ఖమ్మం, డిసెంబర్ 17: ‘షర్మిలా.. నోరు అదుపులో ఉంచుకో.. నీ తండ్రి కంటే పెద్ద వయసున్న సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించం.. అనవసరంగా నోరు జారితే తగ్గిన బుద్ధి చెబుతాం..’ అంటూ వైఎస్ షర్మిలను హెచ్చరించారు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు. ‘నువ్వు ముమ్మాటికీ బీజేపీ వదిలిన బాణానివే’ అంటూ స్పష్టం చేశారు. తెలంగాణను సాధించి, ప్రపంచపటంలో ఈ రాష్ర్టానికి గుర్తింపు తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆయనపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే నర్సంపేట కంటే రెట్టింపు స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు బుద్ధి చెబుతాయని అన్నారు.
ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని, ప్రజల్లో బీఆర్ఎస్కు ఉన్న ఆదరణను ఓర్వలేక బీజేపీ పన్నుతున్న కుట్రలో షర్మిల ఓ భాగమని అన్నారు. తన స్థాయిని మరిచి మాట్లాడడం షర్మిలకు తగదన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గనులను కడపకు దోచుకెళ్లింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏజెంట్ కొండల్రావు ద్వారా బయ్యారం నుంచి కొత్తగూడెం వరకు ఉన్న ఐరన్ఓర్ను దోచుకున్నది నిజం కాదా? అంటూ నిలదీశారు.
ఎస్ఆర్ఎస్పీ కాలువల పేరుతో దోచుకున్నది మీరుగాక మరెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం కరువుతో అల్లాడిన పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనని తాతా మధు స్పష్టం చేశారు. అసలు షర్మిల వస్తే.. పాలేరులో అభివృద్ధి ఎక్కడ ఉందో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి చూపిస్తారని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నారు గనుకనే తెలంగాణలో అనేకమంది వచ్చి కొత్త పార్టీలు పెడుతున్నారని అన్నారు. అదే తన అన్న పాలనలో పులివెందులలో కొత్త పార్టీని ఎవరైనా పెట్టగలరా? అని ప్రశ్నించారు. ఈరోజున సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను వైఎస్ హయాంలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తన పార్టీ ఎజెండా ఏమిటో ప్రజలకు చెప్పాలని, ఏ లక్ష్యం కోసం తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు వివరించాలని షర్మిలను డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు సహించబోవని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మీ అన్న జగన్ పార్లమెంట్లో ధర్నా చేయలేదా?, తెలంగాణ ఏర్పడితే ఆంధ్రా నుంచి వచ్చే ప్రజలు పాస్పోర్టులు తెచ్చుకోవాలా? అంటూ మీ తండ్రి వైఎస్ఆర్ నంద్యాల సభలో అనలేదా అని ప్రశ్నించారు. అలాంటి చరిత్ర ఉన్న నీవు ఈ రోజున తెలంగాణ బిడ్డనంటూ తిరుగుతుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. నీవు అన్నట్టుగా మీ నాన్న నిజంగా పులేనని, కాకపోతే రక్తం తాగే పులి అని విమర్శించారు.
ముదిగొండలో తెలంగాణ బిడ్డలను కాల్చిచంపింది ఆ పులేనని, ఎన్కౌంటర్లు, చర్చల పేరుతో అనేకమంది తెలంగాణ బిడ్డలను పొట్టనపెట్టుకున్నది కూడా ఆ పులేనని ధ్వజమెత్తారు. ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ చేతిలో బైబిల్ పట్టుకొని బీజేపీకి ప్రచారం చేయడం షర్మిలకే చెల్లుతుందని విమర్శించారు. ఖమ్మం ఐరన్ ఓర్ను దోచుకెళ్లంది మీరుకాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు ఉప్పల వెంకటరమణ మాట్లాడుతూ.. తెలంగాణకు వైఎస్ఆర్ కుటుంబం ముందునుంచీ వ్యతిరేకమేనని అన్నారు.
ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేయాలని ఎన్నో కుట్రలు చేశారని గుర్తుచేశారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, రూరల్ జడ్పీటీసీ వరప్రసాద్, ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, గుండ్లపల్లి శేషు తదితరులు పాల్గొన్నారు.