లక్ష్మీదేవిపల్లి, మార్చి 3: నలుగురి ఆకలి తీర్చే రైతన్న ఇప్పుడు దిగాలు పడ్డాడు. సాగునీరు అందక, పంటలను కాపాడుకోలేక విలవిలలాడుతున్నాడు. వేసవి ఆరంభం కాక ముందే వాగులు, బావులు, బోర్లు ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి. లక్ష్మీదేవి మండలంలో ఇలా సుమారు 250 ఎకరాల్లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయాయి. సీతారాంపురం, బాలుతండా, పులిగుండం, గడ్డిగుట్ట, బట్టుతండా, కారుకొండ రామవరం గ్రామాల్లో తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నది. వాగుల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండడం, వర్షాభావ పరిస్థితులు, బోర్లు, వాగులు, చెరువుల్లో నీరు లేకపోవడంతోనే పంటలు ఎండిపోయాయని రైతులు వెల్లడిస్తున్నారు.
వేసవి ప్రారంభం కాక ముందే లక్ష్మీదేవిపల్లి మండలంలోని పెద్దవాగు, చినవాగులు, చెరువులు ఎండిపోయాయి. గతంలో ఇలాంటి పరిస్థితి వస్తే అధికారులు సింగరేణి కోయగూడెం ఓసీ నుంచి వాగుల్లోకి నీటిని వదులుతుంటారు. ఈసారి కూడా ప్రభుత్వం చొరవ తీసుకుని నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నీటిఎద్దడి నివారణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టేవారు. ఇప్పుడా స్పందన లేదు.
ఏటా పుష్కలంగా నీరు అందేది. కానీ ఈసారి వేసవి మొదలు కాకముందే పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి సింగరేణి కోయగూడెం ఓసీ నుంచి నీటిని మళ్లిస్తే మా పంటలు చేతికొస్తాయి. పెట్టిన పెట్టుబడులైనా చేతికొస్తాయి. సాగునీరు అందించే విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలి.
– మాలోత్ ధర్మా, రైతు, సీతారాంపురం, లక్ష్మీదేవిపల్లి మండలం
నీళ్లు పుష్కలంగా ఉన్నాయని మేం పంటలు వేశాం. సాగు ప్రారంభించి నెలా పదిహేను రోజులు దాటింది. సాగునీరు లేక పంట ఇప్పుడు ఎండిపోయే స్థితిలో ఉంది. వాగులు, చెరువులు, బావుల్లో జలాలు ఇంకిపోవడంతోనే ఈ పరిస్థితి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వం పంటలకు సాగునీరు అందించాలి.
– వాంకుడోత్ లాలు, రైతు, లాలుతండా, లక్ష్మీదేవిపల్లి మండలం