మత్స్య రైతులు ఖుషీ.. ఖుషీగా ఉన్నారు. సీజన్ రాగానే ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను చెరువుల్లో వదులుతుండడంతో మురిసిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో 14వేల పైచిలుకు కుటుంబాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,875 కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమై ఆనందంగా జీవిస్తున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి రెండు రకాల సైజుల్లో ఖమ్మం జిల్లాలో మొత్తం 3,62,059 చేపపిల్లలను 903 చెరువుల్లో వదిలేందుకు జిల్లా మత్స్య శాఖ సిద్ధమైంది. ఒకటి, రెండ్రోజుల్లో మంత్రి పువ్వాడ ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,40,10,953 నిధులను విడుదల చేసింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.77 కోట్ల చేపపిల్లలను 743 చెరువుల్లో వదలనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను విడుదల చేసింది.
– భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం వ్యవసాయం : ఉచిత చేపపిల్లల పంపిణీ ఊరూరా ప్రారంభం కానుంది. ప్రతి మత్స్య కార్మికుడికి లబ్ధి చేకూరేలా, మత్స్య పారిశ్రామిక సొసైటీలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కార్ మరోసారి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇదే మంచి తరుణంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఖమ్మం జిల్లా మత్స్య కార్మికులు, చెరువుల విస్తీర్ణం పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర మత్స్య శాఖ జిల్లాకు అవసరమయ్యే చేపపిల్లలను జిల్లా కార్యాలయానికి చేరవేసింది. రెండురకాల సైజుల్లో మొత్తం 3,62,059 కోట్ల చేపపిల్లలను 903 చెరువుల్లో వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలో కార్యక్రమాన్ని అధికారికంగా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించనున్నారు. జిల్లా మత్స్య శాఖ పరిధిలోని పాలేరు, వైరా, లంకాసాగర్, బేతుపల్లి రిజర్వాయర్తోపాటు 903 చెరువుల్లో నెలరోజుల వ్యవధిలో పంపిణీని పూర్తి చేయనున్నారు. నీటి లభ్యత ఆధారంగా చెరువుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.4,40,10,953 నిధులను విడుదల చేసింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.77 కోట్ల చేపపిల్లలను 743 చెరువుల్లో వదిలేందుకు జిల్లా మత్స్య శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2కోట్ల నిధులను విడుదల చేసింది. కాగా.. సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇటీవల చేపపిల్లలను వదిలారు.
ఖమ్మం జిల్లా వైశాల్యం, నీటి వనరులతో పోల్చుకుంటే మత్స్య సంపద జిల్లావాసులకు తగ్గట్టుగానే ఉందని చెప్పొచ్చు. సాధారణంగా సగటున ఏడాదికి ప్రతి మనిషికి 8 నుంచి 12 కిలోల చేపల అవసరం ఉంటుందని అంచనా. అయితే జిల్లాలో మంచి వర్షాలు పడిన సంవత్సరంలో ఏటా 20వేల టన్నుల మత్స్య ఉత్పత్తి జరుగుతున్నది. జిల్లాలో మత్స్య పరిశ్రమపై ఆధారపడి 14,282 మంది కార్మికులు చేపల వేట కొనసాగిస్తున్నారు. జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో 177 సొసైటీలు ఉన్నాయి. సదరు మత్స్య కార్మికులు జిల్లాలోని 194 చెరువులపై ఆధారపడి జీవిస్తున్నారు. వీటితోపాటు గ్రామ పంచాయతీల పరిధిలో మరో 1,089 చెరువులు, కుంటలు ఉన్నాయి. అదేవిధంగా పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో చేపల ఉత్పత్తిలో ఉమ్మడి జిల్లా 3వ స్థానంలో ఉంది. కొద్ది రోజుల్లోనే 2వ స్థానంలో నిలిచే అవకాశం ఉన్నదని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. చెరువులు, కుంటలు కలిపి 17,039 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండగా.. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కుంటలు మరో 8,867 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. జిల్లాలో సగటున ఏడాదికి 20 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతున్నది. ఉచిత చేపపిల్లల పంపిణీతోపాటు మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రత్యేక రాయితీలతో మత్స్య కార్మికులకు సుమారు రూ.38కోట్లతో వలలు, తెప్పలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, డీసీఎంలతోపాటు, అవుట్లెట్లను సైతం అందించారు. దీంతో మత్స్య కార్మికుల జీవనోపాధి మెరుగైంది.
