ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణీ పోర్టల్ నుంచి పీవోబీ తొలగిస్తామని చెప్పే దళారుల మాటలు ప్రజలు నమ్మవద్దని జిల్లా రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసిన తరువాత వ్యవసాయ భూములు తహసీల్థార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, సబ్ రిజిస్టార్లు కేవలం వ్యవసాయేతర భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని పేర్కొన్నారు.
కొన్ని సర్వే నెంబర్లు రకరకాల కారణాలతో నిషేధిత జాబితాలో ఉన్నాయని వాటిలో కోర్టు కేసులు ఉండి కోడ్నెం-09తో ఉన్న వాటిని మాత్రమే నిషేధిత జాబితా నుంచి సబ్ రిజిస్టార్లు తొలగిస్తారని మిగతా వాటిని తొలగించేందుకు వీలు లేదన్నారు. వ్యవసాయ భూముల పీవోబి ఉంటే ఆ సమస్యలను జిల్లా కలెక్టర్ మాత్రమే పరిష్కారిస్తారని తెలిపారు.
వ్యవసాయేతర భూములలో పాక్షికంగా నిషేధం ఉండి మిగతాది పట్టాగా డీనోటిఫికేషన్ ఇచ్చి ఉంటే అవి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా జిల్లా రిజిస్ట్రార్లుకు అందినప్పుడు మాత్రమే రిజిస్ట్రార్లు తొలగిస్తారని వివరించారు. ఇలాంటి విషయాలపై ఇంకా సంధేహాలు ఉంటే వెంటనే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన
సూచించారు.