కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 13: భద్రాచలం పట్టణం గుండా భారీగా గంజాయి తరలుతున్నదని సమాచారం అందుకున్న సీసీఎస్, పట్టణ పోలీసులు ఆదివారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద రెండు కార్లలో తరలిస్తున్న సుమారు రూ.కోటి విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న వివరాలు వెల్లడించారు. భద్రాచలంలో సీసీఎస్, పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అటుగా వచ్చిన రెండు ఇన్నోవా కార్లను అడ్డుకుని సోదా చేశారు. రెండు వాహనాల్లో 228 గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దీంతో ఇద్దరు నిందితులు పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి 4.88 క్వింటాళ్లు ఉంటుందని, దీని విలువ రూ.97.60 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితులను బూర్గంపహాడ్ మండలం తాళ్లగొమ్మూరుకు చెందిన శివశంకర్రెడ్డి, మజీద్ కాలనీకి చెందిన నాగేంద్రబాబుగా గుర్తించామన్నారు.
ఆంధ్రా- ఒడిశా సరిహద్దు నుంచి సేకరణ
నిందితులిద్దరూ ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి జహీరాబాద్కు చెందిన ఆమీర్ అనే వ్యక్తికి విక్రయించేందుకు వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారని ఎస్పీ తెలిపారు. ఇద్దరు నిందితుల్లో శివశంకర్రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నాడని, ఇతనిపై గంజాయి రవాణాపై గతంలోనే మూడు కేసులు ఉన్నాయన్నారు. అయినా అతనిలో ఎలాంటి మార్పులేకపోవడంతో పోలీస్శాఖ నిందితుడిపై పీడీ యాక్ట్కు సిద్ధమైందన్నారు. నిందితుడు జహీరాబాద్కు చెందిన అమీర్తో పాటు మరోవ్యక్తి ఆదిత్యకు గంజాయి విక్రయిస్తున్నాడన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచామన్నారు. సరుకు పట్టుకున్న సీసీఎస్ బృందం, భద్రాచలం పోలీసులను ఎస్పీ అభినందించారు.
గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక బృందం
గంజాయి రవాణాను కట్టడి చేసేందుకు జిల్లాలో ఒక ఏఎస్పీ పర్యవేక్షణలో సీసీఎస్ పోలీస్లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు గంజాయి రవాణా తరలిస్తున్న 18మంది పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. ఎవరైనా గంజాయి రవాణా చేస్తున్నట్లు గమనించినా, విక్రయిస్తున్నట్లు చూసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పారితోశ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ దాసరపు వేణుచందర్, భద్రాచలం సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సైలు శ్రీపతి తిరుపతి, దారం సురేశ్, పొడిశెట్టి శ్రీకాంత్, భాగ్యరాజు వంశీకృష్ణ పాల్గొన్నారు.
రూ.40 లక్షల విలువ చేసే గంజాయి.. వివరాలు వెల్లడించిన ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్
ఖమ్మం, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ నుంచి నుంచి గంజాయి సేకరించి జిల్లా మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠాను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ విష్ణు ఎస్ వారియర్ సోమవారం వివరాలు వెల్లడించారు. ఏపీ నుంచి ఖమ్మం గుండా శనివారం భారీగా గంజాయి తరలుతున్నదని సమాచారం అందుకున్న టౌన్ ఏసీపీ పీవీ గణేశ్ రెండో పట్టణ పోలీసులతో కలిసి నగరంలో వాహన తనిఖీలు నిర్వహించారు. అటుగా వస్తున్న వాన్ను అడ్డుకుని సోదా చేశారు. వానులో రూ.40 లక్షలు విలువ చేసే గంజాయి ప్యాకెట్లను గుర్తించి డ్రైవర్, క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన షేక్ ఆసిఫ్, సాజిద్ హమ్మద్ఖాన్గా గుర్తించారు.
గంజాయి రవాణాకు మధ్యవర్తులుగా పనిచేసిన రాహుల్, ప్రసాద్, శ్రీనివాసరావు, మహేశ్, సప్లయర్స్ గణేశ్, రమణ, రిసీవర్స్ మహేశ్, సమీర్ను అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నది. గంజాయిని చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని సీపీ అభినందించారు. సమావేశంలో టౌన్ ఏసీపీ పీవీ గణేశ్, ఎస్బీ ఏసీపీ ప్రసన్నకుమార్, రెండో పట్టణ సీఐ శ్రీధర్, ఒకటో పట్టణ సీఐ చిట్టిబాబు, ఎస్సైలు కొండలరావు, ప్రసాద్ పాల్గొన్నారు.