పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలు సామాన్య ప్రజానీకానికి గుదిబండగా మారాయని గులాబీ శ్రేణులు రణభేరి మోగించారు. ఎడాపెడా ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వంపై పిడికిలి బిగించారు. కేంద్ర ప్రజావ్యతిరేక విధానాల పై ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో టీఆర్ఎస్ నాయకులు కార్యక్షేత్రంలోకి దిగారు. ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు గులాబీ జెండాఎత్తారు. గురువారం
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆందోళనలు చేపట్టారు. ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలను తాళ్లతో లాగుతూ.., సైకిల్ తొక్కుతూ, గ్యాస్బండను భుజానెత్తుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వ హించి దహనం చేశారు. కేంద్ర విధానాలతోనే ధరలు పెరుగుతు న్నాయని మండిపడ్డారు. ధరల నియంత్రణలో బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించే వరకు పోరు చేస్తామని హెచ్చరించారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలపై టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు.. నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.. గ్యాస్ సిలిండర్లు ఎత్తి వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.. ఖమ్మం జిల్లాకేంద్రంలో సుడా (స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ బచ్చు విజయ్కుమార్, నగర మేయర్ నీరజ, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైకిల్ తొక్కారు. డీసీబీసీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పట్టణవాసులతో కలిసి ట్రాక్టర్ను తాళ్లతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. వైరాలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మణుగూరులో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని గ్యాస్ సిలిండర్ పైకెత్తి నిరసన తెలిపారు. నాయకులతో కలిసి నల్లజెండాలతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఇల్లెందులోని బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రిక్షా తొక్కుతూ నిరసన తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
– నమస్తే నెట్వర్క్