‘తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి’ అనేది పాత సామెత. ‘పండిస్తే మిర్చి పండించాలి.. లాభాలు దండిగా పొందాలి’ అనేది నేటి రైతన్నల సంకల్పం. ప్రస్తుతం అధిక లాభాలు కురిపించే పంట ఏదైనా ఉందంటే అది మిర్చినే. మిర్చి తోటలకు చాకిరీ ఎక్కువ.. పెట్టుబడీ ఎక్కువే.. మరి రాబడి కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. అందుకే రైతన్నలు మిర్చి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు రూపాయలు వెనకేసుకోవాలంటే ఎర్ర బంగారం పండించాల్సిందే. ఒకప్పుడు నీరు, కరెంట్ సరిగా లేకపోవడంతో రైతన్నలు పత్తి పంటపై ఆశలు పెట్టుకునేవారు. నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంట్, చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరు, సకాలంలో రైతుబంధు, పంట రుణాలు, మార్కెట్లో ఫుల్గా విత్తనాలు, ఎరువులు లభిస్తుండడంతో రైతన్నలు మిర్చి సాగుకు జై కొడుతున్నారు. డ్రిప్, మల్చింగ్ విధానంలో ఆధునిక వ్యవసాయానికి సై అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో అధిక విస్తీర్ణంలో మిర్చి తోటలు ముమ్మరంగా సాగు చేస్తున్నారు.
-కూసుమంచి, ఆగస్టు 25
కూసుమంచి, ఆగస్టు 25 : ప్రస్తుతం వ్యవసాయం లాభసాటిగా మారడంతో రైతులు వడివడిగా ముందుకుపోతున్నారు. కోతల్లేని కరెంట్, పెరిగిన భూగర్భ జలాలు, పుష్కలంగా ఎరువులు, విత్తనాలు లభిస్తుండడంతో సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో వరి తరువాత అధిక విస్తీర్ణంలో పత్తి, మిర్చి సాగవుతున్నాయి. మిర్చికి అనుమైన మెట్ట నేల కలిగిన ప్రాంతం ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉండడంతో ఇక్కడి రైతులు మిర్చిసాగు ఎక్కువగా చేస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం మిర్చికి మంచి రేటు పలుకుతుండడం కూడా ఒక కారణం. ఎక్కువశాతం మంది నర్సరీల్లో మొక్కలు పెంచితే, కొందరు రైతులు మాత్రం తమ భూముల్లోనే మిర్చినారు పెంచుతున్నారు. వరినాట్లు అయిపోవడంతో మెట్ట ప్రాంతాల్లో రైతులు తోటలు ఎక్కువగా వేస్తున్నారు. కలుపు పెరగకుండా ఉండేందుకు మిర్చి తోటలకు మల్చింగ్ విధానంతో వేస్తున్నారు. డ్రిప్ ద్వారా తోటలు వేస్తున్నారు. ప్రస్తుతం రైతులకు లాభాలు కురిపించే పంట ఏదైనా ఉందంటే అది మిర్చినే. మార్కెట్ల్లో రికార్డు స్థాయిలో రేటు పలకడం వల్లే ఖర్చు ఎక్కువగా వచ్చినా అదేస్థాయిలో లాభాలు కూడా వస్తాయని మిర్చి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలో మిర్చి సాగు వివరాలు
2019-20లో 52,620 ఎకరాల్లో సాగు చేశారు.
2020-21లో 55,990 ఎకరాల్లో సాగు చేశారు.
2021-22లో 1,03,021 ఎకరాల్లో సాగు చేశారు.
2022-23లో 1.08 లక్షల ఎకరాల్లో సాగతున్నది.
2023-2024లో 1.25 వేల ఎకరాల వరకు
(సాగు అవుతుందని భావిస్తున్నారు.)
తొలగిన నకిలీల బెడద.. పుష్కలంగా నీరు
గతంలో నకిలీ విత్తనాలతో అనేకమంది రైతులు ఇబ్బందులు పడ్డారు. నీరు లేక.. నీరు ఉన్నా కరెంట్ లేక అర్ధరాత్రి సమయాల్లో తోటలకు నీరు కట్టేందుకు రాత్రిళ్లు తోటల వద్ద జాగారం చేసేవారు. ప్రస్తుతం వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడం.. బావులు, బోరులో పుష్కలంగా నీరు ఉండడం రైతులకు కలిసొచ్చింది. వాణిజ్య పంటగా పెరున్న మిర్చి గతంలో దేశవాళీ విత్తనాలు వేసేవారు.. కానీ గత 15 సంవత్సరాలుగా హైబ్రీడ్ రకాలు వేస్తున్నారు. మిషన్ కాకతీయతో గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరు ఉండడంతో బోర్లు, బావుల కింద వ్యవసాయం చేసే రైతులకు పూర్తిగా రెండు పంటలకు నీరు అందుతున్నది.
