కూసుమంచి, మార్చి 27 : సాగులో నూతన విధానంతోపాటు ఇతర ఆదాయ మార్గాలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల అన్నారు. కూసుమంచి రైతు వేదికలో బుధవారం జరిగిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సాగులో తక్కువ నీటిని వినియోగిస్తూ ఎక్కువ పంటలు పండిస్తూ లాభాలు గడించే విధంగా మెళకువలు తెలుసుకోవాలన్నారు. సమగ్ర వ్యవసాయ విధానంలో డ్రోన్ల గురించి అవగాహన పెంచుకోవాలని, పంట మార్పు, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు.
శాస్త్రవేత్త డాక్టర్ గోవర్ధన్ మాట్లాడుతూ వ్యవసాయంతోపాటు కోళ్లు, గొర్రెలు, ఆవులు, గేదెల పెంపకంపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. మార్కెట్లో చేపలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో చేపల చెరువుల ద్వారా మంచి ఆదాయం పొందవచ్చన్నారు. డాక్టర్ రాంగోపాల్ వర్మ.. డ్రోన్ పరికరం ఆవశ్యకత గురించి వివరించారు. తక్కువ సమయంలో డ్రోన్ పరికరంతో ఎక్కువ విస్తీర్ణంలో మందు పిచికారీ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీఏ విజయ్చంద్ర, ఏవోలు వాణి, సీతారాంరెడ్డి, నాగేశ్వరరావు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.