రైతులు సంఘటితం కావాలి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఉద్యానవన శాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రామిరెడ్డి
నేలకొండపల్లి, జూలై 6: రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసుకోవాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లిలో భక్త రామదాసు సర్వీసు సొసైటీ, కామదేను ఎఫ్పీసీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ దేశాల్లో సాగు చేస్తున్న పంటలు, సాగు విధానం, దేశంలో సాగు విధానం మధ్య తేడాలను రైతులకు వివరించారు. రైతులు సంఘటితంగా ఏర్పడి పంటలు సాగు చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్నారు. మనం సాగు చేసిన పంటలను అవసరమైతే ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునేలా ఉండాలన్నారు. రైతులకు పలు అంశాలపై ఆయన సలహాలు, సూచనలు చేశారు. అనంతరం పలువురు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పంటల సాగు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సదస్సులో ఉద్యానవన శాఖ డీడీ మధుసూదన్, జిల్లా వ్యవసా యాధికారి విజయనిర్మల, జిల్లా ఉద్యానవన అధికారి అనసూయ, కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, సర్వీసు సొసైటీ అధ్యక్షుడు యలమద్ది లెనిన్, ప్రధాన కార్యదర్శి పాలడుగు పూర్ణచంద్రప్రసాద్, కామదేను ఎఫ్పీసీ చైర్మన్ నెల్లూరి వీరబాబు, వెల్లపల్లి శ్రీనివాస్, ఏటుకూరి వెంకటరామారావు, బొనగిరి యుగందర్, పొన్నగాని శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.
లాభసాటి పంటలను సాగు చేయాలి
తిరుమలాయపాలెం, జూలై 6 : అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యానవన శాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. తిరుమలాయపాలెంలో రైతులు సాగు చేసిన ఆయిల్పామ్ తోటలను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం రైతు వేదికలో జరిగిన రైతు సదస్సులో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సాగు నీరు, ఉచిత విద్యుత్ సౌకర్యం, పెట్టుబడి సాయం అందిస్తున్నది. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధిక ఆదాయం అందించే పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. రైతులు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని వ్యవసాయానికి అనుబంధ వృత్తులను చేపట్టి అదనపు ఆదాయం పొందాలని కోరారు. డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని, ప్రభుత్వం సబ్సిడీతోపాటు గిట్టుధర కల్పిస్తున్నదన్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ చేపట్టేందుకు లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానవనశాఖ ఉపసంచాలకులు మధుసూదన్రావు, బి.బాబు, ఖమ్మం సహాయ సంచాలకురాలు అనిత, ఉద్యానశాఖ అధికారులు సందీప్, వేణు, అపర్ణ, మీనాక్షి, సర్పంచ్ కొండబాల వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయాధికారి సీతారామిరెడ్డి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.