అధికారులకు సూచనలు చేసిన కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు
మామిళ్లగూడెం, జూన్ 9: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఈ నెల 11న ఖమ్మంలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ గురువారం నగరంలో పర్యటించారు. పోలీస్ బందోబస్తు, కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో మంత్రి కేటీఆర్ ఖమ్మం నగరంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ప్రధానంగా ముందుగా ఖమ్మం కార్పొరేషన్ నూతన భవనం, లకారం ట్యాంక్బండ్పైన నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జీ, దానవాయిగూడెంలో ఏర్పాటు చేయనున్న ఎస్టీపీ, రఘునాథపాలెంలోని సుడా బృహత్ పల్లె ప్రకృతివనం, ప్రకాశ్నగర్లో వైకుంఠధామం, టేకులపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద నూతన క్రీడా ప్రాంగణం, ప్రకృతి వనం వంటి వాటిని సందర్శించారు. సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రుల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. రూట్ బందోబస్తు, కాన్వాయ్, హెలీప్యాడ్ బందోబస్తు, బహిరంగ సభ బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏడీసీపీలు డాక్టర్ శబరీష్, సుభాశ్ చంద్రబోస్, ఏసీపీలు ఆంజనుయులు, రామోజీ రమేశ్, బస్వారెడ్డి, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.