ఖమ్మం, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మురికి కూపంలాంటి ఆ కాలువ ఖమ్మం నగరంలోని సుమారు పది డివిజన్ల ప్రజలకు రాత్రిపూట కంటిమీద కునుకులేకుండా చేసింది.. నగరవాసులు పందులు, దోమలతో సహవాసం చేసేవారు. ఎక్కడికక్కడ నిలిచిన మురుగు కారణంగా రోగాల బారిన పడేవారు. దుర్వాసనతో కాలువ పక్క నుంచి వెళ్తున్న వారి ముక్కుపుటాలు అదిరేవి. నాటి పాలకులు కాలువ మరమ్మతులకు పైసా విదల్చలేదు. అనారోగ్య సమస్యలకు కాలువ అని గుర్తించి కూడా ప్రజలకు విముక్తి కల్పించలేదు. ఆ కాలువే త్రీటౌన్ ప్రాంతంలోని గోళ్లపాడు కాలువ. స్థానికులు నేతలకు గోడు చెప్పుకున్నా గోడకు చెప్పినట్లుగా విని వదిలేశారు. కొన్ని పార్టీల నాయకులు 66 అడుగుల కాలువను ఇరువైపులా కొంతమేరకు ఆక్రమించారు. ఆయా స్థలాల్లో వ్యర్థాలు పేరుకుపోయి మురికి కూపాలుగా ఉండేవి. గోళ్లపాడు కాలువను ఆధునీకరించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కంకణం కట్టుకున్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ఒప్పించి రూ.100 కోట్ల నిధులతో గోళ్లపాడు కాలువను సుందరీకరించారు. అండర్లైన్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. పలుచోట్ల పార్క్లు నిర్మించారు. వాటిలో ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. పార్కుల్లో ప్రస్తుతం పిల్లలు, పెద్దలు ఉదయం సాయంత్రాలు ఆహ్లాదకరంగా గడుపుతున్నారు.
గోళ్లపాడు చానల్ గురించి 60 యేండ్లకు పైబడిన వారిని అడిగితే.. ఆ కాల్వ పూర్వ వైభవాన్ని, తాగునీటికి, సాగునీటికి ఆదెరువుగా ఉన్న సంగతులు పంచుకుంటారు. అదే కాల్వ గురించి.. 35యేండ్లు పైబడిన వారినడిగితే ఆ కాల్వ ఆక్రమణలు, ఎటుచూసిన వ్యర్థాలమయమై, మురికికూపంగా మారిన దైన్యస్థితిని వివరిస్తారు. ప్రస్తుత జనరేషన్లో ఈ కాల్వ గురించి అడిగితే.. ఓపెన్ జిమ్లు.. వాకింగ్ ట్రాక్లు.. పచ్చని పార్కులు.. ఏడాది నాటి గోసను, కళ్లముందే జరిగిన ఊహించని అభివృద్ధిని టకటకా చెప్పేస్తారు. ఖమ్మాన్ని పాలించిన కొన్ని పార్టీలు గోళ్లపాడు చానల్ పక్కన నివసించే వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని మనుషులుగా గుర్తించింది. స్వయంగా ముఖ్యమంత్రే వచ్చి స్థానికుల సమస్యలు తెలుసుకొని.. వారి ఏండ్లనాటి గోసను తీర్చేందుకు కోట్లాది రూపాయలు విడుదల చేసి, మురికి కూపం నుంచి వారిని విముక్తుల్ని చేశారు. నాడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ను గోళ్లపాడు వాసుల వద్దకు తీసుకెళ్తే.. నేడు మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్కుమార్ ప్రభుత్వం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసి, ఖమ్మం త్రీటౌన్ ప్రాంత దశాబ్దాల దారిద్య్రానికి తెరవేశారు. మొత్తానికి గోళ్లపాడు చానల్ రూపురేఖల్ని మార్చారు. ఇదే మంత్రి అజయ్కుమార్ అభివృద్ధి మంత్రం.. జనం మెచ్చే జీవన సూత్రం.
ఇదీ గోళ్లపాడు చానల్ చరిత్ర..
ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలోని గోళ్లపాడు చానల్కు సుదీర్ఘ నేపథ్యం ఉంది. సుమారు వెయ్యేండ్ల క్రితం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి సమీపం నుంచి మున్నేరు ద్వారా ప్రస్తుత నగరపాలకసంస్థ పరిధిలోని ధంసలాపురం వరకు దాదాపు 11 కిలో మీటర్ల పొడవున ఈ కాలువ ఉన్నది. సాగునీటి సరఫరా నిమిత్తం గోళ్లపాడు చానల్ను తవ్వించారు. దాదాపు 66 అడుగుల వెడల్పుతో శతాబ్దాల తరబడి ఖమ్మం, పరిసర ప్రాంతాలకు సాగునీరు అందించిన కాలువ పలు పార్టీల 60 ఏళ్ల పాలనలో మురికి నీటి కూపంగా మారింది. కాలువకు ఇరువైపులా వెలసిన అక్రమ కట్టడాలతో పూర్తిగా కుచించుకుపోయింది. ఎటుచూసినా వ్యర్థాలే దర్శనమిచ్చేవి. కాలం మారుతున్న కొద్దీ.. జనాభా పెరుగుతున్న కొద్దీ రూరల్ మండలం నుంచి వస్తున్న కాలువ ఆనవాళ్లు కనబడకుండా పోయాయి. ఖమ్మం సారథినగర్ ప్రాంతంలోని కలెక్టర్ బంగ్లా వెనుక నుంచి వస్తున్న మురుగు నీటి కాలువను మాత్రమే గోళ్లపాడు చానల్గా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం పరిగణిస్తున్నది. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు పేద ప్రజలతో కాలువ పక్కనే గుడిసెలు వేయించి వారి రాజకీయ అవసరాలను తీర్చుకున్నారు.
