వేంసూరు, మార్చి 28 : పదో తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఇన్విజిలేటర్, ఇద్దరు అధికారులపై డీఈవో చైతన్య జైని శనివారం వేటు వేశారు. వేంసూరు మండలం వేంసూరు, ఆడసర్లపాడు పరీక్ష కేంద్రాలను శనివారం తనిఖీ చేసిన ఆమె.. పరీక్షల నిర్వహణలో లోపాలను గుర్తించారు. ఆడసర్లపాడు కేంద్రంలో విద్యార్థులు ప్రశ్నపత్రంపై హాల్ టికెట్ వేయకుండా సగం పరీక్ష పూర్తి చేశారు.
దీనిని గమనించిన డీఈవో ఇన్విజిలేటర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇన్విజిలేటర్ చాట్ల కిశోర్ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ రవిబాబు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ శ్రీనివాసరావులపై కూడా చర్యలు తీసుకుని, తదుపరి పరీక్ష విధుల నుంచి తొలగించనున్నట్లు డీఈవో తెలిపారు. పరీక్ష విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా డీఈవో ఆదేశించారు.