కూసుమంచి(ఖమ్మం రూరల్), ఫిబ్రవరి 16 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల నిబంధనలకు లోబడి అధికారులు సమర్థంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. రూరల్ మండలం పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోనే జిల్లాలోని ఏడు అసెంబ్లీ ని యోజకవర్గాల ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని నిర్ణయించిన కలెక్టర్, సీపీ సునీల్ దత్, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూం, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, పార్కింగ్ ఏర్పాట్లను జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు.
నిరంతర విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేక గదులు సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ నిర్వహణ, రిసెప్షన్ బాధ్యతలు నిర్వహించే సిబ్బందికి మండలాల్లో ఎంపీడీవోలు, ఎన్నికల బాధ్యులు తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఒకే గదిలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరచాలన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాటెట్లు, ఈవీఎంలను సీఆర్పీఎఫ్ రక్షణతో కౌంటింగ్ కేంద్రానికి తరలించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో కం ట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పరిశీలి స్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందుకోసం ఫ్లయిం గ్ స్కాడ్, సెక్టార్ అధికారులను ప్రత్యేకంగా నియమించాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ విషయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయి బందోబస్తు నిర్వహించాలని, ఈవీఎంల రవాణా, భద్రతపై నిఘా పెట్టాలన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, రాంబాబు, ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం ఆర్డీవోలు గణేశ్, అశోక్ చక్రవర్తి, మధు, ఎస్డీసీ రాజేశ్వరి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్యాంప్రసాద్, సంక్షేమాధికారి రాంగోపాల్రెడ్డి, డీపీవో హరికిషన్, డీఎల్సీవో గంటా శ్రీలత, జిల్లా అధికారులు శ్రీనివాసులు, జయప్రకాశ్, ఏసీపీ బస్వారెడ్డి, ఈఈ పుష్పలత, ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, రూరల్ తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.