మణుగూరుటౌన్, మార్చి 22 : అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదిలేదని, ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం స్థానిక తెలంగాణభవన్(బీఆర్ఎస్ కార్యాలయం)లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీల్లో 13 అంశాలను పొందుపరిచి వందరోజుల్లోనే అమలుచేస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వందరోజులు గడిచినా హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటుపోయిన దాఖలాలు లేవని, రైతుల ఖాతాల్లో టింగు టింగుమంటూ రైతుబంధు జమ అయ్యేదని, ప్రతినెలా ఆసరా పెన్షన్లు అందాయని, సాగునీరు సమృద్ధిగా ఉండి రైతులు రెండు పంటలు పండించుకున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుబంధు ఆగిపోయిందని, సాగునీరు లేక రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పురోగమనంలో పయనిస్తున్న రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరోగమనంలోకి వెళ్లిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి ఎప్పుడు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. సమావేశంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు ముత్యం బాబు, అడపా అప్పారావు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, వట్టం రాంబాబు పాల్గొన్నారు.