పోటెత్తిన వరద భారీ నష్టాన్ని మిగిల్చింది. రూ.129 కోట్ల మేర నష్టం జరిగిందని భద్రాద్రి కలెక్టర్ కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. శుక్రవారం కేంద్ర బృందం సభ్యులు బూర్గం పహాడ్ మండలంలో పర్యటించారు. దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులు, మిషన్ భగీరథ మోటర్లు, పైపులైన్లను పరిశీలించారు. వరదల వల్ల కలిగిన నష్టం వివరాలను భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా కలెక్టర్ కేంద్ర బృందానికి సభ్యులకు వివరించారు.
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ బూర్గంపహాడ్, జూలై 22: భద్రాద్రి జిల్లాలో ఇటీవల వచ్చిన గోదావరి వరదల వల్ల కలిగిన నష్టం రూ.129 కోట్లుగా తేలింది. ఈ మేరకు కలెక్టర్ అనుదీప్.. కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృంద సభ్యులు శుక్రవారం భద్రాద్రి జిల్లాలోని బూర్గంపహాడ్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, రహదారులు, మిషన్ భగీరథ మోటార్లు, పైపులైన్లతోపాటు ప్రభుత్వ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి నేతృత్వంలో పార్తిబన్ కే.మనోహరన్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ రమేశ్కుమార్, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎస్ఈ శివకుమార్ కుష్వాహాలు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.
బూర్గంపహాడ్ మండల కేంద్రంతోపాటు సంజీవరెడ్డిపాలెం గ్రామంలోనూ పర్యటించారు. సంజీవరెడ్డిపాలెంలో దెబ్బతిన్న పత్తి, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో చర్చించారు. జీ.భాస్కర్రెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. తాను 15 ఎకరాల్లో పత్తి పంట వేశానని, వరదల వల్ల పూర్తిగా పంట నష్టపోయాని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంఏ మజీద్ అనే రైతు మాట్లాడుతూ డ్రాగన్ ఫ్రూట్ పంట కూడా పూర్తిగా నీట మునిగి కుళ్లిపోయిందని చెప్పాడు. దీంతో అధికారులు కూడా ఆ పంటను గమనించారు. బూర్గంపహాడ్లో దెబ్బతిన్న ఇళ్లను, కుక్కునూరు – బూర్గంపహాడ్ రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వరదల నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామని చెప్పారు. అంతకుముందు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను పరిశీలించారు.
వరదల వల్ల కలిగిన నష్టం వివరాలను ఛాయా చిత్ర ప్రదర్శన ద్వారా కలెక్టర్ అనుదీప్.. కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. వ్యవసాయ శాఖకు 10,831 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని, దెబ్బతిన్న పంటల విలువ రూ.584.88 లక్షలు ఉంటుందని, ఉద్యాన వన పంటలు 35 హెక్టార్లలో దెబ్బతిన్నాయని, నష్టం విలువ రూ.40.50 లక్షలు ఉంటుందని, విద్యుత్శాఖలో 9 సబ్ స్టేసన్లు, 65 స్తంభాలు, 259 విద్యుత్ నియంత్రికలు దెబ్బతిన్నాయని, వాటి విలువ రూ.580.10 లక్షలు ఉంటుందని, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గ్రామీణ రహదారులు 251.50 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని, వాటి విలువ రూ.1280 లక్షలు ఉంటుందని, ఆర్అండ్బీ శాఖకు సంబంధించి 45 రహదారులు దెబ్బతిన్నాయని, వాటి విలువ రూ.9996 లక్షలు ఉంటుందని వివరించారు. మిషన్ భగీరథకు సంబంధించి 212 ఆవాసాల్లో నల్లాలు, మోటార్లు, ప్యానెల్ బోర్డులు దెబ్బతిన్నాయని, వాటి విలువ రూ.220 లక్షలు ఉంటుందని, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయని, వాటి విలువ రూ.252 లక్షలు ఉంటుందని వివరించారు. మొత్తం ఏడు మండలాల్లో రూ.129 కోట్ల నష్టం జరిగినట్లు కలెక్టర్ వివరించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, ఏఎస్పీ రోహిత్రాజ్, వివిధ శాఖల అధికారులు అభిమన్యుడు, మరియన్న, భీమ్లా, సుధాకర్, భాస్కర్రావు, తిరుమలేశ, నళిని, రమేశ, విజయ్కుమార్, శైలజ, అశోక్చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలిస్తున్న కేంద్ర బృంద సభ్యులు
యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాం..
ఈ సందర్భంగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. గోదావరి నదికి 1986 తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం ఇదే తొలిసారని, ఈనెల 16న రికార్డుస్థాయిలో 71.30 అడుగుల వరకు వరద ప్రవాహం వచ్చిందని అన్నారు. కానీ వీటి వల్ల ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదన్నారు. పశువులను కూడా ఎత్తయిన ప్రాంతాలకు తరలించామన్నారు. ముంపునకు గురవుతున్న ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు తరలించి రక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వరద ప్రభావిత గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామన్నారు.