ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 7 : భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లు జిల్లావ్యాప్తంగా 8 కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. నిరుడు అక్టోబర్ నుంచి పత్తిని బయ్యర్లు కొనుగోలు చేస్తున్నారు. తొలుత జిల్లావ్యాప్తంగా 10 జిన్నింగ్ మిల్లులను సీసీఐ అధికారులు గుర్తించారు. అయితే వాటిల్లో 8 కేంద్రాల వద్దనే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సీసీఐ అధికారులు పత్తికి గరిష్ఠంగా క్వింటాకు రూ.7,020 వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు ఎనిమిది కేంద్రాల ద్వారా రైతుల నుంచి సీసీఐ అధికారులు 4.14 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఖమ్మం ఏఎంసీ పరిధిలోని మొత్తం మూడు జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా గుర్తించినప్పటికీ ఒక జిన్నింగ్ మిల్లు (ఖమ్మం జీఆర్ఆర్ ఇండస్ట్రీ) వద్ద మాత్రమే కొనుగోలు జరుగుతోంది. ఈ కేంద్రం ద్వారా ఇప్పటి వరకూ 44.09 వేల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. మధిర వ్యవసాయ మార్కెట్ పరిధిలో మూడు జిన్నింగ్ మిల్లుల ద్వారా 1.19 లక్షల క్వింటాళ్లు, నేలకొండపల్లి మార్కెట్ పరిధిలోని ఒక జిన్నింగ్ మిల్లు కేంద్రం ద్వారా 71.60 వేల క్వింటాళ్లు, వైరా మార్కెట్ పరిధిలోని ఒక జిన్నింగ్ మిల్లు ద్వారా 30.49 వేల క్వింటాళ్లు, మద్దులపల్లి మార్కెట్ పరిధిలోని మరో రెండు జిన్నింగ్ మిల్లుల ద్వారా 1.49 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి మంచి డిమాండ్ ఉండడంతో ఒకవైపు ప్రైవేట్ వ్యాపారులు, మరో వైపు సీసీఐ అధికారులు పోటీ పడి పంటను కొనుగోలు చేస్తున్నారు. పంట చివరి నాటి వరకూ తాము పంటను కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు ప్రకటించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తాజా గణాంకాల ప్రకారం మద్దులపల్లి మార్కెట్ పరిధిలోని రెండు జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ అధికారులు రికార్డు స్థాయిలో పంటను కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా మార్కెటింగ్ శాఖ పరిధిలోని ఐదు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో భారత పత్తి సంస్థ కొనుగోళ్లను ప్రారంభించింది. అయితే అతి పెద్ద మార్కెట్లను అధిగమించి మరీ మద్దులపల్లి మార్కెట్ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో భారీగా క్రయవిక్రయాలు జరిగాయి. జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో 4 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరుగగా.. కేవలం మద్దులపల్లి మార్కెట్ పరిధిలోనే 1.50 లక్షల క్వింటాళ్ల పత్తి క్రయవిక్రయాలు జరగడం విశేషం. మద్దులపల్లి జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లు వద్ద లక్ష క్వింటాళ్ల పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. సకాలంలోనే పంట సొమ్ము చేతికి వస్తుండడంతో రైతులు కూడా పోటీపడి మరీ సీసీఐ కేంద్రాలకు పత్తిని తీసుకొస్తున్నారు.
సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 16 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. అయితే గుర్తించిన మిగిలిన కేంద్రాల్లో కూడా సీసీఐ కొనుగోళ్లు చేపడితే మరింత మంది రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఖమ్మం మార్కెట్ పరిధిలోని సీసీఐ కేంద్రం ద్వారా 1,773 మంది రైతులు తమ పంటను విక్రయించగా.. మధిర కేంద్రాల ద్వారా 4,661 మంది, వైరా కేంద్రాల ద్వారా 1,269 మంది, నేలకొండపల్లి కేంద్రాల ద్వారా 2,569 మంది, మద్దులపల్లి కేంద్రాల ద్వారా 6,328 మంది కలిపి మొత్తం 16,600 రైతులు తమ పత్తి పంటను విక్రయించారు.