అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది.. స్వేదం చిందించి సేద్యం చేసే రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చే పంటను నీటిపాలు చేసింది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి.. పెట్టుబడి పోయి బిక్కుబిక్కుమంటూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కర్షకుల కన్నీటిని తుడిచారు. పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు. వారి ఆవేదనను చూసి చలించిపోయారు. అక్కడికక్కడే పంట పరిహారాన్ని ప్రకటించారు.
గురువారం బోనకల్లు మండలంలోని రావినూతల, గార్లపాడు గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటించి పంట క్షేత్రాలను పరిశీలించారు. రైతుల భుజం తట్టి మాట్లాడి వారిని ఓదార్చారు. పంట చేలో కలియతిరిగి రైతులతో మమేకమయ్యారు. మీ ధైర్యమే నా ధైర్యం. ఎవరూ ఆందోళన చెందవద్దు. మీకోసం నేనున్నాను. నష్టపోయిన ప్రతి రైతునూ అన్నివిధాలా ఆదుకుంటానని భరోసానిచ్చారు. రైతు సోదరుల ఆత్మైస్థెర్యం దెబ్బతినొద్దని ఆలోచించి దేశ చరిత్రలోనే మొదటిసారి ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించి రైతుబాంధవుడిగా నిలిచారు. దీంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
-ఖమ్మం, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రైతు పక్షపాతి అని మరోసారి రుజువైంది. అకాల వర్షం కారణంగా నేలవాలిన పంటలను పరిశీలించి, భుజం తట్టి మాట్లాడడం బాధితులకు భరోసానిచ్చింది. మొత్తానికి గురువారం బోనకల్లు మండలంలో సీఎం పర్యటన ఊరటనిచ్చింది. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టంపై కేంద్రానికి నివేదికలు పంపించినప్పటికీ ఎలాంటి స్పందన ఉండేది కాదు. కొన్నిసార్లు కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి పంటలను పరిశీలించేవి. తర్వాత మూడు, నాలుగేళ్ల సంవత్సరాలైన పరిహారం అందేది కాదు. బాధిత రైతులు సంవత్సరాల తరబడి పరిహారం కోసం ఎదురుచూసేవారు. దీన్నిబట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి పట్టింపు లేదని స్పష్టమవుతున్నది.
తెలంగాణ వచ్చిన తర్వాతే రాష్ట్రంలో వ్యవసాయం పండుగైంది. సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేసి రైతులకు అండగా నిలిచారు. సాగు కోసం ఎక్కడికక్కడ చెక్డ్యాంలు, ప్రాజెక్ట్లు నిర్మించారు. వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించడం రైతులపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనం.
రైతుకు కొండంత అండ..
సీఎం కేసీఆర్ రైతులకు కొండంత అండ. రైతులకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించడం అభినందనీయం. గత ప్రభుత్వాలు ఎకరానికి రూ.4 వేలు అందించేందుకే వెనుకాడేవి. కానీ సీఎం కేసీఆర్ పర్యటించిన రోజే పరిహారం విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నారు. రైతులెవరూ నిరాశ చెందొద్దని భరోసానిచ్చారు.
– వడ్లముడి రామారావు, రైతు, పెద్దరాంపురం, కొణిజర్ల మండలం
నష్టం గురించి తెలుసుకుని వెంటనే పర్యటన..
అకాల వర్షం కారణంగా జరిగిన పంట నష్టం గురించి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వయంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. వెంటనే ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో పర్యటన ఖరారు చేశారు. సీఎం పర్యటన గురించి తెలుసుకున్న రైతులు గురువారం ఉదయం భారీగా రావినూతల సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వచ్చారు. సీఎం ప్రకటనపై చివరి వరకు ఎదురుచూశారు.
రైతులతో మమేకమైన సీఎం..
సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజయ్కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హెలీప్యాడ్లో ల్యాండ్ అయ్యారు. ముందుగా పంట నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. చేతికి వచ్చిన పంట దెబ్బతినడాన్ని చూసి సీఎం చలించిపోయారు. రైతులతో మమేకమై వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. ‘పరిహారంపై కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా నేను మీకు అండగా ఉంటాను. సాయం చేస్తాను..’ అని భరోసానిచ్చారు. విత్తనం నాటిన నాటి నుంచి పంట ఎదిగే వరకు పెట్టిన పెట్టుబడి, జరిగిన నష్టంపై ఆరా తీశారు. అనంతరం ప్రెస్మీట్ పెట్టి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించడం రైతాంగానికి ఊరటనిచ్చింది. పరిహారం కౌలు రైతులకూ వర్తిస్తుందని స్పష్టం చేయడం ఆనందాన్ని నింపింది. అంతేకాదు సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రైతు సమస్యలపై ఇచ్చిన వినతిపత్రాలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, గార్లపాడు సర్పంచ్ నర్సమ్మ పంట నష్టంపై సీఎంతో మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలను సర్పంచ్ వివరించారు. ఆసరా, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల అమలుపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటల విషయంలో గతంలోని ఏ ప్రభుత్వాలు తక్షణ సాయం అందించిన దాఖలాలు లేవు. ఒకవేళ అందించినా ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారి. అతి త్వరలో రైతుల ఖాతాల్లో పరిహారం జమకానున్నది. జిల్లావ్యాప్తంగా 19,732 మంది 31,038 ఎకరాల్లో సాగు చేస్తున్న పంటలు దెబ్బతిన్నాయి. వారి ఖాతాల్లో ఎకరానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.31.08 కోట్ల పరిహారం జమ కానున్నది. పంట నష్టం అత్యధికంగా బోనకల్, చింతకాని మండలాల్లో నష్టం జరిగింది.
భద్రాద్రి జిల్లాలో 3, 170 ఎకరాల్లో పంట నష్టం
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన అకాల వర్షానికి భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 3,710 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్న వివిధ రకాలైన పంటలు దెబ్బతిన్నాయి. గుండాల, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, అశ్వారావుపేట, అశ్వాపురం, కొత్తగూడెం, ఇల్లెందు మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే పంట నష్టంపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. సాధారణ రైతులతో పాటు కౌలు రైతులను గుర్తించనున్నారు. కలెక్టర్ అనుదీప్కు నివేదికలు సమర్పించనున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు
రైతు కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్..
పంట నష్టం జరిగితే గతంలో ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి రైతుల పక్షాన నిలబడుతున్నారు. రైతుల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతుకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకుంటున్నారు. తాజాగా అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకుంటున్నారు. ఎకరానికి రూ.10 వేల సాయం ప్రకటించారు. రైతు కష్టం తెలుసుకాబట్టే ఆయన సాయానికి ముందుకువచ్చారు.
– మాళోత్ పూల్సింగ్, రైతు, కొత్తతండా, టేకులపల్లి మండలం
ఎం పర్యటన ధైర్యాన్నిచ్చింది..
ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన రైతులందరికీ మనోధైర్యాన్నిచ్చింది. ఆపదలో ఉన్న రైతులను ఆదుకోవడంలో సీఎం ఎప్పుడూ ముందుంటారు. ఎకరానికి రూ.10 వేల పరిహార ప్రకటన రైతులకు ఊరటనిచ్చింది. రైతుల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్న కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. యంత్రాంగం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంటలను పరిశీలించి నష్టపోయిన ప్రతి బాధితుడికి పరిహారం అందేలా చూడాలి.
– వారాది సత్యనారాయణ, రైతు, అయ్యన్నపాలెం, చండ్రుగొండ మండలం
కౌలు రైతులకూ పరిహారం వర్తింపు అభినందనీయం..
అకాల వర్షంతో నష్టపోయిన సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకూ పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం అభినందనీయం. రైతులు నష్టపోతున్నారని తెలిసి ఒక్కరోజే నాలుగు జిల్లాల్లో పర్యటించి సీఎం స్వయంగా పంటను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా రైతు సంక్షేమం కోసం సీఎం ఎల్లప్పుడూ ముందుంటారు. రైతుల కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్. రైతుబాంధవుడిగా నిలుస్తున్న కేసీఆర్కు కృతజ్ఞతలు.
– చింతనిప్పు సత్యనారాయణ, రైతు, పాతకారాయిగూడెం, పెనుబల్లి మండలం
పరిహారంతో ఊరట..
నేను నాకున్న రెండెకరాలతో పాటు ఒకటిన్నర ఎకరా కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిన్నది. రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయాను. సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తానని ప్రకటించి ఊరటనిచ్చారు.
– బోడా వెంకటేశ్వరరావు, రైతు, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం
రైతు ప్రభుత్వం.. తెలంగాణ సర్కార్..
తెలంగాణ ప్రభుత్వం.. కచ్చితంగా రైతు సంక్షేమ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఏ కష్టమొచ్చినా ఆదుకోవడానికి ముందుకొస్తారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలతో ఒకవైపు రైతులకు మేలు చేస్తున్నారు. తాజాగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నారు. కౌలు రైతులకూ పరిహారం అందుతుందని భరోసా కల్పించారు.
– చీకటి రామారావు, రైతు, లింగగూడెం, పెనుబల్లి మండలం
ఊహించిన దానికంటే ఎక్కువ పరిహారం..
సీఎం కేసీఆర్ రైతులు ఊహించిన దానికన్నా ఎక్కువ పరిహారం ప్రకటించారు. గత ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎకరాలకు కేవలం రూ.5 వేలు లేదా అంతకంటే తక్కువే ఇచ్చేవి. పరిహారం కోసమూ మేము సంవత్సరాల తరబడి వేచి ఉండేవాళ్లం. నేను నాకున్న తొమ్మిది ఎకరాలతో పాటు మరో తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాను. వర్షాలకు పంట దెబ్బతిన్నది. కేసీఆర్ సార్.. కౌలు రైతులకూ పరిహారం ఇస్తామని చెప్పడం నాకు సంతోషాన్నిచ్చింది. పరిహారం వస్తే అంతేచాలు. రైతులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి వందనం.
– తొండపు వేణు, రైతు, రామాపురం, బోనకల్లు మండలం, ఖమ్మం జిల్లా
పరిహారంతో మేలు..
నాకు రెండెకరాల భూమి ఉంది. మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తున్నాను. అప్పులు తెచ్చి సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాను. పంట చేతికొస్తుందన్న సమయంలో అకాల వర్షం వచ్చింది. పంట పూర్తిగా దెబ్బతిన్నది. పెట్టుబడి, శ్రమ అంతా బూడిదలో పోసినట్లయింది. సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని అందిస్తామని చెప్పడం ఊరటనిచ్చింది.
– యరమల కృష్ణారెడ్డి, రైతు, గరికపాడు, వైరా మండలం
రైతు కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్..
ఎల్లప్పుడూ రైతు సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తి సీఎం కేసీఆర్. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించడం ఆయనకే చెల్లింది. నేను 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాను. పంట గింజ పోసుకునే దశలో 12 ఎకరాల్లో పంట నేలవాలింది. సీఎం సార్.. పంట నష్టాన్ని గుర్తించి పరిహారం ఇస్తామని చెప్పడం ఊరటనిచ్చింది. అధైర్యపడొద్దని చెప్పి మనోధైర్యాన్ని కల్పించడం ఆనందాన్నిచ్చింది.
– పిల్లెం వెంకటేశ్వర్లు, రైతు, చిరునోముల, బోనకల్లు మండలం
ప్రకటన భరోసానిచ్చింది..
సీఎం కేసీఆర్ పంట నష్టంపై ప్రకటించిన పరిహారం రైతులకు ఊరటనిచ్చింది. నేను ఐదెకరాల్లో మక్కలు సాగు చేశాను. కంకిగింజ పోసుకొనే దశలో అకాల వర్షం పంటను దెబ్బతీసింది. తీవ్ర నష్టం వాటిల్లింది. మా ఊరికి సీఎం సార్ వచ్చి నేలవాలిన పంటలను పరిశీలించడం మాలో ధైర్యాన్ని నింపింది. రైతులు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో పరిహారం ఇస్తామనడం ఒక్క కేసీఆర్కే చెల్లింది..
– ముక్కుపాటి చిట్టికుమారి, మహిళా రైతు, గార్లపాడు, బోనకల్లు మండలం