పదేళ్లు వెనక్కెళ్తే కనిపిస్తాయి రైతుల బాధలు.. పంటలు పండించేందుకు పడరాని పాట్లు పడ్డారు. వేళాపాళా లేని కరెంటు కోతలతో పొలాల వద్దే జాగారాలు చేశారు. నరకయాతన అనుభవించారు. లో ఓల్టేజీ సమస్య, సాగునీరు సరిగా లేక పంటలు ఎండిపోయి భూములన్నీ బీళ్లను తలపించేవి. చాలామంది రైతులు వ్యవసాయం వదిలేయడంతో బాగా పంటలు పండే భూములు సైతం బీళ్లుగా మారాయి. అప్పుడొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టారు. అన్నదాతలపై దృష్టిపెట్టారు. సమస్యలను సమూలంగా రూపుమాపి వ్యవసాయాన్ని పండుగ చేశారు. దీంతో రైతన్నలు సుభిక్షంగా ఉన్నారు. మోములు చెరగని చిరునవ్వులతో కళకళలాడుతున్నాయి. ఈ తరుణంలో అబద్ధాల కాంగ్రెస్ కుట్రలు చేసి అధికారం కోసం పాకులాడుతున్నది. 3 గంటల విద్యుత్, 10హెచ్పీ మోటర్లతో పంటలు పండించుకోవచ్చని రైతులను ముంచే మాటలు మాట్లాడుతున్నారు. అదే జరిగితే మళ్లీ భూములన్నీ బీళ్లుగా మారడం ఖాయం.. రైతన్నల ఇంట నిత్యం కన్నీళ్లూ ఖాయం. నిరంతరం తమ బాగు గురించి ఆలోచించే బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు అంటూ స్పష్టం చేస్తున్నారు రైతులు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : పదేళ్లకు ముందు పల్లెల్లో రైతులు తమ భూముల్లో పంట పండించేందుకు పడరాని పాట్లు పడ్డారు. వేళాపాళా లేని కరెంటు కోతలతో పొలాలు, చేల వద్దే జగారాలు చేసి నరకయాతన అనుభవించారు. లో ఓల్టేజీ సమస్య, చెరువులు, బావుల్లో నీరు లేక.. సాగునీరు సరిగా అందక పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పంట భూములను వదిలి వలసబాట పట్టారు. కొందరు ఉన్న భూములను అమ్ముకొని కూలీలుగా మారగా.. మరికొందరు పంటపై చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఆనాడు పటేల్, పట్వారీ వ్యవస్థతో రైతుల భూములకు రక్షణ లేకపోవడం.. లంచాలు తీసుకొని ఒకరి భూములు మరొకరి పేరుపై రాయడంతో అవస్థలు పడ్డారు. తరచూ కుటుంబ సభ్యులతోపాటు గెట్ల తగాదాలు జరగడం.. వీటిని పరిష్కరించేందుకు పెద్దమనుషులు, మధ్యదళారీలు రంగంలోకి దిగి అందిన కాడికి దండుకోవడం నిత్యకృత్యమయ్యేది. ఇదంతా ఉమ్మడి పాలనలో ఊళ్లల్లో నిత్యం జరిగిన తంతు. ఇలాంటి గోస రైతులు ఇకపడొద్దనే ఉద్దేశంతో రైతు కుటుంబం నుంచి వచ్చిన ఉద్యమ నేత, సీఎం కేసీఆర్.. కర్షకుల బాగుకోసం నిరంతర విద్యుత్ను అందుబాటులోకి తెచ్చారు. 24 గంటలపాటు ఉచిత విద్యుత్ను అందిస్తూ రైతులు రెండు పంటలు పండించుకునేలా చేశారు. ఎవరి ప్రమేయం లేకుండా రైతుల భూముల రిజిస్ట్రేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు ధరణి పోర్టల్ను తెచ్చారు. మార్కెట్లో భూమి విలువ పెరిగేలా చేశారు. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు మేమొస్తే.. 3 గంటల విద్యుత్, 10హెచ్పీ మోటర్లతో పంటలు పండించుకోవచ్చని రైతులను నిండా ముంచే మాటలు మాట్లాడుతున్నారు. ధరణి పోర్టల్ స్థానే పటేల్, పట్వారీ వ్యవస్థ అంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేయడంపై కర్షకులు మండిపడుతున్నారు. కాంగ్రెసోళ్లకు ఓటుతోనే బుద్ధి చెబుతామని, తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీనే మరోసారి ఆదరిస్తామని ఉమ్మడి జిల్లా రైతులు, చిరు వ్యాపారులు, ప్రజలు మద్దతు పలుకుతున్నారు.
