తిరుమలాయపాలెం, ఆగస్టు 22 : భూములున్నా పంటలు పండించుకుందామంటే నీరు లేదాయె.. బావుల్లో కొద్దోగొప్పో ఉన్న నీటితో మోటార్లతో నీరు పెడదామంటే కరెంటు రాదాయె.. బతుకులు బాగుపడాలంటే ఊరొదలాల్సిందేననే నిర్ణయానికొచ్చిన రైతులు ఇళ్లు, భూములను వదిలి వలసబాట పట్టారు. అప్పుడప్పుడూ అతిథుల్లా వచ్చిపోతూ ఏళ్లు గడుస్తున్న క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అత్యంత కరువు మండలంగా గుర్తించిన సీఎం కేసీఆర్.. తిరుమలాయపాలెంను తిరుగులేని విధంగా తీర్చిదిద్దారు. తీరొక్క వసతులు కల్పించారు. పుష్కలమైన జలవనరులను తీసుకొచ్చి రెండు పంటలు పండించుకునేలా మార్చారు. వలసవెళ్లిన రైతులందరూ ఇంటిపట్టునే ఉండి వ్యవసాయం చేసుకునేలా చేశారు. పాఠశాలలు, ఆస్పత్రులు, రోడ్లను అభివృద్ధి చేసి.. సాగు భూములను సస్యశ్యామలం చేశారు. మండలాన్ని ఇంతగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్కు ఆ ప్రాంతవాసులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరువు ప్రాంతంగా అల్లాడిన తిరుమలాయపాలెం మండలం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథాన పయనిస్తోంది. ఆంధ్రా పాలకుల హయాంలో చుక్కనీరు లేక రైతులు పంట భూములను వదిలి బతుకు దెరువు కోసం వలసబాట పట్టారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించడంతో వలస వెళ్లిన రైతులందరూ ఇంటిబాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన సాగునీటి సౌకర్యంతో సంబురంగా సాగు పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మండలంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసిన ప్రభుత్వం సాగు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం కోసం అధిక నిధులు ఖర్చు చేసింది. స్వరాష్ట్ర పాలనలో ప్రజల కల సాకారం కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇలాంటి ప్రభుతం మరికొన్ని దశాబ్దాలపాటు కొనసాగాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు.
రూ.92 కోట్లతో ఎత్తిపోతల పథకం
పాలేరు నియోజకవర్గంలో కరువు ప్రాంతాలైన తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూ.92కోట్ల వ్యయంతో శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. దీని ద్వారా పాలేరు రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కరువు నేలల్లో పారించింది. ఐదేళ్లుగా మూడు మండలాల్లోని అన్ని చెరువులను నింపుతున్నారు. 59 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుండడంతో రైతులు రెండు పంటలు ఆనందంగా పండిస్తున్నారు.
రూ.13.7 కోట్లతో ‘మిషన్ కాకతీయ’
మండలంలో మూడు విడతల్లో మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.13.70కోట్ల వ్యయంతో 76 చెరువులను ప్రభుత్వం బాగు చేసింది. చెరువుల్లో పూడికతీత, కట్టలు, తూములు, అలుగుల మరమ్మతు పనులను పూర్తి చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. దీంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగడంతోపాటు బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెంపొందాయి.
చెక్డ్యామ్ కం బ్రిడ్జిల నిర్మాణం
మండలంలోని గ్రామాల పక్కనే ప్రవహిస్తున్న పాలేరు, ఆకేరు వాగుపై ప్రభుత్వం రూ.38కోట్ల వ్యయంతో హైదర్సాయిపేట, అజ్మీరతండా, తిరుమలాయపాలెం ప్రాంతాల్లో చెక్డ్యామ్లు కం బ్రిడ్జిలు నిర్మించింది. పిండిప్రోలు, ముజాహితిపురంలో రూ.10కోట్లతో చెక్డ్యామ్లు నిర్మించారు.
మిషన్ భగీరథతో తాగునీరు
రూ.75కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపట్టి స్వచ్ఛమైన తాగునీటిని మండలంలోని అన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. 40 గ్రామపంచాయతీల్లో ట్యాంకులు, పైపులైన్ నిర్మాణాలు పూర్తి చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తున్నారు.
రూ.20కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం
పిండిప్రోలు, హైదర్సాయిపేట, సుబ్లేడు గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం రూ.20కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించింది. ట్రాన్స్ఫార్మతోపాటు కొత్త లైన్లు వేయడంతో లో లో వోల్టేజీ సమస్యకు పరిష్కారం లభించింది. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ను అన్ని రంగాలకు నిరాటంకంగా అందిస్తోంది.
రూ.103కోట్లతో రోడ్ల నిర్మాణం
మండలంలోని పలు గ్రామాల్లో రూ.93కోట్లతో 103 కిలోమీటర్ల మేర 24 పక్కా రోడ్లను ప్రభుత్వం నిర్మించింది. మారుమూల గ్రామాలు, తండాలకు సైతం బీటీ రోడ్లు వేశారు. దీంతో వ్యవసాయ భూములకు ధరలు పెరిగాయి. ఎకరం భూమి రూ.30లక్షల నుంచి రూ.1.50కోట్ల ధర పలుకుతోంది. ఈ క్రమంలో గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. వ్యవసాయ భూములున్న రైతులు కూడా కోటీశ్వరులయ్యారు. ఇటీవల ఎస్డీఎఫ్ కింద గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలకు మరో రూ.10కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
పల్లె ప్రగతిలో మౌలిక వసతులు
పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి రూ.వందల కోట్లు వెచ్చించి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించింది. మండలంలోని 40 గ్రామాల్లో రూ.5.4 కోట్లతో వైకుంఠధామాలు నిర్మించింది. ఆరు గ్రామాల్లో రూ.13.8కోట్లతో నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రభుత్వం నిర్మించింది. అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. గ్రామానికి ఒక నర్సరీని చేపట్టి ఐదేళ్లుగా హరితహారం ద్వారా మొక్కలు నాటి గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది. రూ.1.76కోట్లతో ఎనిమిది గ్రామాల్లో రైతు వేదికలను నిర్మించారు.
రూ.4.50కోట్లతో ఆస్పత్రి నిర్మాణం
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో రూ.4.50కోట్లతో మండల కేంద్రంలో నూతనంగా 30 పడకల ఆస్పత్రిని నిర్మించారు. దీనిని ప్రభుత్వం ఇటీవల వంద పడకలకు అప్గ్రేడ్ చేసింది. గ్రామాల్లో పల్లె దవాఖానలను ఏర్పాటు చేసి 54 రకాల టెస్ట్లను ఉచితంగా చేస్తున్నారు.
రూ.6కోట్లతో ‘మన ఊరు-మన బడి’
ప్రభుత్వం మండలంలోని 25 ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద అభివృద్ధి పనులు చేపట్టింది. పాఠశాలల్లో గదుల నిర్మాణం, మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ కల్పన తదితర పనులు చేపట్టారు. ఆయా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇంటింటికీ సంక్షేమ పథకాలు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయి. మండలంలోని ఇప్పటివరకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 చొప్పున 2,225 మంది లబ్ధిదారులకు అందజేసింది. రైతుబంధు పథకం ద్వారా మండలంలో ఏటా 19,941 మంది రైతులు రూ.22.12కోట్లు లబ్ధి పొందుతున్నారు. వివిధ కారణాలతో మరణించిన 252 మంది రైతులకు ప్రభుత్వం రైతుబీమా పథకం ద్వారా రూ.138కోట్లు చెల్లించింది. వివిధ గ్రామాల్లో 9,724 మంది ఆసరా పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు.
కేసీఆర్ పాలన బాగుంది
రాష్ట్రంలో కేసీఆర్ పాలన బాగుడడంతో అందరికీ మేలు జరుగుతున్నది. రైతులు, పేదకలు, అన్ని కులాలవారికి ప్రభుత్వం సహాయం చేస్తున్నది. రజక వృత్తితోపాటు ఇస్త్రీ చేసుకొని జీవనం సాగించే తనకు కులవృత్తిదారుల పథకం కింద ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చింది. ఇంటి జాగ ఇచ్చింది. ఇలాంటి ప్రభుత్వం ఉండడం వల్ల తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటా.
-రేపాకుల ఎల్లయ్య, లబ్ధిదారుడు, పిండిప్రోలు