సారపాక, మే 24: రాష్ట్రంలోని పేదలందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యారోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని స్పష్టం చేశారు. రికార్డుస్థాయిలో ఒకేసారి 1000 మంది డాక్టర్లను నియమించడం తెలంగాణ రాష్ట్ర పాలనలో చరిత్రగా నిలిచిపోతుందన్నారు. గతంలో కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చేదని అన్నారు. వారి బాధలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా 102 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారని వివరించారు. భద్రాద్రి జిల్లాలో గతంలో కొత్తగూడెం, భద్రాచలంలో డయాలసిస్ కేంద్రాలు ఉండగా తాజాగా మణుగూరులో ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో ఇల్లెందు, అశ్వారావుపేటల్లో కూడా డయాలసిస్ కేంద్రాలు ప్రారంభిస్తామని వివరించారు. మణుగూరు 100 బెడ్ల ఆసుపత్రిలో అత్యవసరమైన రోగుల కోసం రూ.14 లక్షలతో బ్లడ్బ్యాంక్ సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అన్ని వసతులూ కల్పించాం: కలెక్టర్
ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి మణుగూరు 100 బెడ్ల ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వం సకల వసతులు కల్పించిందని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గతంలో 20 నుంచి 30 వరకు ఉన్న ఓపీల సంఖ్య ఇప్పుడు 300 స్థాయికి పెరిగిందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రవిబాబు, నాగరాజు, రాంప్రసాద్, సునీల్, నరేశ్, విజయ్కుమార్, ఆనందరావు, పోశం నర్సింహారావు, కారం విజయకుమారి, ముత్యం బాబు, అడపా అప్పారావు, బచ్చల భారతి, కుర్రి నాగేశ్వరరావు, రామిడి రామిరెడ్డి, బొలిశెట్టి నవీన్, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.