వేసవి సెలవుల తర్వాత ఏటా జూన్లో పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. తరగతులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. విద్యార్థులు రకరకాల దుస్తుల్లో పాఠశాలలకు వచ్చేవారు. అయితే.. ఇది ఒకప్పటి పరిస్థితి. తెలంగాణ సిద్ధించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి సర్కార్ విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే యూనిఫాం అందిస్తున్నది. స్కూళ్ల పునః ప్రారంభం రోజునే విద్యార్థులు యూనిఫాంతో హాజరవుతున్నారు. దీనిలో భాగంగా వచ్చే విద్యాసంవత్స రానికి ఇప్పటికే పాఠశాలలకు యూనిఫాం అందాయి. యాజ మాన్యాలు వాటిని కుట్టించే పనిలో పడ్డాయి.
– ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 30
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 30: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా సర్కార్ విద్యాసంవత్సరం ఆరంభానికి మునుపే యూనిఫాం అందజేస్తున్నది. దీనిలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరానికి ఈ నెల 24కి జిల్లాకు యూనిఫాం చేరుకున్నది. విద్యాశాఖ అధికారులు యూనిఫాంను మండలాల వారీగా విభజించి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు పంపించారు. సోమవారం ఠాన్లు ఎమ్మార్సీల నుంచి పాఠశాలలకు చేరుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలల విద్యార్థుల సంఖ్యను బట్టి దర్జీల వద్ద క్లాత్ కుట్టించనున్నారు.
తరగతుల వారీగా డిజైన్లు…
2023-24 విద్యాసంవత్సరంలో చదువుతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర విద్యాశాఖ మొత్తం ఐదు రకాల డిజైన్లు ఎంపిక చేసింది. రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) ప్రత్యేకంగా క్లాత్ను ప్రత్యేకంగా నేతకారులతో నేయించి విద్యాశాఖకు అందించింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఎరుపు, బూడిద రంగులో పంజాబీ శైలి యూనిఫాం, 4-5వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు స్కర్ట్, దానిపై పట్టీలతో కూడిన షర్ట్ యూనిఫాం, 1 నుంచి 3వ తరగతి చదువుతున్న విద్యార్థినుల యూనిఫాం కుడివైపు ప్యాకెట్తో ఫ్రాక్, సూటింగ్ క్లాత్తో కుట్టిన బెల్ట్ రింగులు, స్లీవ్లపై సూటింగ్ రంగు పట్టీలతో ముద్రించిన ఎరుపు, బూడిద రంగు గీతలతో చొక్కా, 1వ నుంచి 7వ తరగతి చదువుతున్న బాలురకు నిక్కర్, షర్టు, 8 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలురకు ప్యాంట్, చొక్కా అందనున్నాయి.
కేజీబీవీలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూకి ప్రత్యేకంగా…
కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న వారిలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా వైట్ యూనిఫాం అందజేస్తున్నది. జిల్లాలో పరిధిలో బోనకల్లు, ఏన్కూర్, కామేపల్లి, కూసుమంచి, ఖమ్మం అర్బన్, కొణిజర్ల కేజీబీవీలు ఉండగా వీటి పరిధిలో 480 మంది విద్యార్థినులకు లబ్ధి చేకూరనున్నది.
84,856 మంది విద్యార్థులకు..
ప్రభుత్వ పాఠశాలలు, లోకల్ బాడీ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ ప్రైమరీ స్కూల్స్లో 1 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా యూనిఫాం అందజేస్తున్నది. జిల్లావ్యాప్తంగా 1,265 స్కూల్స్ పరిధిలో చదువుతున్న 84,856 మంది విద్యార్ధుల కోసం సర్కార్ 4,23,990 మీటర్ల క్లాత్ను సరఫరా చేసింది.
లోకల్ టైలర్స్ వద్ద కుట్టించాలి..
ప్రధానోపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు లోకల్ టైలర్స్ వద్ద యూనిఫాం కుట్టించాలి. టైలర్స్ వద్ద కుట్టించడం సాధ్యం కాకపోతే జిల్లా కేంద్రం నుంచే ఆయా పాఠశాలలకు టైలర్స్ను పంపిస్తాం. కుట్టు కూలి కోసం యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఒక్క రూపాయైనా వసూలు చేయొద్దు.
– వై.రాజశేఖర్, సీఎంవో, ఖమ్మం