గత పాలకుల హయాంలో ఎక్కడ చూసినా భూసమస్యలే ఉండేవి. కాంగ్రెస్ పాలనలో దళారులు రాజ్యమేలుతారు. రైతులు ఆగమైతరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24గంటల కరెంటుతోపాటు రైతుబంధు వస్తున్నది. ఎంతో సంతోషంగా రైతులు పంటలు సాగుచేసుకుంటున్నారు. మరోపక్క ధరణి పోర్టల్తో రైతుల భూములు భద్రంగా ఉన్నాయి. రైతులకు మంచిచేసే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పాలన వస్తే రైతులకు చీకటిరోజులే. మాకు కాంగ్రెస్ పాలన వద్దు… మూడు గంటల కరెంటు వద్దు. ధరణి ఉండాలి. కేసీఆరే సీఎంగా రావాలి. రైతులంతా కేసీఆర్కే మద్దతుగా నిలుస్తారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు గంటలపాటు కరెంటు ఇవ్వటం కనాకష్టంగా ఉండేది. అదీ రాత్రి నాలుగు గంటలు, పగలు మూడు గంటలు ఇచ్చేవారు. అర్ధరాత్రి పొలాలకాడ కరెంటు ఎప్పుడిస్తారా… అని కంటికి కనుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్లం. వచ్చిన కరెంటుతో పంటలు ఒకపక్క పండుతుంటే, మరోపక్క ఎండుకుంటూ ఉండేవి. కేసీఆర్ 24 గంటలు కరెంటు తీసుకొచ్చి రైతులకు దేవుడిలా మారాడు. పగలే పొలాలకు వెళ్లి మోటర్ ఆన్ చేసి, ఇంటికి వచ్చి, మళ్లీ సాయంత్రం వెళ్లి ఆఫ్ చేసుకుంటున్నాము. ఇక రాత్రి కరెంటుతో పనేముంది..? ఉన్న కరెంటుతోనే చేను తడుస్తున్నది. పక్క పొలాలకు కూడా బోరు నీళ్లు ఇస్తున్నాం. డ్రిప్ సిస్టం వచ్చాక నీటికి కొరత లేదు. కేసీఆర్ మంచి పనులే చేసిండు. ఆయన ప్రభుత్వమే మళ్లీ రావాలి.
మూడు గంటల కరెంట్ ఇస్తే.. రైతులు తీవ్రంగా నష్టపోతారు. మూడు గంటల్లో ఎకరం భూమి ఎట్ల తడుస్తదో కాంగ్రెసోళ్లే చెప్పాలి. ఎకరం భూమి తడపాలంటే 5 హెచ్పీ మోటర్తో ఐదు గంటలే పడుతుంది. మూడు గంటల కరెంట్ ఇస్తే.. ఒకే సమయంలో ట్రాన్స్ఫార్మర్ల మీద లోడు పడి కాలిపోతాయి. అప్పుడు కూడా రైతులకు ఇబ్బందులే. ఇక 10 హెచ్పీ మోటర్లు అంటున్నారు. వీటితో కూడా రైతులకు ఏమాత్రం లాభం ఉండదు. పైగా బాగా నష్టపోతారు. కాంగ్రెసోళ్లకు కరెంట్ మీద అవగాహన లేనట్లున్నది. మూడు గంటల కరెంట్,10 హెచ్పీ మోటర్లు రైతులకు తీవ్ర నష్టం చేసినట్లే. బీఆర్ఎస్ ప్రభుత్వమే కరెంట్ కష్టాలు లేకుండా చేసింది. రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కాంగ్రెసోళ్ల మాటలు వింటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. కేసీఆర్ సారే మళ్లీ రావాలి.
సీఎం కేసీఆర్ వల్లనే చీకటి తెలంగాణలో వెలుగులు నిండాయి. ఆయన వచ్చినంక ఒక్క గడియ కూడా కరెంటు పోట్లేదు. ఉచిత కరెంటును, 24 గంటల కరెంటును ఆనాడు చాలామంది కాంగ్రెసోళ్లు తప్పుబట్టారు. కానీ అదే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కరెంటు మిల్లులు కట్టారు. 24 గంటలపాటు నాణ్యమైన కరెంటును ఇస్తున్నారు. రైతుల యగసాయానికి ఫ్రీగానే ఇస్తున్నారు. అయినప్పటికీ కొందరు మనుషులు ఓర్వలేక అబద్ధాలు మాట్లాడారు. కేసీఆర్ మీద ఉన్న కచ్చతోనే లేనిపోని మాటలు చెప్పారు. వాళ్లు ఎన్ని నిందలు మోపినా సీఎం కేసీఆర్ 24 గంటలు కరెంటును ఇచ్చి చూపిస్తున్నారు. అయినా ఆనాడు అబద్ధాలు మాట్లాడినోళ్లు, నిందలు మోపినోళ్లు అందరూ కలిసి సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటును వాడుకుంటున్నరే ఉన్నరు కదా? అయినా అందరినీ సమానంగా చేస్తున్న కేసీఆర్పై కొందరు కావాలనే కచ్చగట్టారు. అయినా వాళ్లు మళ్లీ సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలను తీసుకుంటనే ఉన్నరు. తరువాత తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నరు. అందుకే ఇలాంటి కాంగ్రెసోళ్లను నమ్మొద్దు. పొరపాటున నమ్మి వాళ్లకు అధికారమిస్తే ఇప్పుడున్న పథకాలన్నిటినీ పోగొడతరు. తరువాత ఉత్తుత్తి పథకాలు పెడతరు. మళ్లీ జనాలను మోసం చేస్తరు.
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులకు ఎంతో ఉపయోగం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే ధరణి తీసేస్తే రైతులు అనేకవిధాలుగా ఇబ్బందులకు గురవుతారు. ధరణి వల్ల ఎప్పటికప్పుడు రైతులకు కావాల్సిన సమాచారం అందుబాటులో ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తోంది. అందుకే కల్లబొల్లి మాటలు చెప్తున్నాయి. మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం అవివేకమే. ధరణిని మార్చి భూమాత పెడతామని అంటున్నారు. అంతా మమ్మల్ని ఆగం చేయడానికే చూస్తోంది. రైతులను ఆదుకునే ప్రభుత్వం కేవలం కేసీఆర్ ప్రభుత్వమే. మా మద్దతు ఆయనకే.
మూడు గంటల కరెంటుతో రైతులకు మళ్లీ పాత కరెంటు కష్టాలు వస్తాయి. కాంగ్రెస్ హయాంలో సమయానికి కరెంటు రాక పంటలు ఎండిపోయాయి. రైతులు చాలా నష్టపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటుతో సంతోషంగా వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. రెండు పంటలను ఢోకా లేకుండా పండించుకుంటున్నం. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత రోజులే దాపురిస్తాయి. కర్నాటక రైతులు పడుతున్న భాధలు మాకొద్దు. కరెంటు కోసం పడిగాపులు కాసే ప్రభుత్వం మాకొద్దు. రేవంత్రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదు. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోమంటున్నడు. ఇది సన్న, చిన్నకారు రైతులకు సాధ్యం కాదు. 10 హెచ్పీ మోటర్లు బిగిస్తే ఖర్చు ఎక్కువవుతుంది. బోర్లు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటుతో రంది లేకుండా బతుకుతున్నం. రైతుల సంక్షేమం కోరే బీఆర్ఎస్ పార్టీకే రైతుల మద్దతు ఉంటుంది.
