కొత్తగూడెం టౌన్, ఏప్రిల్ 10 : ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం, ఆరోగ్యం ప్రాముఖ్యతను తెలియజేయడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రాముఖ్యత అని అన్నారు. వాతావరణం, పర్యావరణ కాలుష్యం, సామాజిక పరిస్థితులు, ప్రకృతి విపత్తులు తదితర అనేక అంశాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని,
ఇందుకోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గొల్లపూడి భానుమతి మాట్లాడుతూ వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు బత్తుల రామారావు, కే.సాయిశ్రీ, ఏపీపీ పోసాని రాధాకృష్ణమూర్తి, ఏజీపీ ఏపూరి బాబురావు, తోట మల్లేశ్వరరావు, గాజుల రాంమూర్తి, శెట్టిపల్లి వెంకట రామారావు, చిరంజీవిరావు, ఎర్రపాటి కృష్ణ, వై.నాయుడు, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు తదితరులు పాల్గొన్నారు.