస్యలు, మోటర్ల మరమ్మతుల జాప్యం, విద్యుత్తు అంతరాయాల కారణంగా నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన ఈ పథకాన్ని రాజకీయాలకతీతంగా మరింత బలోపేతం చేసి, నిర్వహణకు తగిన నిధులు కేటాయించాలని పలువురు కోరుతున్నారు. మిషన్ భగీరథ కేవలం ఒక తాగునీటి పథకమే కాదు. ఇది తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మార్చిన సామాజిక విప్లవం. భగీరథుడి సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ కార్యక్రమం తెలంగాణ అభివృద్ధి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆలోచనల నుంచి సరిగ్గా పదేండ్ల కింద పురుడుపోసుకున్న మిషన్ భగీరథ పథకం తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చడంలో శాశ్వత పరిషారం చూపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపారు. ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదని, ప్రజల జీవన ప్రమాణాలను మార్చిన అమృత జల ప్రణాళిక అని కొనియాడారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో ప్రారంభమైన మిషన్ భగీరథ పథకం పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన హర్షం ప్రకటించారు.
దశాబ్ది పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రత్యేక వీడియోను పంచుకుంటూ, తెలంగాణ సమగ్ర తాగునీటి విప్లవాన్ని గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ మానస పుత్రికగా మొదలైన బృహత్ పథకం దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని తెలిపారు. గోదావరి, కృష్ణా ఉపరితల జలాలను శుద్ధి చేసి, వేల కిలోమీటర్ల పైప్లైన్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా మారుమూల గ్రామాలు, తండాల వరకు ఇంటింటికీ నల్లా నీరు అందించడం దేశ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘హర్ ఘర్ జల్’ పథకానికి కూడా మిషన్ భగీరథే స్ఫూర్తిగా నిలిచిందని గుర్తుచేశారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం నడవాల్సిన దయనీయ పరిస్థితులు ఉండేవని, ముఖ్యంగా ఫ్లోరైడ్ నీటి వల్ల ఎంతో మంది కాళ్లు, చేతులు వంకర్లుపోయి ప్రాణాలు కోల్పోయారని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. మిషన్ భగీరథ రాకతో రాష్ట్రం ఫ్లోరోసిస్ రహితంగా మారిందని వివరించారు. ఇంతటి మహత్తరమైన పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పర్యవేక్షించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాజకీయ కక్షలను పకనబెట్టి ప్రజలకు ఉపయోగపడే మిషన్ భగీరథ పథకం నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని హరీశ్ డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పైప్లైన్లు, మోటర్లు, పంపింగ్ వ్యవస్థలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరారు. నీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపారు.