ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 10: ప్రభుత్వ పాఠశాలలే పదో తరగతి పరీక్షా కేంద్రాలు కానున్నాయి. సకల సదుపాయాలతో ఉన్న సర్కారు బడుల్లోనే ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలలను పరిశీలిస్తున్నారు. పటిష్టంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే అత్యధిక శాతం టెన్త్ పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. సెంటర్లను ఫైనల్ చేసే ప్రక్రియలో చివరి దశకు చేరుకున్నారు.
104 కేంద్రాలు.. : మే 11 నుంచి జరుగనున్న టెన్త్ పరీక్షలకు కేంద్రాలను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. జీవో నెంబర్ 151/బీ-2 ద్వారా ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకుని కేంద్రాలను ఎంపికచేయాలో, అందుకు ఆయే ప్రాధామ్యాలు పరిశీలించాలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించాలని స్పష్టం చేసింది. విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని జంబ్లింగ్ పద్ధతిలోనే కేంద్రాలను ఎంపిక చేస్తారు. ఈ తరుణంలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. కలెక్టర్, విద్యాశాఖాధికారులు తీసుకునే నిర్ణయాల ద్వారా జరిగే స్వల్ప మార్పులు మినహ దాదాపుగా కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తయినట్లే. రెగ్యులర్ విద్యార్థుల కోసం 104 కేంద్రాలను ఎంపిక చేశారు.
46 జోన్లుగా విభజన.. : ఖమ్మం జిల్లాలో టెన్త్ పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పరిధిలోని విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో కేంద్రాలును కేటాయించనున్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 427 పాఠశాలలను 46 జోన్లుగా విభజించారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేయడంతో అధికారులు నిరుడు మౌలిక సదుపాయాలు ఉండి కేటాయించని సెంటర్లను ఈ దఫా పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలను ఏ, బీ, సీ లుగా విభజించారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఉన్న స్కూళ్లను ‘ఏ’ సెంటర్లుగా, పోలీస్ స్టేషన్కు 8 కిలోమీటర్ల పరిధిలో ఉండే పరీక్ష కేంద్రాలను ‘బీ’ సెంటర్లుగా, పోలీస్ స్టేషన్కు 8 కిలోమీటర్ల కంటే దూరంగా ఉండే కేంద్రాలను ‘సీ’ సెంటర్లుగా గుర్తిస్తారు.
స్వల్పమార్పులుండే అవకాశం.. : ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో ఈ దఫా నూతనంగా 6 పరీక్షా కేంద్రాలు కేటాయించేందుకు అనుమతులు వచ్చాయి. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రం కేటాయిసున్నారు. ఖమ్మం నగరంలో ప్రస్తుతం ఎంపిక చేసిన సంఖ్య ప్రకారం 25 కేంద్రాలు ఉండగా మరో రెండు సెంటర్లను పెంచారు.
యాజమాన్యాల వారీగా.. : జిల్లాలో 10వ తరగతికి సంబంధించి అన్ని యాజమాన్యాల పరిధిలో 427 స్కూళ్లు ఉండగా 17,536 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో బాలురు 9,148 మంది, బాలికలు 8,388 మంది ఉన్నారు. 21 ప్రభుత్వ స్కూళ్ల నుంచి 1,264 మంది, 190 జడ్పీ హైస్కూళ్ల నుంచి 6,191 మంది, 3 ఎయిడెడ్ స్కూళ్ల నుంచి 62 మంది, 14 కేజీబీవీల నుంచి 599 మంది, ఏడు బీసీ గురుకులాల నుంచి 485 మంది, 36 సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 2,415 మంది, 156 ప్రైవేట్ స్కూళ్ల నుంచి 6,510 మంది హాజరవుతున్నారు.