బీఆర్ఎస్ ప్రభుత్వం అడగకుండానే రైతుల అవసరాలన్నీ తీరుస్తోంది. ఏళ్లనాటి కష్టాలను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంటు, నీటి సమస్యను పూర్తిగా రూపుమాపారు. దీంతో రెండు పంటలు పండుతున్నాయి. రైతులు హాయిగా ఉన్నారు. అయితే ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు పిచ్చికూతలు కూస్తున్నారు. అధికారంలోకి వస్తే 3గంటల కరెంటు ఇస్తాం.. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోండి అంటూ సాగుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ధరణి పోర్టల్ను తీసివేసి భూమాత పోర్టల్ పెడతామని, పటేల్, పట్వారీ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని సిగ్గులేకుండా చెబుతున్నారు. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రాత్రంతా పొలాల వద్ద కరెంట్ కోసం పడిగాపులు పడిన రోజులను ఎలా మర్చిపోతామని కన్నెర్ర చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పాడిపంటలతో తమ జీవితాలు సజావుగా సాగుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు అని నినదిస్తున్నారు. కాంగ్రెసోళ్లను దరిదాపుల్లోకి రానివ్వమని ప్రతిజ్ఞ బూనుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అడగకుండానే రైతుల తీరొక్క అవసరాలు తీరుస్తోంది. ఏళ్లనాటి కష్టాలను కళ్లారా చూసిన సీఎం కేసీఆర్ సాగు రైతులు బాగుపడేలా.. కరెంటు, నీటి సమస్యలు లేకుండా రెండు పంటలు పండించుకునేలా చేశారు. ఎన్నికలు రాగానే సాగుపై అవగాహన, భూముల విలువ తెలియని కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నాయి. రైతులు బాగుపడొద్దనే ఉద్దేశంతో అధికారంలోకి వస్తే మళ్లీ పాత విధానాలే తీసుకొస్తామని చెబుతున్నారు. పంట పండించుకోవాలంటే 3 గంటల కరెంటు సరిపోతుందని, 10హెచ్పీ మోటర్లు పెట్టాలని చెప్పడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ధరణి పోర్టల్ను తీసివేసి భూమాత పోర్టల్ పెడతామని, పటేల్, పట్వారీ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని కుట్ర పన్నడంపై మండిపడుతున్నారు. పాడిపంటలతో మా జీవితాలు సజావుగా సాగుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్కే మా మద్దతు అని రైతులు చెబుతున్నారు. కాంగ్రెసోళ్లను దరిదాపుల్లోకి రానివ్వమని అంటున్నారు.
ధరణి పోర్టల్ ప్రారంభంతోనే రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుభీమా, రైతుబంధు పథకాలు రైతులకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ సారధ్యంలో రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్దే. రైతు బాంధవుడు కేసీఆర్ను గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆన్లైన్లో భూ రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తున్నామని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అనేక ఇబ్బందులకు గురయ్యాము. రైతుల భూములను కూడా అగ్రవర్ణాలకు రికార్డులు సృష్టించారని, ధరణితో దళారి వ్యవస్థ పూర్తిగా రూపుమాపిన ఘనత కేసీఆర్దే అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే దళారులకు కొమ్ముకాస్తుంది. రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ధరణిని తీసేస్తామంటున్నారు. పటేల్, పట్వారి వ్యవస్థను తీసుకువచ్చి రైతుల భూములను ఇష్టమొచ్చినట్లు మార్చే పద్ధతికి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. ధరణిని తీసేస్తామని చెబుతున్న కాంగ్రెసోళ్లు తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తారు. వాళ్లకు అధికారం ఒక్కటే యావ. రైతుల కోసం కేసీఆర్ ధరణి తీసుకొచ్చి బాగుచేస్తుంటే..కాంగ్రెసోళ్లు రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ధరణిని తెచ్చిన కేసీఆర్కే మా మద్ధతు. కాంగ్రెస్ మాటలు నమ్మం. మళ్లీ మూడోవసారి ముఖ్యమంత్రి కేసీఆరే.