ఈసారి గత సంవత్సరం కంటే 25 శాతం అధికంగా మిర్చి సాగయ్యే అవకాశం ఉన్నదని ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి జిల్లాలో ఎక్కువగా నర్సరీల్లో మిర్చి నారును రైతులు పెంచారు. నర్సరీల్లో నారు పెంచడానికి ముందుగా విత్తనం ఇస్తే మొక్కకు 80 పైసల నుంచి రూపాయి వరకు నర్సరీ నిర్వాహకులు తీసుకొంటున్నారు. విత్తనాలు లేకుండా నర్సరీలో మొక్కలు తీసుకొని వేస్తే 70 పైసల నుంచి రూ.2 వరకు అమ్మకాలు చేస్తున్నారు. గతంలో ఆంధ్రా ప్రాంతంలో నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకునే వారు.. కానీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోనే మొక్కలు లభిస్తుండడంతో రైతులకు ఇబ్బంది లేకుండాపోయింది.
గతం కంటే రెట్టింపు నర్సరీలు
రైతులు విత్తనాలు నర్సరీలకు ఇస్తే 80 పైసల నుంచి రూపాయికి మొక్క వంతున తీసుకుంటున్నారు. డిమాండ్ పెరగడం, ఎక్కువగా తోటలు వేయాలనే ఆలోచన రావడంతో మొక్కల ధరను రూ.1 వరకు పెంచారు. పలు నర్సరీల్లో వేసిన మొక్కలు అయిపోవడంతో రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి మొక్కలు తెచ్చుకొంటున్నారు. జిల్లాలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, బోనకల్లు, మధిర, వైరా, కల్లూరుతోపాటు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్నగర్, కృష్ణా జిల్లా వత్సవాయి, కంచికచర్ల, పెనుగంచిప్రోలు, గుంటూరు వంటి ప్రదేశాలకు వెళ్లి నారు తీసుకొస్తున్నారు. పక్క జిల్లాల రైతులు నారు కోసం రావడంతో బాగా డిమాండ్ పెరిగి క్రమంగా నారు కొరత ఏర్పడుతున్నది. పలు ప్రాంతాల్లో రైతులు వేసిన మిర్చినారు ఇటీవల వర్షాలతో కొంతవరకు కుళ్లు వచ్చి రైతులు ఇతరులపై ఆధారపడాల్సి వచ్చిందని చెబుతున్నారు.
కరెంట్, నీరు మంచిగున్నయి..
మాకు మూడెకరాల భూమి ఉంది. దానిలో తోట వేస్తున్నాం. నాన్న ఒక్కడే పని చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుందని నేను కూడా తోట వేయడానికి వెళ్తున్నా. గత సంవత్సరం కూడా మూడెకరాలు వేశాం. మంచి దిగుబడి వచ్చింది. అందుకే మళ్లీ తోట వేస్తున్నాం. ఇప్పుడు కరెంట్ కోత లేకుండా ఇస్తున్నారు. నీటికి కొదువలేదు. తోట కష్టమైనా మంచిగా దిగుబడి వస్తే డబ్బులు మిగులుతాయి.
– వడ్త్యి నాగమణి, గంగబండతండా
ఈసారి మిర్చి వేస్తున్నా..
గతంలో పత్తి వేశా.. మంచిగా పండింది. మిర్చికి మంచి రేటు ఉండడంతో ఈసారి రెండు ఎకరాల్లో మిర్చి వేస్తున్నా. నర్సరీల్లో నారు మంచిగా రావడం లేదని నేను సొంతంగా పెంచుకున్నా. మంచిగా వచ్చింది. నాకు సరిపోయింది. ఇంకా కొంత మందికి నారు అమ్ముతున్నా. వర్షాలు లేక కొంత ఇబ్బంది అయినా.. బావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. సాగుకు ఇబ్బంది లేదు. పంట మార్పిడి చేశా కాబట్టి దిగుబడి బాగా వస్తుందని భావిస్తున్నా. గతంలో కరెంట్ కోతలతో నానా అవస్థలు పడే వాళ్లం. కానీ ఇప్పుడు ఆ బాధలు లేవు.
– నల్లమల్ల రామారావు, రైతు, కేశ్వాపురం