రైతుల భూముల కోసం ఏర్పాటు చేసిన ధరణి లేకపోతే గ్రామాల్లో భూ బకాసురులు పెరుగుతారు. ధరణి వల్ల భూములకు ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో భూముల విషయంలో దళారులు ఉండి రైతుల భూములను ఒకరి పేరు మీద నుంచి మరొకరికి అధికారుల సహాయంతో మార్చేవారు. మళ్లీ వాటిని సరిచేయడానికి రైతుల వద్ద డబ్బులు వసూలు చేసేవారు. కానీ ధరణి వల్ల దళారుల బెడద లేకుండా పోయింది. రైతులకు మంచి జరుగుతుంది. రైతులంతా బీఆర్ఎస్ వెంటే ఉంటాం. కారు గుర్తుకే ఓటు వేస్తాం. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేస్తాం.
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రైతులు ఆనందంగా ఉన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు. 5 హెచ్పీ మోటర్లు మంచిగా తిరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల కరెంటు మోటర్లుకు మీటర్లు పెట్టమని చెబితే, సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు ఇవ్వడంతో రైతులు ఆర్థికంగా బలపడ్డారు. కౌలు రైతులకు రైతుబంధు ఇస్తే.. వీరికీ, భూయజమానికీ మధ్య గొడవలు జరుగుతాయి.
తెలంగాణ రాష్ర్టానికి ఎప్పటికీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో రైతుల బాధలు వర్ణణాతీతం. ముఖ్యమంత్రీ రైతులను పట్టించుకోలేదు. ఎవడో కొత్తోడు వస్తడు ఏదో చేస్తడంటే నమ్మేట్టు రైతులం లేము. ఇంతగా రైతులకు మంచి చేస్తున్న కేసీఆర్ను కాదని వేరేవోడిని గెలిపించం. కేసీఆర్ పార్టీని గెలిపిస్తాం.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తాం. పంట పెట్టుబడికి రైతుబంధు ఇస్తున్నడు. పంటలు పండించుకునేందుకు నీటి కరువులేకుండా చేసిండు. అన్నదాతను ఆదుకుంటున్న కేసీఆర్ పదికాలాలపాటు మన రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండాలి.
ధరణి పోర్టల్ తీసేస్తే.. మళ్లీ వీఆర్వో వ్యవస్థ వచ్చి, రైతులను నట్టేట ముంచడం ఖాయం. ధరణికి ముందు తెలంగాణలో ఉన్న దారుణ పరిస్థితి మళ్లీ వస్తుంది. గతంలో రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ను అస్సలు నమ్మొద్దు, మోసపోవద్దు. ధరణి పోర్టల్తో రైతుల భూమిని కాపాడిన, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్న కేసీఆరే మళ్లీ రావాలి.
రైతుల గురించి కేసీఆర్లాగా ఆలోచించిన ముఖ్యమంత్రి గతంలో ఎవరూలేరు. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ రైతులందరూ కోరుతున్నారు. ఈసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో రైతులు దేశానికి ఆదర్శంగా నిలుస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించేందుకు మేం కూడా ప్రచారంలో పాల్గొంటున్నాము.
కాంగ్రెస్ హయాంలో కరెంటు కోసం బోరు బావుల వద్ద పడికాపులు కాసేవాళ్లం. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. గతంలో కరెంటు కోసం పడిన కష్టాలు మర్చిపోలేము. రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లిన వారిలో పురుగు, పుట్రా కుట్టి చనిపోయిన వారెందరో ఉన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోదు. సీఎం కేసీఆర్ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే మా మద్దతు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తుండటంతో పంటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. కేసీఆర్ వచ్చాకే రైతులంతా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా బతుకుతున్నారు. రానున్న ఎన్నికల్లో నా ఓటు కేసీఆర్కే. కాంగ్రెస్ను రైతులు నమ్మరు. కేసీఆర్ రావాలి. బీఆర్ఎస్సే కావాలి.
