జూలూరుపాడు, జూలై 17 : తమ పంట భూములకు సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువల ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రైతులు జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాలువ కట్టపై శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం మండల నాయకుడు వి.చందర్, పలువురు రైతులు మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి ముందుగా సీతారామ జలాలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇక్కడి రైతుల అవసరాలు తీర్చకుండా ఇతర జిల్లాలకు నీటిని తరలించడం ఏమిటని వారు ప్రశ్నించారు.
తమ సాగు భూములకు నీరొస్తుందనే ఉద్దేశంతో కాలువల నిర్మాణానికి పంట భూములు సైతం ఇచ్చామని, అయినా తమకు ఆ నీరు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోనే సాగునీటి సదుపాయం లేని ఏకైక మండలంగా జూలూరుపాడు ఉందని, ఇదే మండలం మీదుగా సీతారామ జలాలు వెళ్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీసీఎం నాయకులు, రైతులు బానోత్ మధు, పద్దం సుగుణ, ఇల్లంగి సీతారాములు, ఈసం నరసింహారావు, వల్లమల్ల దానయ్య, భూక్యా సురేశ్, కోడం బకులు, ఇందిరా నాగేశ్వరరావు, గడిగ రాములు, గడగ లక్ష్మణరావు, బానోత్ గిరి, ముక్తి గాంధీ, తాటి బుచ్చిరాములు, రాజు, ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.