భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : ఎన్నో ఆశలతో యాసంగి సీజన్లో రైతులు వరితోపాటు కూరగాయల పంటలు సాగు చేశారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేసినా పూర్తి వేసవి రాకముందే చెరువులు, బావులు, కుంటల్లో నీరు అడుగంటడంతో రైతులు దిగులు చెందుతున్నారు. వానకాలం సీజన్లో చెరువులు, బావుల్లో సమృద్ధిగా నీరుండడంతో వరితోపాటు సాగు భూముల ఆధారంగా వివిధ రకాల పంటలు పుష్కలంగా పండించుకున్నారు. ప్రస్తుత యాసంగిలో సాగు చేసిన పంటలకు నీరందకపోవడంతో పొట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండిపోతున్నాయి. కూరగాయల పంటలకు సైతం నీరందక వడలిపోతున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా సాగు చేసిన పంటలను మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొందరు రైతులు నీటి వనరులను ముందస్తుగా అంచనా వేసి మాగాణి భూములను వదిలేయడంతో అవన్నీ బీళ్లుగా మారాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి రంది లేకుండా రెండు పంటలు పండించుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు రావడంతో ఏమి చేయాలో తోచక సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది యాసంగి సీజన్లో జిల్లాలో 60 వేలకుపైగా ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. ఈ ఏడాది 40 వేల ఎకరాల్లో సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, జలాశయాలు, చెరువులు, బావుల్లో నీరు అట్టడుగు స్థాయికి చేరడం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు, మూడు ఎకరాలలోపు రైతులకే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ చేయడంతో మిగిలిన రైతులు సాగు పనులకు స్వస్తి చెప్పారు. చేసేది లేక కొందరు రైతులు వరి పొలాల్లో ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగుకు సిద్ధమయ్యారు. రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ మొక్కలు నాటుతున్నారు.
పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో తుమ్మల చెరువు కింద గత ఏడాది రెండు కాలువల ద్వారా నీరందడంతో 8,500 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ ఏడాది రెండో కాలువ ద్వారా నీళ్లు రాకపోవడంతో 4,200 ఎకరాల్లోనే రైతులు వరి వేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆ మండలంలో సాగునీటి సమస్య తలెత్తకుండా మారెళ్లపాడు లిఫ్టును మంజూరు చేసింది. కానీ.. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై శ్రద్ధ చూపకపోవడంతో అది కార్యరూరం దాల్చలేదు. దీంతో అక్కడ రెండో కాలువకు నీరందలేదు.
ఇల్లెందు మండలం దనియాలపాడులో ఒక రైతు వేసిన మిర్చి పంట చేతికి రాకపోవడంతో సదరు రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. కానీ.. అక్కడి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉన్న బోర్లలో నీళ్లు రాక.. చెరువుల్లో చుక్క నీరులేక వేసిన మొక్కజొన్న పంట కంకి దశలోనే తేలిపోతుంది. దీంతో కంకులు తీయడానికి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలంలోని సర్వారం గ్రామంలో పంట పొలాల్లో మోటర్లు ఉన్నా విద్యుత్ సక్రమంగా రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. అక్కడి రైతులు వేసిన టమాట పంట వడలిపోయింది. ఉప్పరిగూడెంలో మరో రైతు హరి పొలంలో బోరు ఉన్నా నీరు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పంట వేయలేదు. సింగభూపాలెం చెరువులో నీటిమట్టం తగ్గడంతో అంజనాపురం రైతుల పంట కాలువలోకి నీరు రావడం లేదు. దీంతో ఆ ప్రాంత రైతులు కూడా యాసంగి సాగుపై ఆసక్తి చూపలేదు.
ఎకరం భూమికి బోరు వేసినా ఒక పంటకే నీళ్లు సరిపోతున్నాయి. దీనికి తోడు కరెంటు కోతలు ఎక్కువగా ఉండడంతో రెండో పంట వేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు తగ్గించింది. ఐదెకరాల్లోపు వారికే వస్తుంది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దుమ్ముగూడెం నుంచి కాలువ వస్తదని నాయకులు ప్రగల్భాలు పలికారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలువ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం.
మా ప్రాంతంలో చెరువులు లేవు. ఉన్న చెరువు ఎండిపోయింది. పొలంలో బోరు ఉన్నా నీరు రావడం లేదు. దీంతో మిర్చి పంట వేసి చాలా నష్టపోయాను. ఇక్కడి సాగునీటి సమస్యపై, రైతుల కష్టాల గురించి పట్టించుకునే వారు లేరు. పోడు భూముల్లో బోర్లు వేస్తే అటవీ శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా ఎంత కాలం కష్టాలో అర్థం కావట్లేదు.