కాంగ్రెస్ హయాంలో అష్టకష్టాలు పడ్డాం. ఎప్పుడు కరెంటు పోవుడు… వచ్చుడు.. మోటర్లు కాలిపోవుడే. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నారు. ఒక్క మోటరు కూడా కాలడంలేదు. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి మూడు గంటలే కరెంటు, 10హెచ్పీ మోటర్లు పెట్టుకోమంటున్నారు. వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వస్తే మోటర్లకు మీటర్లు కూడా పెడతారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మళ్లీ కాంగ్రెస్ పాలన అంటేనే భయమేస్తుంది. కేసీఆరే రావాలి. రైతులందరూ చల్లగుండాలి.
ఎద్దు వ్యవసాయం చేయని వ్యక్తి రేవంత్రెడ్డి. రేవంత్రెడ్డికి రైతు కష్టాలు తెలియవు. మూడు గంటల కరెంటు అంటే మూడు మళ్ళు కూడా తడవని పరిస్థితి. 24 గంటలు కరెంటు ఇస్తున్న కేసీఆర్ను కాదని కాంగ్రెస్కు ఓటు వేస్తే రైతులకు మళ్లీ కరెంటు కష్టాలు తప్పవు. రైతులు అరిగోసకు గురికావాల్సిందే. బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం..
ధరణి రద్దు చేస్తే మళ్లీ దళారుల ఆగడాలు మొదలవుతాయి. భూ రికార్డులు మార్చి భూ కబ్జాలకు గురికాక తప్పదు. రైతుల భూములకు రక్షణ ఏర్పరించింది కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే.. ధరణిని రద్దు చేస్తామనడం అన్యాయం. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి సీఎం చేయాలని రైతులను వేడుకుంటున్నా.
కేసీఆర్ సారు ధరణి తెచ్చినంక బ్రోకర్లు లేరు.. లంచం ఇచ్చే పని లేదు. రైతులు భూములు కొన్నా, అమ్మినా వెంటనే రికార్డు మారుతున్నది.. పట్టా పుస్తకం వస్తున్నది. అంతకు ముందు రైతుకు ఏ రికార్డు కావాలన్న చేయి తడపాల్సిందే. ఏదైనా పనుండి తహసీల్ ఆఫీసుకు పోతే పట్టించుకునేటోల్లు కాదు. వీఆర్వోకి కోపమెస్తే రికార్డులు తారుమారు అయ్యేటియి. ఒకళ్ల పొలం ఇంకొకల్లకి ఎక్కించేటోల్లు. ఇయ్యాల రికార్డులో నా పేరు మారాలంటే నేను ఎవల్లకైనా అమ్మి ఏలు ముద్ర వేస్తేనే మారుతుంది లేక పోతే మారట్లేదు. రిజిస్ట్రేషన్లు కూడా సులభంగా అవుతన్నాయి. గతంలో భూమి కొంటే బ్రోకర్లను ఎతికోటోల్లం వాల్లకి కాక సారుకు లంచం ఇస్తేనే పని అయ్యేటిది లేకపోతే ఎన్ని రోజులు తిరిగినా అయ్యేటిది కాదు కానీ ఇయ్యాల బ్రోకర్లు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నం. సీఎం గా కేసీఆర్ సారే రావాలి..
పెద్ద మోటర్లు పెడితే మూడు గంటల్లోనే పొలం తడుస్తుది అని చెపున్న ఆ మోటరు ఎవరు కొనిస్తరు. 24 గంటల కరెంటు ఇస్తుంటే ఇప్పుడు ప్రశాంతంగా పొలానికి నీల్లు కడుతున్నం మల్లా పెద్ద మోటర్లు అంటే అయి గంటకే బాయిలో నీల్లు ఇంకిపోతయి. మల్లా ఓ పూట ఆగి మోటరు ఎయ్యాలే. ఇప్పడు ఉదయం నుంచి సాయంత్రం దాకా నీల్లు కట్టి ఇంటికి పోతున్నం మల్లా తెల్లారికి బావుల్లో నీల్లు ఊరుతున్నయి. అదే 10 హెచ్పీ మోటర్ అంటే ఆశామాషీ కాదు.. కనీసం రూ. 50 వేలు అయినా అయితది చిన్న సన్నకారు రైతులు అన్ని డబ్బులు పెట్టి మోటర్లు కొనగలరా. గతంలో చిన్న మోటర్లకే కరెంటు ఇయ్యలేక పోయిన్రు ఇప్పుడు పెద్ద మోటర్లు పెట్టి అంతా ఒక్కసారే మోటర్లు వేస్తే అయి ఉంటయా.. పోతయా.. మా మద్దతు కేసీఆర్ సార్కే..
రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. రైతులకు ఏం చేస్తే మంచి జరుగుతుందో ఆయనకు తెలుసు. రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇచ్చారు. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. కష్టాల ఊబిలో నుంచి బయటకు వచ్చిన రైతును కాంగ్రెస్ నాయకులు వచ్చి మళ్లీ కష్టాలపాలు చేసేందుకు చూస్తున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ సరిపోదు. కేసీఆర్ అందిస్తున్న నాణ్యమైన 24 గంటలు కరెంట్ సరిపోతుంది. కేసీఆర్ గెలిపించుకుంటేనే రైతులకు కష్టాలు రావు.
రైతులకు మూడు గంటలు కరెంట్చాలని రేవంత్రెడ్డి మాట్లాడటం సరికాదు. 10 హెచ్పీ మోటార్తో మూడు గంటల్లో పొలానికి నీరు సరిపోతాయని చెప్పడం అవివేకం. ఇది సాధ్యం కాని పని. వ్యవసాయ బోర్లకు 3 లేదా 5 హెచ్పీ మోటార్లనే వాడతారు. 10 హెచ్పీ మోటార్లతో నీటిని గుంజితే ఒక్కసారిగా బోర్లలో నీళ్లు ఇంకిపోయే ప్రమాదం ఉంది. ఇది రైతులతో సాధ్యమయ్యే పరిస్థితి కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్తో పంటలు మంచిగా పండించుకుంటున్నాం. మళ్లీ కేసీఆరే సీఎం గా రావాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న 24 గంటల కరెంటుతో రైతులు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు మూడు గంటలు ఇస్తామన్న కరెంటుతో రైతులు ఎలా వ్యవసాయం చేస్తారు. అది సాధ్యంకాని పని. రైతులకు రైతుబంధు, 24 గంటల విద్యుత్ ప్రభుత్వం ఇస్తుంది. రైతుల మోటర్ల దగ్గర మీటర్లు లేవు…నీరు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ నాయకులు, 10హెచ్పీ మోటర్లతో మాకు పనేంటి. ప్రస్తుతం రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివిధాలుగా మంచే చేస్తుంది. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.
కాంగ్రెస్ అంటున్నట్లుగా మూడు గంటల కరెంటు ఇస్తే ఎట్లా సరిపోతుంది. కేవలం ఒక్క మడి కూడా తడవదు. గతంలో రాత్రిపూట రెండు, మూడు గంటల కరెంటు కోసం బావుల వద్దకు వెళ్లి టార్చిలైట్లు పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ కష్టాలు మర్చిపోలేం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కరెంటు బాధలు తప్పాయి. 10హెచ్పీ మోటరు పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఆ మోటార్లు ఎవరు కొనిస్తారు. అంత ఖర్చు రైతు పెట్టుకోలేడు. కాంగ్రెస్ నాయకులు రైతుల జోలికి రాకుండా ఉండాలి రైతులంతా సంతోషంగా ఉన్నాం. పాత రోజులు తేవద్దు. కేసీఆర్ మళ్లీ మూడోవసారి ముఖ్యమంత్రి కావాలి.
కాంగ్రెస్ నాయకులకు కరెంట్ ఇచ్చే సత్తా లేదు. నిజంగా రైతుల అంటే వారికి ఇష్టం ఉంటే అప్పుడు ఎందుకు ఇయ్యలేదు. తెలంగాణ వస్తే మొత్తం చీకటి అయితది అని అప్పట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పారు. కనీసం రైతుల ఇబ్బందులను చూసి ప్రయత్నం కూడా చేయలేదు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే అవసరమై కరెంట్ ఇచ్చుడు మొదలు పెట్టారు. ఇప్పుడైతే ఏ ఒక్క రైతులకు కరెంట్ సమస్య లేదు. ఇంతమంచి కరెంట్ను వదులుకొని మూడు గంటల కరెంట్ ఇస్తామని చెప్పే కాంగ్రేస్ నాయకులను ఎవరూ పట్టించుకోరు. వాళ్లకు చేతకాదు. ఏవరైనా మంచిగా పాలన చేస్తే ఓర్వలేరు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల ముఖం చూసే వాళ్లు కూడా ఉండరు.
భూమల జోలికి వచ్చి మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం.. అంటే ఊరుకునేది లేదు. మా భూమల గురించి వాళ్లకు మాట్లాడే హక్కు ఉంటుంది. గతంలో ఎక్కడ చూసినా భూమి పంచాయితీలే ఉన్నాయి. ఎంతోమంది భూ తగదాల వలన కుటుంబాలు వీడిపోయాయి. వాటిని సరిదిద్ది తగాదాలు వద్దనే సీఎం కేసీఆర్ ధరణి తీసుకొచ్చారు. ఎవరి భూమలు వారి పేరుమీదనే ఉన్నాయి. గెట్ల పంచాయితీలు లేవు.. కానీ కాంగ్రెస్ నాయకులు మేము రాగానే ధరణి తీసివేస్తాం అని చెప్పడం అంటే గొడవలు తీసుకవస్తాం అని చెప్పడమే. ప్రశాతంగా ఉన్న రైతులను అగం చేస్తే రైతులు తమ సత్తా ఏంటో ఎన్నికల్లో చూపుతారు. ఇప్పటికే మూడు గంటల కరెంట్ మాటలు మానుకుంటే మంచిది.
ప్రతిపక్షానికి చెందిన నాయకులు 10హెచ్పీ సామర్థ్యం గల మోటార్లతో 3 గంటలు విద్యుత్ చాలు అంటున్నారు… కానీ 10హెచ్పీ మోటార్లను బోర్లలో దించితే నీళ్లను ఒక్కసారిగా గుంజితే బోర్లు ఉంటాయా… ఊడుతాయా…..యవుసం తెలిసిన రైతులకు ఎవుసం, కరెంట్, బోర్ల గురించి తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల మతిలేని మాటలకు పల్లె రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. సాధారణంగా16కేవీఏ, 25కేవీఏ, 63కేవీఏ, 100కేవీఏ సామర్ధ్యంతో ట్రాన్స్ఫార్మర్లతో ప్రస్తుతం పొలాల్లో విద్యుత్ సంస్ధ రైతులకు సేవలందిస్తోంది. 3గంటల విద్యుత్తో 10హెచ్పీ మోటార్లు బిగిస్తే ట్రాన్స్ఫార్మర్లు ఒక్కసారిగా కాలిపోవడం ఖాయం.. దీంతో పాటు 10హెచ్పీ మోటార్లు ఆన్ చేస్తే భూగర్బజలం నిండుకుండడంతో పాటు మోటార్ల లోడ్ ట్రాన్స్ఫార్మర్లపై పడి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం సహజం.. ఇవన్నీ తెలిసిన రైతులెవరూ ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ విధానానికే మొగ్గుచూపుతారు . రైతు పథకాలు ప్రజలకు అందిస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్. మూడో సారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని రైతులంతా కోరుకుంటున్నాము.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన యేడాది నుంచే పట్టపగలే వ్యవసాయం చేస్తున్నాము. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల ఏలుబడిలో కరెంట్ కష్టాలు పల్లెల్లోని ఏ ఒక్క రైతు మరచిపోలేదు. పదేళ్ల క్రితం రాత్రిపూట కుటుంబ సభ్యులను ఒంటరిగా ఇంటివద్ద వదిలిపెట్టి పొలాలకు వెళ్లి నీళ్లు పారించాము. రాత్రుళ్లు గట్లమీదనే పడుకుంటూ ఉండేవాళ్లం. నాటి రోజులు గుర్తుకు తెచ్చుకుంటేనే చాలా బాధగా ఉంది. నాడు వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు కరెంట్ ఇచ్చిన విధానం…. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో కర్షక, కార్మిక సంక్షేమ పథకాల ద్వారా సాగుకు స్వర్ణయుగం అందిస్తున్న విధానాన్ని రచ్చబండల వద్ద రైతులు పల్లెల్లో బేరీజు వేసుకుంటున్నారు. యావత్ రైతాంగం మూడోసారీ కేసీఆర్ను గెలిపించుకుని 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను ఇప్పించుకుంటాం.
సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంట్ సరిపోతుంది. బోర్లపై ఆధారపడే రైతులందరూ కేసీఆర్ ఇస్తున్న కరెంట్తో సంతోషంగా ఉన్నారు. కాంగ్రెసోళ్లు వచ్చి 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇప్పుడు ఆ మోటర్లు రైతులకు అవసరం లేదు. కాంగ్రెస్కు ఓటు వేస్తే రైతుల బతుకు కచ్చితంగా ఆగమవ్వడం ఖాయం. సీఎం కేసీఆర్ను గెలిపించుకొని రైతులందరం సంతోషంగా ఉందాం.
సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంట్ అవసరం. మూడు గంటలు కరెంట్ తీసుకువస్తే మళ్లీ రైతులకు గోస. 10 హెచ్పీ మోటర్లు పెడితే నీరుకాకుండా దుమ్మువస్తుంది. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ 24 గంటలకు కరెంట్ ఇస్తున్నాడు. కాంగ్రెసోళ్లు మాటలు నమ్మి రైతులు ఇబ్బందులు పడొద్దు. ప్రశాంతంగా పంటలు పండించుకోవాలంటే కేసీఆర్ మళ్లీ మూడోవసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం.
కాంగ్రెస్ నాయకులు మూడు గంటల విద్యుత్ అని కొత్త కథలు చెబుతున్నారు. అప్పుడు వ్యవసాయం ఇక మూలన పడ్డట్లే. ఎవరూ వ్యవసాయం చేయరు. ప్రస్తుతం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా అవుతున్నది. తెలంగాణ ప్రభుత్వం లో రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారు. 24 గంటల విద్యుత్, రైతుబంధుతో రైతులు దర్జాగా ఉన్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలనలో మూడు గంటల కరెంటు అంటే వ్యవసాయం చేసే పరిస్థితి రైతులకు ఉండదు. కేసీఆర్ ఇచ్చే విద్యుత్ బాగుంది…మళ్లీ ఈసారి బీఆర్ఎస్కే మా మద్ధతు.
ఇప్పుడున్న కరెంటుతో వ్యవసాయం పండుగలా చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఇస్తున్న 24 గంటల కరెంటుతో బాధలన్నీ తీరాయి. కాంగ్రెసోళ్లు మూడు గంటలు కరెంటు ఇస్తామని మాటలు చెబుతున్నారు. వారికి వ్యవసాయం గురించి పూర్తిగా తెలియదు. కాంగ్రెస్ వద్దు…వారి కరెంటు వద్దు. తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చే కరెంటుతో సంతోషంగా ఉన్నాం. మళ్లీ బీఆర్ఎస్సే రావాలి.
ధరణితోనే రైతుల భూములకు సమస్యలు ఉండవని, రైతుల భూములకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే కారుగుర్తుకే ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరు. ప్రజల మనిషి కేసీఆర్. కేసీఆర్తోనే రైతులకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందుతున్నాయి. భూమాత పేరుతో కాంగ్రెస్ ప్రజలకు అన్యాయమే చేస్తది తప్ప న్యాయం చేయదు.
కాంగ్రెస్ పార్టీ భూమాత పేరుతో ధరణి పోర్టల్ను తొలగిస్తామంటే చూస్తూ ఊరుకోం. ఓటుతో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతాం. రైతు భూమిని అమ్ముకోవాలంటే వేరొకరికి పట్టా అవడం ధరణిలో ఒకరోజులోనే పూర్తవుతుంది. గతంలో వీఆర్ఏ, వీఆర్వో, ఆర్ఐల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పనులు జరగలేదు. భూమికి పాస్బుక్ రాలేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులు మోసపోవద్దు. బీఆర్ఎస్కే ఓటు వేసి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దాం.
రైతుల ఆత్మహత్యలు, కరెంట్ షాక్లు, రాత్రులు చేలకు వెళ్లే దౌర్భాగ్య పరిస్థితి నుంచి గట్టెక్కించిన రైతు నాయకుడు సీఎం కేసీఆర్. 24 గంటలు కరెంట్తో రాత్రికి పొలానికి వెళ్లే పని లేకుండా పగలే పొలానికి నీళ్లు పెట్టుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మూడు గంటలు విద్యుత్, 10 హెచ్పీ మోటర్లతో తెలంగాణలో భూములు నోళ్లు తెరిచే పరిస్థితి. మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలవుతాయి. అటువంటి పార్టీని ప్రజలు, రైతులు నమ్మే పరిస్థితి లేదు. రైతులందరికీ ధరణితోనే న్యాయం జరుగుతుంది.