పెనుబల్లి, మే 24 : ‘మాయదారి కాంగ్రెస్ వచ్చి మా అందరికీ కష్టాలు తెచ్చిపెట్టింది’ అంటూ కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇన్నాళ్లూ కర్షకులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, అన్నదాతల కోసం ఆయన అహర్నిశలూ శ్రమించారని గుర్తుచేశారు. ఇప్పుడొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో తమలాంటి అన్నదాతలందరూ అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం జరిగిన పట్టభద్రుల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్రావు.. అనంతరం ఖమ్మానికి తిరుగు ప్రయాణమై వస్తున్నారు. ఈ క్రమంలో తల్లాడ మండలం మిట్టపల్లి శివారున అదే గ్రామానికి చెందిన రైతులు కల్యాణపు చిన్నసత్యం, కల్యాణపు కృష్ణయ్య, రామిశెట్టిపల్లి లక్ష్మణరావు సహా మరికొంతమంది రైతులు కలిసి మాజీ మంత్రి వాహనాన్ని ఆపారు. వారిని గమనించి వాహనం దిగిన హరీశ్రావు.. ‘ఏం పెద్దాయన.. బాగున్నారా.. వ్యవసాయం ఎలా ఉన్నది.. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నది?’ అంటూ పలుకరిస్తూ వారితో కలిసి వారి పొలాల్లోకి వెళ్లారు. ‘ఏం చెప్పమంటారు సారు.. మా బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు తమ బాధలన్నింటినీ హరీశ్రావు ఎదుట వెళ్లబోసుకున్నారు. ‘సారూ.. మా రైతుల పక్షాన అసెంబ్లీలో పోరాడండి. మేమంతా కదిలివచ్చి అసెంబ్లీని ముట్టడిస్తాం. అందరూ కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దాం.’ అని అన్నారు. ‘అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ ఇస్తానంటోంది. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వనంటోంది. పంటలకు సాగునీళ్లు ఇవ్వలేదు. మోటరు వేసుకునేందుకు కరెంటూ ఇవ్వలేదు. ఆఖరికి పంటల పెట్టుబడికి రైతు భరోసా కూడా ఇవ్వలేదు.’ అంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.
అనంతరం మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై సోయి లేకుండా పోయిందని విమర్శించారు. రైతుల ఆవేదనను ఆలకించిన ఆయన.. అక్కడి నుంచే తల్లాడ మండలం వ్యవసాయాధికారి తాజుద్దీన్కు ఫోన్ చేసి మాట్లాడారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందించకపోతే ఎలా అని, ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. అనంతరం అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నదని ఆరోపించారు. రైతుల సాదకబాదకాలు తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డెక్కగానే ప్రభుత్వం స్పందించి హుటాహుటిన రైతుబంధు జమ చేసిందని, తాగునీటి కోసం సాగర్ జలాలు విడుదల చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుంటే ప్రతిరోజూ ప్రజల మధ్యనే ఉండి పోరాడుతామని, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతుల కోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అన్ని రకాల వడ్లకూ కచ్చితంగా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవే సమస్యలపై అన్నదాతల పక్షాన అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున పోరాడుతామని తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఒక్కో హామీ గురించి ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు.