అశ్వారావుపేట, డిసెంబర్ 20: ఆయిల్ఫెడ్ నిర్దేశించుకున్న ఆయిల్పాం విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది మార్చిలోపు 75 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ను పూర్తి చేస్తామని సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్యానికి అవసరమైన మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆయిల్ఫెడ్ క్యాలండర్ ప్రకారం రైతులకు మొక్కలు సరఫరా చేస్తున్నామన్నారు. సరైన భూపత్రాలు లేని రైతులకు ఫుల్ కాస్ట్ రూ.200కు మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటివరకు 700 ఎకరాలకు అవసరమైన మొక్కలు పంపిణీ చేశామన్నారు. ఖమ్మం జిల్లా నుంచి 5,600 ఎకరాలు, భద్రాద్రి జిల్లా నుంచి 6,546 ఎకరాలకు మొక్కలు అవసరమని దరఖాస్తులు వచ్చాయన్నారు.
వారికి ఏప్రిల్ తర్వాత మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా మొక్కలు తరలిపోతున్నాయని అందిన ఫిర్యాదులపై సోషల్ ఆడిట్ చేపట్టామన్నారు. ఉపాధి సిబ్బందితో సర్వే చేయిస్తున్నామన్నారు. ఈఆయిల్ ఇయర్లో 19.32 రికవరీ శాతాన్ని సాధించామన్నారు. దీంతో టన్ను గెలల ధర రూ.595 పెరిగిందన్నారు. వచ్చే ఆయిల్ ఇయర్లో రికవరీ శాతాన్ని 19.50 సాధిస్తామన్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతులకు ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించారు. సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వివరించారు. దళారుల బెడద లేకుండా నేరుగా ఆయిల్ఫెడ్ గెలలను కొనుగోలు చేస్తున్నదన్నారు. తోటల మధ్య అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. పర్యటనలో ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ, క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు.