మామిళ్లగూడెం, డిసెంబర్ 22 : శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజుల్లోపు తమ ఎన్నికల ఖర్చు వివరాలు అందించాలని అసెంబ్లీ ఎన్నికల వ్యయ నోడల్ అధికారి విజయకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయ ఖాతాల రికన్సిలేషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీల ప్రతినిధులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఖర్చు వివరాలను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలన్నారు.
అభ్యర్థుల బ్యాంకు ఖాతా స్టేట్మెంట్పై బ్యాంక్ మేనేజర్ ధ్రువీకరించి.. అభ్యర్థి సంతకం చేయాలని తెలిపారు. ఖర్చులకు సంబంధించిన వోచర్లపై అభ్యర్థి లేదా అభ్యర్థి ఏజెంట్ సంతకం తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ నెల 29న పరిశీలకుల సమక్షంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు రికన్సిలేషన్ ఉంటుందని, దీనికి పూర్తి వివరాలతో ప్రతినిధులు హాజరుకావాలని తెలిపారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా అందించాలని సూచించారు. జనవరి 2వ తేదిలోపు పూర్తిస్థాయిలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు, అఫిడవిట్ను సమర్పించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా ఆడిట్ ఉప సంచాలకులు హుస్సేన్నాయక్, వ్యయ పరిశీలకులు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.