భద్రాచలం/ పర్ణశాల, ఏప్రిల్ 7: శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భక్తులకు అసౌకర్యం కలుగనీయబోమని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కల్యాణ మండపంలో జరుగుతున్న పనులు, రెండో వారధి నిర్మాణాన్ని ఎస్పీ సునీల్దత్తో గురువారం ఆయన కలిసి పరిశీలించారు. దేవస్థానం, అన్ని శాఖల అధికారులతో పనులు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సెక్టార్కు ప్రత్యేక అధికారిని నియమించామని, సెక్టార్ అధికారులు భక్తులకు మంచినీరు, మజ్జిగ, అందించేందుకు వలంటీర్లను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి సెక్టార్లో వాటర్ కూలర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తలంబ్రాల పంపిణీ కోసం అదనంగా సమాచార కేంద్రాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నిర్దేశించిన స్థలంలోనే వాహనాలు పార్కింగ్ చేసేలా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు సమాచార శాఖ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణ మండపంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే ఎలా ఎదుర్కోవాలో ట్రయల్ రన్ ద్వారా చూపామని ప్రతి సెక్టార్లో ఫైర్ యంత్రాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. దేవస్థానం ఈవో శివాజీ, అధికారులు పాల్గొన్నారు.
గోదావరిపై నిర్మిస్తున్న రెండో వారధి పనులను వేగిరం చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి గురువారం వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం వస్తే నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఆలోపే ఫిల్లర్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణం చేపట్టి ఇప్పటికే ఎనిమిదేళ్లు అయిందని, ఇంకా జాప్యానికి తావులేదని అన్నారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఈఈ యుగంధర్, డీఈ శైలజ, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి ఏర్పాట్లను కలెక్టర్ దురిశెట్టి గురువారం పరిశీలించారు. ముందుగా ప్రధాన రహదారిపై సర్పంచ్ అందించిన మొక్కను నాటి నీరు పోశారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో దయానందస్వామి, డీఎల్పీవో రమాకాంత్, సీఐ రమేశ్, ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాలరావు, సర్పంచ్ వరలక్ష్మి, కార్యదర్శి ప్రసాదరెడ్డి, ఆలయ ఏఈవో భవానీ రామకృష్ణ, సూపరింటెండెంట్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.