చేపపిల్లలను పెంచడంతోపాటు వాటిపై ఆదాయం పొందేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ సత్ఫలితాలనిస్తున్నది. గత ఏడాది జిల్లాలో 700 చెరువుల్లో 1.80 లక్షల చేపపిల్లలను చెరువుల్లో వదిలారు. ఇందులో 663 సీజనల్ చెరువులు ఉండగా.. చెరువుల్లో శాశ్వాత నీరు ఉండే చెరువులు 80 ఉన్నాయి. ఇవేకాక మూడు రిజర్వాయర్లలో కూడా చేపలు పెరుగుతున్నాయి. దీంతో ఏటా మత్స్యకారుల కుటుంబాలకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం సమకూరుతున్నది. సొసైటీగా ఏర్పడిన ప్రతీ సభ్యుడికి వేటలో శిక్షణ ఇచ్చి చేపలు పట్టడంలో నైపుణ్యాన్ని కూడా అలవాటు చేసుకుంటున్నారు.
చేపల పెంపకంతోపాటు వాటిని సమయానికి విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వమే వాహనాలను కూడా సబ్సిడీపై అందజేసింది. ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయా సంఘాల సభ్యులకు రూ.7కోట్ల వ్యయంతో 75 శాతం సబ్సిడీపై మొబైల్ వాహనాలు, టూవీలర్లను అందజేసింది. 771 టూవీలర్లు, 10 మొబైల్ వాహనాలు, 26 లగేజీ ఆటోలతోపాటు చేపలు పట్టే వలలు, టెంట్లు, లాగుడు వలలను కూడా అందజేశారు.
మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా జరుగనున్నది. ఇప్పటికే టెండర్ల ద్వారా గుత్తేదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. రెండు రకాల సైజుల్లో చేపపిల్లలను చెరువుల్లో వదలుతాం. జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం 903 చెరువుల్లో చేపపిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.40కోట్ల నిధులను వెచ్చించింది. మత్స్య కార్మికులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.
సింగభూపాలెం, దోమలవాగు చెరువులో రొయ్యల పెంపకం కూడా చేపడుతున్నాం. ఏటా గిరిజనులు, మత్స్యకారులు కలిసి చేపల వేట చేసుకుంటున్నారు. మన చెరువుల్లో పెరిగిన చేపలనే ఎక్కువగా విక్రయిస్తున్నారు. మిషన్ కాకతీయ పథకం వల్ల చెరువుల్లో వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. ఈ ఏడాది రూ.2కోట్ల వ్యయంతో చేపపిల్లలను చెరువుల్లో వదులుతాం.
– వీరన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మత్స్య శాఖ అధికారి
తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన చేపపిల్లల వల్ల మా చెరువుల్లో మేమే చేపలు పట్టుకుని అమ్ముకుంటున్నాం. చేపలు పట్టుకోవడానికి వలలు కూడా ఇచ్చారు. ఏటా సభ్యులకు చేపల విక్రయం ద్వారా మంచి ఆదాయం వస్తున్నది. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ ఉండేది చేపల పంట. ఏ కాలంలోనైనా మా చెరువులో పుష్కలంగా నీరు ఉంటుంది.
– సూర్యం, చేపల సొసైటీ అధ్యక్షుడు, సింగభూపాలెం
చేపలు పట్టడానికి ఎలాంటి పరికరాలు కావాలన్నా ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్నది. గతంలో దూర ప్రాంతాలకు వెళ్లి చేపలు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పిల్లలు ఎదిగి ఉత్పత్తి బాగా జరుగుతున్నది. కొత్తగూడెం నుంచి మా చెరువు వద్దకు వచ్చి చేపలు తీసుకుంటున్నారు. మార్కెట్లో మన చేపలకు భలే డిమాండ్ ఉంది.
– చీమల రాములు, రోళ్లపాడు, టేకులపల్లి మండలం