తిరుమలాయపాలెం, మార్చి 4 : చెరువులు, కుంటల కింద యాసంగి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న నీటితో నారు పోసిన నాటి నుంచి పంట ఏపుగా వచ్చే వరకు నెట్టుకొచ్చిన రైతులు ప్రస్తుతం చెరువులు, కుంటల్లో నీరు అడుగంటడంతో పంటను చూసి దిగులు చెందుతున్నారు. కొందరు ముందస్తు ఆలోచనతో సాగు చేయకపోవడంతో మాగాణి భూములన్నీ బీళ్లుగా మారాయి. బచ్చోడు, జూపెడ, సుబ్లేడు, బీరోలు, పిండిప్రోలు, తెట్టెలపాడు, తాళ్లచెరువు, పాతర్లపాడు, మేడిదపల్లి తదితర ప్రాంతాల్లో చెరువుల కింద సాగు చేసిన పొలాలకు నీరందకపోవడంతో నెర్రెలుబారుతున్నాయి.
గత కేసీఆర్ ప్రభుత్వం భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తిరుమలాయపాలెం మండలానికి శాశ్వతంగా సాగునీరు అందించి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది. పాలేరు రిజర్వాయర్ నుంచి భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలోని చెరువులను నింపి రబీలో పంటలకు పుష్కలంగా నీరందించింది. గత ఏడాది ఈ సమయంలో చెరువులు, కుంటలు జలకళతో నిండుకుండలను తలపించాయి. ఈ ఏడాది మాత్రం చెరువులు, కుంటల్లో నీరులేక పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం గత ఏడాది రబీలో రైతులు 13,050 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈ ఏడాది 11,267 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు.
అయితే చెరువుల కింద సాగు చేసిన పొలాలు సైతం నీళ్లులేక ఎండిపోతున్నాయి. ప్రభుత్వం సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్కు నీటిని తెప్పించి భక్తరామదాసు లిఫ్టు ద్వారా చెరువులు నింపకపోవడమే ఈ దుస్థితికి కారణమని రైతులు భావిస్తున్నారు. ఉమ్మడి పాలనను గుర్తు చేసుకుంటూ మళ్లీ పాత రోజులు వస్తాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది నీళ్లకు కొదవ లేదు. ఈ ఏడాది చెరువులో నీళ్లు సరిగ్గా లేవు. కొన్ని పొలాలకు నీరందక ఎండిపోతున్నాయి. చెరువు కింద బావులు, బోర్లు ఉన్నవారు వరుస తడులు పెట్టి పంటలను కాపాడుకుంటున్నారు. ఈ ఏడాది యాసంగి పొలాలు పండడం కష్టంగానే ఉంది. ఈసారి దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంది.
– శ్రీరాములు, రైతు, బచ్చోడు
చెరువుల్లో నీళ్లులేక యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు ఎండిపోతున్నాయి. సుబ్లేడు చెరువు కింద కాల్వలు సరిగ్గా లేక నీళ్లు పారడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని భక్తరామదాసు లిఫ్టు ద్వారా చెరువులు, కుంటలు నింపి రైతులను ఆదుకోవాలి.
– ఎస్డీ జీయావుద్దీన్, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు, సుబ్లేడు