బూర్గంపహాడ్, ఫిబ్రవరి 6 : పత్తి పంటను కొనుగోలు చేయడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు జిన్నింగ్ మిల్లు వద్ద మంగళవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురంతోపాటు ఇతర గ్రామాలకు చెందిన పత్తి రైతులు తమ పత్తిని జిన్నింగ్ మిల్లు వద్ద విక్రయించేందుకు వెళ్లగా.. దిగుమతి చేసుకోకుండా క్వింటాకు 10 కిలోల చొప్పున తారం తీస్తున్నారని ఆవేదనకు గురై ఆందోళనకు దిగారు.
పత్తిని ఎలాంటి తారం లేకుండా పత్తిని కొనుగోలు చేయాల్సిన సిబ్బంది తారం పేరుతో క్వింటాకు 10 కిలోలు తగ్గించి తమకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, తెచ్చిన పంటను కూడా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కాగా.. రైతులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో సుమారు కిలోమీటర్ మేర రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్యక్రమంలో మండలానికి చెందిన పత్తి రైతులు పాల్గొన్నారు.