ఖమ్మం, నేలకొండపల్లి, మద్దులపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏన్కూరు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్లపై కాసుల వర్షం కురుస్తున్నది.. ఖజానాకు భారీగా నిధులు చేరుతున్నాయి.. ఉత్పత్తుల క్రయవిక్రయాలపై వచ్చే సెస్, చెక్పోస్ట్ల నుంచి వచ్చే ఆదాయంతో ఆయా మార్కెట్లు ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి.. గతేడాది కరోనా సెకండ్ వేవ్ సమయంలో కొనుగోలు కేంద్రాలు మూతపడడంతో ఆదాయం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 చెక్పోస్టులపై ఆధారపడాల్సి వచ్చింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి క్రమంగా ఆదాయం పెరిగింది. పంటలు బాగా పండడం, ప్రభుత్వం దిగుబడులకు మద్దతు ధరలు ప్రకటించడంతో మార్కెట్ల ఆదాయం క్రమంగా పెరిగింది. మార్కెటింగ్శాఖ ఒక్కో సవాల్ను ఎదుర్కొంటూ 2021-22 సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యానికి చేరువైంది. రూ.36.57 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటికే రూ.25.19 కోట్లు ఆర్జించింది. మరో నెలన్నరలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు వ్యవసాయశాఖ కమిటీ సభ్యులు, మార్కెటింగ్శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఖమ్మం, మధిర, ఏన్కూరు మార్కెట్ల ఆదాయం లక్ష్యానికి మించి సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
– ఖమ్మం ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నేటి వరకు అన్ని మార్కెట్ల ఆదాయాలు కలిపి రూ.25.19 కోట్లు వచ్చాయి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే లాక్డౌన్తో రెగ్యులేటరీ మార్కెట్లు కొంతకాలం క్రయవిక్రయాలు జరుపలేదు. మిగిలిన మార్కెట్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో చెక్పోస్టులపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో మార్కెట్ల ఆదాయాలపై ప్రభావం చూపింది. కొంతకాలం తర్వాత తిరిగి వ్యవసాయ మార్కెట్లలో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. ఊహించని విధంగా పంట ధరలు పెరిగిపోయాయి. మరో ఆర్థిక సంవత్సరం ముగిసే అవకాశం ఉండడంతో రాష్టంలోనే జిల్లా మార్కెటింగ్శాఖ ఆదాయాలు సమకూర్చుకోవడంతోపాటు ప్రథమ స్థానంలో నిలిచే విధంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఏటా ఫిబ్రవరి లేదా మార్చిలో రాబోయే సంవత్సరానికి సంబంధించి సెస్ ద్వారా మార్కెట్కు వచ్చే ఆదాయ వివరాల అంచనాను ఆయా మార్కెట్ కమిటీల అధికారులు డీఎంవో కార్యాలయానికి పంపుతారు. అక్కడి నుంచి జేడీఎం ఆమోదంతో మార్కెటింగ్శాఖ డైరెక్టర్ ఆమోదానికి వెళ్తుంది. మరోమారు పరిశీలన తర్వాత ఆయా మార్కెట్లకు రాష్ట్ర మార్కెటింగ్శాఖ నెలవారీగా టార్గెట్లను సంవత్సరానికి నిర్దేశిత లక్ష్యాలను అందిస్తారు. గతేడాది ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కొవిడ్-19 కారణంగా ఆయా మార్కెట్ కమిటీలే స్వయంగా అంచనా టార్గెట్లను పెట్టుకోవడం జరిగింది. జిల్లా మార్కెటింగ్శాఖకు సంబంధించి రూ.29,27 కోట్లుగా అంచనా వేశారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత మార్చి నెల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను తిరిగి రాష్ట్ర మార్కెటింగ్శాఖ నిర్దేశించింది. అందులో భాగంగానే ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.17.61 కోట్లకుగాను నేటివరకు రూ.16.43 కోట్లు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.4.05 కోట్లు కాగా.., నేటి వరకు రూ.2.21 కోట్లు, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ లక్ష్యం రూ.4.05కోట్లు కాగా, నేటి వరకు రూ.64.18 లక్షలు, కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ టార్గెట్ రూ.1.48 కోట్లు కాగా, నేటివరకు రూ.81.78 లక్షలు, వైరా మార్కెట్ కమిటీ ఆదాయం లక్ష్యం రూ.2.25 కోట్లు కాగా, రూ.1.05 కోట్లు, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయం లక్ష్యం రూ.2.55కోట్లు కాగా, రూ.2.47 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడం జరిగింది. సత్తుపల్లి మార్కెట్ కమిటీ ఆదాయం రూ.2.72 కోట్లు కాగా, రూ.62.61లక్షలు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ టార్గెట్ రూ.1.85 కోట్లు కాగా, రూ.92.68 కోట్ల ఆదాయం సమకూరింది.
ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు ఆర్థిక పరిపుష్టి దిశగా పయనిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో అమలు చేసిన చట్టాలు వ్యవసాయ మార్కెట్ల ఆదాయానికి కొంత అవరోధంగా నిలిచినా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల ధరలతో వ్యవసాయ మార్కెట్లు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. కరోనా, కేంద్ర వ్యవసాయ చట్టాల ప్రభావాన్ని ఎదుర్కొంటూ వ్యవసాయ మార్కెట్లు నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలు చేరువయ్యాయి. గడిచిన రెండేళ్లలో ఆయా మార్కెట్లలో కొనుగోలు కేంద్రాల ద్వారా రావాల్సిన పెండింగ్ నిధులు దాదాపు రూ.13 కోట్లు ఆయా మార్కెట్ల ఖజానాకు చేరడం మార్కెట్ల ఆదాయాలపై ప్రభావం చూపింది. 2021-22 సంవత్సరానికిగాను జిల్లా మార్కెటింగ్శాఖ పరిధిలోని ఖమ్మం, నేలకొండపల్లి, మద్దులపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏన్కూరు, సత్తుపల్లి మార్కెట్లు నిర్దేశిత లక్ష్యాలు పెట్టుకున్నాయి. జిల్లా వ్యవసాయశాఖ పరిధిలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి మార్కెటింగ్ శాఖ 2021-22 సంవత్సరాలనికి గాను రూ.36.57 కోట్ల ఆదాయం టార్గెట్గా నిర్ణయించింది. లక్ష్యం చేసుకునేందుకు మరోరెండు నెలల సమయం మాత్రమే ఉంది.
కొవిడ్ ప్రభావం చెక్పోస్టులపై పడకుండా చేసేందకు అధికారులు, సిబ్బంది తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో గతేడాది ఆదాయం సమకూరింది. జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ల పరిధిలో మొత్తం 20 చెక్ పోస్టులున్నాయి. మార్కెట్లలో క్రయవిక్రయాల ద్వారా 1శాతం పన్ను మార్కెట్లకు లభిస్తుండగా.., చెక్పోస్టుల ద్వారా మరో 1శాతం ఆదాయం వస్తుంది. ఈ సంవత్సరం కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన నూతన చట్టాల ప్రభావం కనిపించింది. దీంతో కొద్దినెలల పాటు చెక్పోస్టుల నిఘా ఎత్తేయడంతో తద్వారా చేకూరే ఆదాయంపై ప్రభావం చూపింది. గడిచిన రెండు,మూడు నెలల నుంచి తిరిగి చెక్పోస్టుల ఆదాయం ప్రారంభమైంది. ఈ ఏడాదికిగాను నేటి వరకు (జనవరి నెల) వరకు వచ్చిన ఆదాయాలను పరిశీలిస్తే ఖమ్మం ఏఎంసీలో ఒక చెక్పోస్టు ద్వారా రూ.45.28 లక్షలు ఆదాయం రాగా.. మధిర మార్కెట్ పరిధిలోని నాలుగు చెక్పోస్టుల నుంచి రూ.1.53 కోట్లు, నేలకొండపల్లి ఏఎంసీ పరిధిలోని నాలుగు చెక్పోస్టుల నుంచి రూ.44.01 లక్షలు, కల్లూరు మార్కెట్ పరిధిలోని మూడు చెక్పోస్టుల నుంచి రూ.81.34 లక్షలు, వైరా మార్కెట్ పరిధిలోని మూడు చెక్పోస్టుల ద్వారా రూ.82.01 లక్షలు, ఏన్కూరు ఏఎంసీ పరిధిలోని ఒక చెక్పోస్టు నుంచి రూ.22.24 లక్షలు, సత్తుపల్లి మార్కెట్ పరిధిలో మూడు మార్కెట్ల ద్వారా రూ.62.61 లక్షలు, మద్దులపల్లి ఏఎంసీ పరిధిలోని ఏకైక చెక్పోస్టు ద్వారా మరో రూ.29.40 లక్షల ఆదాయం సమకూర్చుకోవడం జరిగింది. మొత్తం 20 చెక్పోస్టుల ద్వారా నేటి వరకు రూ.5.19కోట్ల ఆదాయం సమకూరింది.
ఏటా చిన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలో పెసర, కంది, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేవి. ఈ ఏటా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఒకటి,రెండు మార్కెట్ల ఆదాయం కొంత తగ్గింది. గతేడాదితో పోల్చితే రూ.9 కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది. ఖమ్మం, మధిర, ఏన్కూరు వంటి మార్కెట్ల ఆదాయం లక్ష్యానికి మించి సమకూరే అవకాశం ఉంది. టార్గెట్ చేరుకునేందుకు మరోరెండు నెలల సమయం ఉంది. ఆ దిశగా కార్యాచరణ తయారు చేసి అప్రమత్తం చేస్తున్నాం.
-కే నాగరాజు, డీఎంవో, ఖమ్మం
పంట కొనుగోలు చేసిన ఖరీదుదారుల నుంచి రావాల్సిన సెస్ వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. కొద్ది నెలల నుంచి పెండింగ్ బకాయిల జాబితాను తయారు చేసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఫలితంగా మార్కెట్ కమిటీ ఆదాయం ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది మార్కెట్ కమిటీ లక్ష్యానికి మించి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు దిగుబడులు గణనీయంగా తగ్గాయి. పంటల ధరల పెరుగుదలతో మంచి ఫలితాలొస్తున్నాయి.
-రుద్రాక్ష మల్లేశం, ఖమ్మం ఏఎంసీ సెక్రటరీ
రెండేళ్ల నుంచి కరోనా ప్రభావం మార్కెట్ల ఉద్యోగులను వెంటాడుతూనే ఉంది. లాక్డౌన్ సమయంలో ఉదయం నుంచి రాత్రి చెక్పోస్టుల డ్యూటీలను ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్ల ఆదాయం ఆశాజనకంగా ఉంది. ప్రతి ఉద్యోగి మార్కెట్ ఆదాయం పెంపొందించుకోవడమే ధ్యేయంగా పని చేయాలి.
-తాడెపల్లి కిరణ్కుమార్, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు