శ్రీరాంపూర్/కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 7: సింగరేణిలో జరుగుతున్న ఏడో దఫా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తూ హైదరాబాద్లోని డీవైసీఎల్సీ కార్యాలయంలో టీబీజీకేఎస్ శనివారం నామినేషన్ దాఖలు చేసింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి డీవైసీఎల్సీకి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య మాట్లాడుతూ అనేక విధాల కారణాలతో వాయిదా వేస్తూ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు డీవైసీఎల్సీ నోటీఫికేషన్ జారీ చేసిందన్నారు. కోర్టు జోక్యంతో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు.
సింగరేణిలో 12 కార్మిక సంఘాలు అసెంబ్లీ ఎన్నికల అనంతరం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేసి డీవైసీఎల్సీకి ఇచ్చినప్పటికీ నోటిఫికేషన్ ఏకపక్షంగా జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అయినప్పటికీ డీవైసీఎల్సీ ఇచ్చిన నోటిఫికేషన్ను గౌరవిస్తూ నామినేషన్ వేశామన్నారు. సింగరేణి యాజమాన్యం హైకోర్టు ఫుల్బెంచ్లో వేసిన కేసు వాదనలు పూర్తయ్యాయని, ఈ నెల 11న తీర్పు రానున్నాదన్నారు. కోర్టు స్టే ఇవ్వకపోవడం వల్ల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నదని , తాము చట్టాలను గౌరవిస్తూ, డీవైసీఎల్సీ నోటిఫికేషన్ మేరకు చివరి రోజు శనివారం తమ యూనియన్ తరఫున నామినేషన్ వేశామన్నారు. తీర్పు ఎలా వచ్చినా టీబీజీకేఎస్ ఎన్నికలకు సిద్ధంగా ఉందన్నారు.
గత తొమ్మిదేళ్లలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆర్థిక ప్రయోజనాలు, సౌకర్యాలు, హక్కులు కల్పించారన్నారు. సీఎం కేసీఆర్పై కార్మికులకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఎన్నడూ లేని విధంగా కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టారన్నారు. కార్మికులకు రూ. 1750 కోట్ల 11వ వేతన ఏరియర్స్, రూ. 711 కోట్ల సింగరేణి లాభాల వాటా ఇచ్చారన్నారు. ముఖ్యంగా కార్మికుల బిడ్డలు ఆగం కాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ కారుణ్య ఉద్యోగాలు కల్పించారని, దాంతో 16 వేల మంది కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు లభించాయన్నారు. కొలిండియాలో లేని హక్కులు కల్పిస్తున్న టీబీజీకేఎస్ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కార్మికుల కార్మికుల ఆధారభిమానంతో టీబీజీకేఎస్ను గెలిపిస్తారని, కేసీఆర్కు అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
గోదావరిఖని, అక్టోబర్ 7: హైదరాబాద్లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్ కుమార్కు జీఎల్బీకేఎస్ నాయకులు శనివారం నామినేషన్ పత్రం అందించారు. ఈ సందర్భంగా జీఎల్బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.విశ్వనాథ్ మాట్లాడుతూ కార్మిక సంఘాల చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణ చేసే విధంగా ఎన్నికలు ఉండాలన్నారు.