అన్నపురెడ్డిపల్లి, మార్చి 9: సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకే ముందుగా సాగునీళ్లు ఇవ్వాలని అన్నపురెడ్డిపల్లి మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న కాలువల ద్వారా స్థానిక చెరువులను నింపాలని, వాటి ద్వారా తమ పంట పొలాలకు జలాలు అందించాలని కోరారు. ఈ మేరకు సీతారామ కాలువ నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరూ కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల గుంపెన గ్రామ శివారులోని సీతారామ కాలువ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రాజెక్టు కాలువ కింద కోసం భూములు కోల్పోయిన తమకు ప్రస్తుత ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. లింక్ కెనాళ్లతో ఇతర జిల్లాలకు తరలిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. కాలువ కోసం భూములిచ్చిన తమకు తొలి ప్రాధాన్యంగా నీళ్లు ఇవ్వకుండా వేరే జిల్లాలకు తరలిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులు వేముల హరీశ్, మామిళ్లపల్లి రామారావు, వెంకటేశ్, ప్రవీణ్, గోపాలరావు, కిరణ్, సుధాకర్, చిరంజీవిరావు, సుబ్బారావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, ప్రసాద్, వెంకటేశ్వరరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టును నిర్మించిన గత ముఖ్యమంత్రి కేసీఆర్కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని అన్నపురెడ్డిపల్లి మండల రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు నిరసన దీక్ష శిబిరం వద్ద ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలతోనూ, గోదావరి జలాలతోనూ అభిషేకం చేశారు. ‘జై కేసీఆర్’, ‘జైజై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు.