కారేపల్లి: ప్రపంచం మనుగడ సాగించాలంటే అమెరికన్ సామ్రాజ్యవాదం అంతం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ అన్నారు. సీపీఐ(ఎం) సింగరేణి మండల కమిటీ సమావేశం గురువారం కొండబోయిన ఉమాపతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ అమెరికా – ఇజ్రాయిల్ అనేక అబద్దాలతో అన్యాయంగా ఇరాన్పై యుద్ధం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇతర దేశాల సంపదను కొల్లగొట్టడం కోసం అమెరికా సాగిస్తున్న అధిపత్య యుద్ధమని సత్యనారాయణ తెలిపారు.
గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ నిల్వలపై పెత్తనం కోసం అమెరికా – ఇజ్రాయిల్ భద్రత పేరుతో చేస్తున్న యుద్ధం భవిష్యత్తులో అనేక అనర్థాలకు, అనేక ఉగ్రవాద సంస్థలు పుట్టుకకు దారితీసి, ప్రపంచ శాంతికి విఘాతం కలుగనుందని ఆయన వెల్లడించారు. సామ్రాజ్యవాదం మనుగడలో ఉంటే ప్రపంచ భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందని, దోపిడీ పెరుగుతుందని సత్యనారాయణ పేర్కొన్నారు. సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా అలీన విధానంతో పోరాడాల్సిన భారతదేశం.. సామ్రాజ్యవాదులకు లొంగిపోయిందని మోడీని ఆయన దుయ్యబట్టారు.
పశ్చిమాసియాల యుద్ధం భారతదేశంతో పాటు ప్రపంచంపై అనేక ప్రభావాలు చూపిస్తున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం చలనం లేని విధంగా వ్యవహరిస్తున్నదని సత్యనారాయణ విమర్శించారు. యుద్ధం పర్యావసానంగా వంట గ్యాస్, పెట్రోల్, డీజీల్ వంటి నిత్యావసరాల కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిని నుండి దృష్టి మరల్చడానికి కులమత, ప్రాంతీయ విభేదాలు సృష్టించి.. విభజించు పాలించు విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల విస్మరించి, పేదలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన మండిపడ్డారు. కేంద్ర, రాష్ర్ట పాలకుల ప్రజా వ్యతిరేకంగా విధానాలపై ప్రజా ఉద్యమాలను నిర్మించాలని.. అదే కమ్యూనిస్టుల ప్రస్తుత కర్తవ్యమని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, వైరా డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా మారావు, నాయకులు తలారి దేవప్రకాష్, మండల కమిటీ సభ్యులు రేగళ్ల మంగయ్య, కేసగాని ఉపేందర్, యనమనగండ్ల రవి, షేక్ సైదులు తదితరులు పాల్గొన్నారు.