ఖమ్మం రూరల్, నవంబర్ 24: కాంగ్రెస్ పార్టీ పాలేరు అభ్యర్థిగా పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి బందిపోటు దొంగకంటే ప్రమాదకరమైన వాడని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. పాలేరు ప్రజల గుండె చప్పుడులా ఉన్న కందాళ గురించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి చేష్టలతో పాలేరు నియోజకవర్గంలోని పచ్చటి పల్లెల్లో చిచ్చులు పెడుతున్నాడని ఆరోపించారు. ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డితో కలిసి రెడ్డిపల్లి, పల్లెగూడెం, పోలెపల్లి, గోళ్లపాడు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కందాళ అంటే ప్రేమ, దయ, జాలికి నిదర్శనమని అన్నారు. అలాంటి నాయకుడిపై కాంగ్రెస్ అభ్యర్థి అనుచితంగా మాట్లాడటం, కరపత్రిక పేరుతో చిల్లర చేష్టలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ధనం చూసుకోని విర్రవిడితే ప్రజల చేతిలో పరాభవం తప్పదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి మరింత ప్రగతికి సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యరి కందాళ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. పాలేరు అంటేనే ప్రశాంతతకు నిలయమని అన్నారు. ఇలాంటి ప్రదేశంలో పొంగులేటి చొరపడ్డారని, పల్లెల్లో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు. ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో అర్హులందరికీ దళితబంధు పథకం అందుతుందని అన్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బానోత్ చంద్రావతి, తాళ్లూరి జీవన్కుమార్, బెల్లం వేణుగోపాల్, యండపల్లి వరప్రసాద్, బెల్లం ఉమ, కళ్లెం వెంకటరెడ్డి, కొండం కళమ్మ, టీ.సంధ్యారాణి, అక్కినపల్లి వెంకన్న, గుండు శ్రీనివాస్, ఆంజనేయులు, మరికంటి వెంకటేశ్వర్లు, మురళి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.