కొణిజర్ల, మార్చి22 : ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించ తలపెట్టిన ఆంగ్ల మాద్యమ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కొణిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో బీ.రమాదేవి ప్రారంభించారు. జిల్లా విద్యాశాధికారి యాదయ్య సందర్శించి శిక్షణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో ఎం.శ్యాంసన్, ప్రధానోపాధ్యాయులు డీ.పుల్లయ్య, కే.శశికుమార్, ఎం.డీ.అల్తాఫ్, ఎ.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు, మార్చి 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలని ఎంపీడీవో వీరేశం తెలిపారు. జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంపై శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం, మౌలిక వసతులు కల్పనను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈవో చలంచర్ల వెంకటేశ్వరరావు, హెచ్ఎం కృష్ణకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తల్లాడ, మార్చి 22 : చదువుతోనే వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి సాధించవచ్చని ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు అన్నారు. మిట్టపల్లి గ్రామానికి చెందిన ఎముకపాటి దర్గయ్య, శ్రీదేవి దంపతుల కుమారుడు సాయినిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక హైస్కూల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీపీ మాట్లాడుతూ పుట్టినరోజు నిరాడంబ రంగా పేద విద్యార్థులతో కలిసి జరుపుకోవడం అభినందనీయమన్నారు. పాఠశాల విద్యార్థులకు పూర్వవిద్యార్థులు తమవంతు సహాయం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్రెడ్డి, ఎంఈవో ఎన్.దామోదరప్రసాద్, సర్పంచ్ మాగంటి కృష్ణయ్య, ఎముకపాటి దర్గయ్య, అప్పారావు, మోరంపుడి సత్యనారాయణ, కార్యదర్శి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.