ఉమ్మడి రాష్ట్రంలో సాగు చతికిలపడింది. సాగునీరు లేక పంటలన్నీ ఎండిపోయాయి. పొలాలన్నీ బీళ్లుగా మారాయి. దీనికితోడు కరంట్ కోతలు, ఎరువులు, విత్తనాల కొరత, ధరల దరువు, పెట్టుబడుల భారంతో అన్నదాతలు అరిగోస పడ్డారు. అరక సాగక.. ఆకలి తీరక మృత్యుఒడిని ఆశ్రయించారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయి. వ్యవసాయాన్ని పండుగ చేశారు. రైతుబంధు, రైతుబీమాతో అండగా నిలవడంతో కర్షక కుటుంబాలు ఆత్మగౌరవంతో బతుకుతున్నాయి. 24గంటల నాణ్యమైన విద్యుత్తో సాగును సస్యశ్యామలం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, చెక్డ్యాంల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణతో రెండు పంటలకు ఢోకా లేకుండాపోయింది. ఖమ్మం జిల్లాలో గతేడాది వానకాలంలో 7.09 లక్షల ఎకరాలు సాగు కాగా.. 5.70 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఎకరానికి 16 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది వానకాలంలో 7.24 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా.. 6.66 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అయింది. ఈ సారి ఎకరానికి 22- 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ సారి 5 నుంచి 6 క్వింటాళ్ల ధాన్యం అదనంగా పండింది.
కూసుమంచి, డిసెంబర్ 8: వ్యవసాయం దండగ అన్న వలస పాలకుల మాటలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారు. నాడు నిరాదరణకు గురైన రైతులు ఇప్పుడు రారాజులయ్యారు. రైతుబంధు, రైతుబీమాతో ప్రతి రైతు కుటుంబానికి భరోసా లభించింది. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతున్నది. ఏటా సాగు సీజన్కు సరిపడిన ఎరువులు, విత్తనాలు సకాలంలో రైతులకు అందుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు, చెక్డ్యాంల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణతో సాగునీటి వనరులు పుష్కలమయ్యాయి. సాగర్ జలాలు, ఎస్సార్ఎస్పీ జలాలు, భక్తరామదాసు ఎత్తిపోతలతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలమైంది. ధాన్యాగారంగా మారింది. ఏటా దిగుబడులు పెరుగుతున్నాయి. రైతుల ఇంట సిరులు కురుస్తున్నాయి. గతేడాది ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షపాతం, చీడపీడల కారణంగా కాస్త ఆదాయం తగ్గినా ఈసారి అమాంతం పెరిగింది. దీంతో రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
విత్తనం నాటిన దగ్గర నుంచి దిగుబడులు మార్కెట్కు తరలేవరకు అడుగడుగునా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఉమ్మడి పాలనలో ఎప్పుడు విద్యుత్ సరఫరా ఉంటుందో తెలియక పొలం వద్ద గంటల తరబడి కాపలా కాయాల్సిన పరిస్థితి ఉండేది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందక రైతులు అల్లాడిపోయేవారు. ఆలాంటి సమస్యలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపింది. సకాలంలో రైతుల అవసరాలు తీరుస్తున్నది. ఈసారి క్వింటా ఏ- గ్రేడ్ ధాన్యానికి రూ.2,060, బీ-గ్రేడ్ ధాన్యానికి రూ.2,040 మద్దతు ధర ప్రకటించింది. రైతులకు ఇబ్బందులు లేకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నది. కొనుగోళ్లను ఎప్పటికప్పుడు ఐకేపీ, పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
గతేడాది వానకాలంలో రైతులు జిల్లావ్యాప్తంగా 7.09 లక్షల ఎకరాల్లో వరి పండించారు. 5.70 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అప్పుడు ఎకరానికి 16- 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ వానకాలంలో 7.24 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. ధాన్యం దిగుబడి 6.66 లక్షల టన్నులు వచ్చింది. ఈసారి ఎకరానికి 22- 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 5 నుంచి 6 క్వింటాళ్లు అదనపు ఆదాయం వచ్చింది. గతేడాది కంటే ఈసారి రైతులకు ఒక్కో ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల అదనపు ఆదాయం వచ్చింది.
నేను ఈ సారి 28 ఎకరాల్లో వరి పండించా. ఎకరానికి 28 క్వింటాళ్ల చొప్పున 784 క్వింటాళ్ల దిగుబడి సాధించా. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం పండింది. ఎప్పుడూ నాలుగు పుట్లు పండడమే గగనం. ఈసారి అంతకు మంచి పండింది. సర్కార్ సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు ఇవ్వడంతోనే ఇది సాధ్యమైంది.
– బొల్లంపల్లి సుధాకర్రెడ్డి, రైతు, గుర్వాయిగూడెం, కూసుమంచి మండలం
నేను గత సీజన్లో వరి సాగు చేసి నష్టపోయా. వచ్చిన ఆదాయం కౌలు చెల్లించడానికి కూడా సరిపోలేదు. ఈసారి ఐదెకరాలు కౌలుకు తీసుకుని రెండెకరాల్లో వరి, రెండకరాల్లో పత్తి, ఎకరాలో మిర్చి సాగు చేస్తున్నాను. వరి పంట చేతికివచ్చింది. ఎకరానికి 55 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొత్తం రూ.1.25 లక్షల ఆదాయం వచ్చింది.
– జర్పుల పరశురాం, కౌలు రైతు, ధర్మాతండా, కూసుమంచి మండలం
గత సీజన్లో నేను తొమ్మిది ఎకరాల్లో వరి సాగు చేశాను. అధిక వర్షపాతం కారణంగా ఎకరానికి రూ.18 వేల ఆదాయమైనా రాలేదు. రైతులకు విద్యుత్ సరఫరా ఉచితం. నీటి వసతి పుష్కలం. ఈసారి ఐదు ఎకరాల్లో వరి సాగు చేశా. ఎకరాకు 24 క్వింటాళ్లు పండించా. ఈసారి రూ.2.40 లక్షల ఆదాయం వచ్చింది.
– నెల్లూరి వెంకన్న, రైతు, కూసుమంచి