ఖమ్మం, ఆగస్టు 10 : దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మేత్రాసనం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో నిరసన ప్రార్థనతో ధర్నా నిర్వహించారు. తొలుత జడ్పీ సెంటర్లోని అంబేదర్ విగ్రహానికి మేత్రాసనం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాశ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్యాథలిక్లు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బిషప్ ప్రకాశ్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినా దళిత క్రైస్తవుల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు. దళితులు తమకు ఇష్టమైన క్రైస్తవ మతంలో చేరినంత మాత్రాన దళితుల ఆర్థిక స్థితిలో మార్పు రాలేదన్నారు.
ప్రభుత్వం తరఫున పలు రకాల కమిషన్లు వేసినప్పటికీ వాటి వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లభించలేదన్నారు. ప్రభుత్వాలు దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రకాశ్ కోరారు. కార్యక్రమంలో మేత్రాసనం ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఫాదర్ సెబాస్టియన్, ఫాదర్లు మాదాసు రాజు, కొమ్ము అంటోనీ, తప్పెట్ల శౌరి, జోజిరెడ్డి, బత్తుల జయరాజు, సిస్టర్ సుందరి, లేటి కమిటీ బాధ్యులు ఎం.ప్రసాద్, కొమ్ము ప్రసాద్, పిల్లి సుందరి తదితరులు పాల్గొన్నారు.