మామిళ్లగూడెం, జూన్ 24 : వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులనే నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. స్వయం ఉపాధితో జీవించేందుకు వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. అత్యంత వెనుకబడిన తరగతులకు రూ.లక్ష అందించే ఈ కార్యక్రమాన్ని దశాబ్ది వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇందుకోసం జిల్లాలో వివిధ వృత్తి కులాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో అర్హులను గుర్తించి ప్రతి నెలా 15న విడతల వారీగా లబ్ధిదారులకు రూ.లక్ష సాయం అందించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల కావడంతో దరఖాస్తుదారులు, ఆయా వృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండలాలవారీగా దరఖాస్తులు ఇలా..
ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 26,480 మంది దరఖాస్తు చేసుకున్నారు. మండలాల వారీగా చూస్తే.. బోనకల్లు – 951, చింతకాని 1,433, ఏన్కూరు-709, కల్లూరు- 942, కామేపల్లి – 950, ఖమ్మం రూరల్ 1,762, ఖమ్మం అర్బన్ – 815, ఖమ్మం నగర పాలక సంస్థ 2,105, కొణిజర్ల 1,505, కూసుమంచి 1,335, మధిర – 831, మధిర మున్సిపాలిటీ – 659, ముదిగొండ 1,329, నేలకొండపల్లి 1,495, పెనుబల్లి 1,096, రఘునాథపాలెం 1,042, సత్తుపల్లి – 720, సత్తుపల్లి మున్సిపాలిటీ – 468, సింగరేణి – 485, తల్లాడ 1,378, తిరుమలాయపాలెం 1,257, వేంసూరు – 884, వైరా – 849, వైరా మున్సిపాలిటీ – 693, ఎర్రుపాలెం 877 చొప్పున అందాయి.
26లోగా లబ్ధిదారుల గుర్తింపు..
అందిన దరఖాస్తులను పరిశీలించి ఈనెల 26లోగా లబ్ధిదారులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మండల, మున్సిపాలిటీ స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలిస్తారు. లబ్ధిదారులు తప్పకుండా దరఖాస్తులో సూచించిన చిరునామాలో నివాసం ఉండాలి. అభ్యర్థులు 2023, జూన్ 2 నాటికి 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వరకు ఉండాలి. గతంలో రూ.50 వేల ఆర్థిక సాయం పొందిన వారికి ఈ రుణాలు వర్తించవు. మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో ఎంపికైన జాబితాను జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారికి అందిస్తారు. అక్కడ పరిశీలించిన అనంతరం దానిని కలెక్టర్ ఆమోదానికి పంపుతారు. మరోసారి కలెక్టర్ పరిశీలించి ఆమోదించాక లబ్ధిదారుల అర్హతలనుబట్టి విడతలవారీగా ఆర్థిక సాయం అందిస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు. ఎంపికైన వారి వివరాల జాబితాను మండలాలు, గ్రామాల్లో ప్రదర్శిస్తారు. ఎంపికైన వారికి ఒకేసారి రూ.లక్ష సాయాన్ని అందిస్తారు. ఆ మొత్తంతో వారు తమకు నచ్చిన స్వయం ఉపాధి యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. లబ్ధిదారులు స్థాపించిన యూనిట్లను సంబంధిత ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. లబ్ధిదారుడు, యూనిట్తో కూడిన ఫొటోలను నెల రోజుల్లోగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. లబ్ధిదారులు కనీసం రెండేళ్లపాటు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లుగా ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలి.
నిబంధనల మేరకు పంపిణీ..
ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక సాయం పంపిణీ చేస్తాం. వారు ఆ మొత్తంతో ఏదైనా యూనిట్ ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందేలా పర్యవేక్షిస్తాం. వృత్తికులాల్లో అత్యంత వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యమిస్తాం. మండలాల వారీగా అందిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాం.
– జీ.జ్యోతి, ఖమ్మం జిల్లా
బీసీ సంక్షేమాధికారి, ఖమ్మం