ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం మార్కెట్ యార్డులో బుధవారం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రాష్ట్రంలోనే ఎంతో ప్రత్యేకత ఉందని అన్నారు. మున్ముందు ఈ మార్కెట్ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపాలని ఆకాంక్షించారు.
-ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 1
ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 1: పుష్కలమైన వనరులు, పంట ఉత్పత్తులతో దేశానికి ఉపాధి కేంద్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలో ఉత్పాదకత రంగాల్లో సంపదను పెంచుకుందని, తిరిగి దాని ఫలాలను ప్రజలకు చేర్చిందని అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి నిరంజన్రెడ్డి హాజరయ్యారు.
అనంతరం జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి కోలాహలం నాగరాజు, మార్కెట్ సెక్రటరీ రుద్రాక్ష మల్లేశం కలిసి నూతనంగా చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, వైస్ చైర్మన్ షేక్ అఫ్జల్, పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. ఒకనాడు వెలవెలబోయిన వ్యవసాయ మార్కెట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నేడు పంట ఉత్పత్తులతో కళకళలాడతున్నాయని గుర్తుచేశారు. ఇతర రాష్ర్టాల కూలీలకు తెలంగాణ రైతుల పంట పొలాల్లో ఉపాధి పనులు లభిస్తుండడం సంతోషదాయకమని అన్నారు.
మరోవైపు తెలంగాణకు అధిక సంఖ్యలో పరిశ్రమలూ వచ్చాయన్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు జోడెడ్లుగా పయనం సాగిస్తున్నాయన్నారు. కేవలం ఐటీ రంగంలోనే 15 లక్షల కొలువులు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. స్వరాష్ట సాధనకు ముందు తెలంగాణలో ఏటా 60 లక్షల టన్నుల పంటలు ఉత్పత్తి అయితే ఇప్పుడు 3.06 కోట్ల టన్నుల పంటలు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పాలన అందిస్తుంటే.. కేంద్ర సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నా రు. బుధవారం నాటి బడ్జెట్లో వ్యవసాయరంగానికి కేటాయించిన నిధులే ఇందుకు నిదర్శనమని అన్నా రు. నిరుడు రూ.2.25 లక్షల కోట్లు కేటాయిస్తే.. ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.1.75 లక్షల కోట్లకు పరిమితం చేశారని విమర్శించారు.
రైతుల మన్ననలు చూరగొనాలి: ఎమ్మెల్సీ తాతా మధు
వ్యవసాయ మార్కెట్కు పంటను తీసుకొచ్చే రైతులకు మెరుగైన సేవలందించి వారి మన్ననలు పొందాలని ఎమ్మెల్సీ తాతా మధు ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ వల్లనే అవకాశాలు: ఎమ్మెల్సీ బండ ప్రకాశ్
దేశంలో ఏ నాయకుడూ చేయని ఆలోచనను సీఎం కేసీఆర్ చేశారని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కల్పించిన రిజర్వేషన్ల వల్లనే మార్కెట్ కమిటీల పాలకవర్గాల్లో బీసీలకు, ఇతర కూలాలకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఖమ్మం పాలకవర్గ బాధ్యులు ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు.
ఖమ్మం ఏఎంసీకి ప్రత్యేక గుర్తింపు: మంత్రి అజయ్
ఖమ్మం ఏఎంసీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ రిజర్వేషన్లో జనరల్ మహిళకు అవకాశం ఉన్నప్పటికీ బీసీలు, ముదిరాజ్ల విజ్ఞప్తి మేరకు దోరేపల్లి శ్వేతకు కేటాయించినట్లు చెప్పారు. ఐదు జిల్లాల రైతులకు ఆదెరువుగా ఉన్న మార్కెట్కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పాలకవర్గానికి సూచించారు.
సీఎం కేసీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు: శ్వేత
తమపై నమ్మకంతో ఏఎంసీ చైర్పర్సన్గా, సభ్యులుగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, అజయ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, పాలకవర్గ బాధ్యులు అన్నారు. మార్కెటింగ్ శాఖలో ఖమ్మం మార్కెట్ను ప్రథమస్థానంలో నిలిపడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. జడ్పీ, డీసీసీబీ, సుడా చైర్మన్లు లింగాల కమల్రాజు, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, కేఎంసీ మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, బీఆర్ఎస్ నాయకులు, ఇతర ప్రముఖులు పగడాల నాగరాజు, చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, చెరుకు కృష్ణమూర్తి, వేములపల్లి వెంకటేశ్వరరావు, ప్రియాంక, గౌరి, జేడీఎం మల్లేశం, డీఏవో విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.