తొమ్మిదేండ్ల నుంచి కరెంటు కష్టాలు లేవు. గత పాలనలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గంటల కరెంటు అని చెప్పి, రెండు మూడు గంటలు మాత్రమే ఇచ్చింది. ఆ సమయంలో కాలువలు తడవటానికే సరిపోయేది. పంటలు సగం ఎండిపోయేవి. ఆ కష్టాలు గుర్తుకు తెచ్చుకుంటే ఏడుపువస్తుంది. ఆ కాంగ్రెస్ పాలన మాకొద్దు. కేసీఆర్ పాలన బాగుంది. మళ్లీ సారే కావాలి. కారు గుర్తుకే ఓటేస్తాం.
పాత విధానాన్ని తీసేసి, ధరణిని కేసీఆర్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక రైతు భూమి మరొకరికి మారదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూముల రికార్డుల తారుమారు కావు. రైతు వచ్చి వేలి ముద్ర వేస్తేనే భూమి మార్పిడి జరుగుతది. ఇలాంటి పద్ధతి ఎక్కడా లేదు. పాత విధానం అంటే మళ్లీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తది. మంచి పరిపాలనకే మా ఓటు ఉంటది. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆయనకే మా రైతుల మద్దతు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు అన్నివిధాలుగా అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీతోనే సాగుతాం. రైతులకు వ్యవసాయానికి 24గంటల ఉచితంగా కరెంటు ఇచ్చి రైతులకు కొండంత అండగా నిలిచారు సీఎం కేసీఆర్. రైతు పక్షపాతిగా రైతులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారిని అప్పుల బాధ నుంచి విముక్తుల్ని చేశారు. భవిష్యత్ తరాల అభ్యుదయానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ను మరవద్దని తప్పకుండా కారుగుర్తుకే ఓటు వేస్తాం. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ను సీఎం చేస్తాం.
కాంగ్రెస్ పాలనలో రైతులం ఎంత కష్టపడ్డామో ఇప్పటికీ గుర్తుంది. గంటకోసారి కరెంటు పోతుంటే రాత్రి వేళల్లో బోరు బావి కాడ పడుకునేవాళ్లం. విద్యుత్ షాక్, పాముకాటుతో ఎంతోమంది రైతులు చనిపోయారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండటంతో రాత్రి వేళ పొలాలకు వెళ్లే బాధ తప్పింది. మళ్లీ కాంగ్రెస్ వస్తే బోరు బావులకాడ పడుకోవాలి. అప్పుడు రైతులకు చావులు తప్పవు. ఈ కష్టాలన్నీ ఉండకూడదు. అందుకే.. బీఆర్ఎస్ రావాలి.
రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు పెట్టారు. చెరువుల్లో నీరు నిండుగా ఉండి రెండు పంటలు పండించుకుంటున్నాము. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నడు. పంటలు ఎండుడన్న మాటేలేదు. రైతుబీమా, రైతుబంధు పథకాలు రైతులకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి. రైతుల బతుకులు పదికాలాలపాటు పచ్చగుంటాయి. పంటలు ఎండిపోతాయన్న బెంగ రైతుకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుకు మళ్లీ కష్టాలు తప్పవు.
తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి కరెంట్ కష్టాలు తీరిపోయాయి. కాంగ్రెస్ ఇస్తామంటున్న మూడు గంటల కరెంట్తో 20 కుంటల భూమి కూడా తడవదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24గంటల కరెంట్తో పగటిపూట పొలాలకు నీళ్లుకట్టుకొని రాత్రిపూట ఇంట్లో హాయిగా నిద్రపోతున్నాము. రైతుల సంక్షేమం కోసం 24గంటల ఉచిత కరెంట్, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేస్తాం. మూడు గంటల కరెంట్ అంటే వెనకటి తిప్పలు కొనితెచ్చుకోవడమే.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పాలనలో విద్యుత్ కష్టాలు తప్పాయి. 24 గంటల కరెంటు ఇచ్చి రైతులకు రైతుబంధు, రైతుబీమాతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశారు. గతంలో కాంగ్రెస్ పాలకుల హయాంలో కరెంటు అంటే ఎలా ఉంటదో తెలియని పరిస్థితి. పొలాల్లో రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు పడేవారు. ఎప్పుడు కరెంటు వస్తుందో… ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. మళ్లీ కాంగ్రెసోళ్లు రైతులను నట్టేట ముంచేందుకు మూడు గంటల కరెంటు, 10హెచ్పీ మోzర్లు అంటూ రైతులను మభ్యపెడుతున్నారు. కాంగ్రెస్ పాలన వస్తే రైతులకు చీకటి రోజులు తప్పవు. వ్యవసాయం పడాకు పడుతుంది. కేసీఆరే రావాలి… రైతులకు మళ్లీ పండుగ కావాలి.
కాంగ్రెసోళ్లు ధరణిని రద్దుచేసి భూమాత తెస్తామంటున్నారు. భూమాతతో రైతుల బతుకులు ఆగమైనట్లే. ఆనాటి భూ సమస్యలు మళ్లీ ఉత్పన్నమవుతాయి. దళారులు రాజ్యమేలుతారు. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మళ్లీ రైతుకు పాతరోజులే వస్తాయి. ధరణితో రైతుల భూములు భద్రంగా ఉన్నాయి. రైతు పంటలకు రైతుబంధు అందుతుంది. పట్టాదారు పాస్పుస్తకాలు, రికార్డులకు ధరణితో రక్షణ ఉంది. కాంగ్రెస్ వస్తే భూమాత తెచ్చి రైతులను నట్టేట ముంచుతారు. రైతులందరూ కేసీఆర్కు మద్దతు పలకాలి. కేసీఆరే మళ్లీ రావాలి.
ధరణి పోర్టల్ను తీసివేస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ధరణి తీసివేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి. కాంగ్రెస్ నాయకులు రైతులను నట్టేట ముంచాలని చూస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో లంచాలు, ఫైరవీలు పేట్రేగిపోయాయి. సీఎం కేసీఆర్ వచ్చిన తరువాత, వాటన్నిటికీ తావు లేకుండా రైతుల భూములకు భద్రత కల్పించారు. తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అవే రోజులు దాపురిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓటు వేయం. బీఆర్ఎస్తోనే రైతులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది.
కాంగ్రెస్ రాజ్యం పొరపాటున వస్తే.. రైతుల బతుకులు కకావికలమే. రైతుల బాగు కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణిని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రద్దు చేసి భూమాత పోర్టల్ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ధరణిని రద్దు చేస్తే మళ్లీ రాబందుల రాజ్యం వస్తుంది. రాబందులు పీక్కు తిన్నట్లు.. దళారులు రైతుల వద్ద ఇష్టారీతిన డబ్బులు గుంజుతారు. రైతుల గోస ఎవరూ తీర్చలేరు. సీఎం కేసీఆర్ సార్ పాలనలో రైతులు చల్లగా ఉన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న బీఆర్ఎస్ పార్టీకే రైతుల మద్దుతు.
తెలంగాణ ప్రభుత్వం గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతుబంధు, రైతు బీమాతో ఆదుకుంటున్నది. కాంగ్రెస్ నాయకులు మాత్రం పైరవీల పేరుతో మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ వారం రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకుల మాటలు రైతులు విని మోసపోయే పరిస్థితి లేదు. మళ్లీ కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తాం. భూమాత తెస్తామంటున్నారు. కరెంటు మూడు గంటలే ఇస్తామంటున్నారు. ఇలా చేస్తే రైతులకు పాత రోజులు వచ్చి ఆగమైపోతారు. వాళ్లను నమ్మి మోసపోం. మళ్లీ కేసీఆర్కే మా ఓటు.