సుందరంగా చానల్
ఇప్పటికే గోళ్లపాడు కాలువ అంతర్భాగంలో పెద్ద, పెద్ద పైప్లైన్లు అమర్చి మురికినీరును నగరానికి దూరంగా తరలిస్తున్నారు. దీని కోసం అంతర్భాగంలో పైప్లైన్లను నిర్మించారు. దానిపైన వరద నీరు ప్రవహించడానికి కూడా ప్రత్యేక పైప్లైన్లు కూడా నిర్మించారు. దీంతో వరద ఇబ్బందులు తొలగిపోయాయి. ఇంతటితో ఆగకుండా కాలువ పొడవునా పార్క్లు ఏర్పాటు చేశారు. వాటిలో వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఒకనాడు మురికి కూపంగా ఉన్న కాలువ ఈ రోజున సుందరంగా మారింది.
పేదలకు పట్టాలిచ్చిన ఘనత బీఆర్ఎస్దే..
గోళ్లపాడు చానల్ విస్తరణ పనుల్లో ఇండ్లు కోల్పోయిన వారికి వైరా రోడ్డు సమీపంలో ఇండ్ల స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. సుమారు 630 మంది పేద ప్రజలకు ఇంటి స్థలాలను ఇచ్చారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక కృషి కారణంగా పేదలకు ఇండ్ల స్థలాలు దక్కాయి. ఆ స్థలాల్లో మిషన్ భగీరథ మంచినీటి పైప్లైన్లు, పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.
ఆచరణలో సీఎం కేసీఆర్ హామీ..
గోళ్లపాడు చానల్ పరిసర ప్రజల దుస్థితిని తెలుసుకున్న అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దాని స్వరూపాన్ని మార్చాలనుకున్నారు. 2016లో జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్కు సమస్యను విన్నవించగా ఆయన వాడలన్నింటినీ సందర్శించారు. ఆ సందర్భంలో గోళ్లపాడు చానల్కు ఇరువైపులా చిన్నచిన్న ఇండ్లను నిర్మించుకుని జీవిస్తున్న పేదల స్థితిగతులను చూసి చలించిపోయారు. ‘అందరికీ ప్రత్యామ్నాయం చూపిస్తాం. ఆరోగ్యకరమైన వాతావరణంలోకి వెళతారా?’ అని స్థానిక ప్రజలను అడిగారు కేసీఆర్. సీఎం అడిగిన వెంటనే అందరూ అంగీకారం తెలపడంతో నిధులు మంజూరు చేస్తానని, తక్షణమే గోళ్లపాడు చానల్ ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన నగరపాలక సంస్థ, పబ్లిక్హెల్త్ అధికారులు గోళ్లపాడు చానల్ ఆధునీకరణ పనులకు డీపీఆర్ రూపొందించగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నగరాభివృద్ధి నిమిత్తం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమంత్రి ఖమ్మం నగరానికి రూ.100కోట్ల నిధులను కేటాయించారు. వాటిల్లో నుంచి గోళ్లపాడు చానల్కు రూ.56 కోట్లను మంజూరు చేశారు. కాగా.. పూర్తిస్థాయి ప్రక్షాళనకు ఆ నిధులు సరిపోవని భావించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మరో రూ.14కోట్లు అదనంగా మంజూరు చేయించారు. మొత్తం రూ.100కోట్లతో గోళ్లపాడు చానల్ పనులు పూర్తయ్యాయి. మంత్రి హోదాలో పువ్వాడ అజయ్కుమార్ నిత్యం సమీక్షలు చేయడం, పనులను ఎప్పటికప్పుడు పరిశీలించడం, అధికారులకు సలహాలు ఇవ్వడంతో పనులు నిర్దేశించిన సమయంలోనే పూర్తయ్యాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
త్రీటౌన్ ప్రజల గోస తీరింది
త్రీటౌన్ ప్రాంత ప్రజలకు ప్రధాన సమస్య గోళ్లపాడు మురికి కాల్వ. దీని విషయంలో ఎన్నో పార్టీలు పేదలను మభ్యపెట్టి స్వప్రయోజనాల కోసం మోసం చేశారు. కానీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం గోళ్లపాడు మురికి కాల్వను ఆధునీకరించేందుకు రూ.100కోట్ల నిధులను మంజూరు చేసింది. పనులు పూర్తి కావడంతో దోమల బెడద తగ్గడంతోపాటు మురుగు వాసన పోయింది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో నగరంలోని అన్ని ప్రాంతాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాయి.
– గుండాల కృష్ణ, స్థానికుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
పువ్వాడ కృషితో కంపు పోయింది
గతంలో గోళ్లపాడు చానల్లో మురుగుతోపాటు దోమలు, పందులు సంచారం చేయడంతో నానా అవస్థలు పడ్డాం. మా ప్రాంతంలో ఏళ్లతరబడి ఉన్న కంపు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషితో పూర్తిగా తొలగిపోయింది. అప్పటి గోళ్లపాడు చానల్కు.. ఇప్పటికీ చూస్తుంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అన్ని హంగులతో పార్కులు, వాకింగ్ ట్రాక్లతో చూడచక్కగా తయారు చేశారు. సీఎం కేసీఆర్ పుణ్యమా అని సంతోషంగా ఉంటున్నాం. సీఎం కేసీఆర్కు, మంత్రి అజయ్కు రుణపడి ఉంటాం.
– షేక్ సైదాబీ, ఖమ్మం త్రీటౌన్
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా…
ఖమ్మం త్రీటౌన్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గోళ్లపాడు చానల్ మురికి కాలువతో దాదాపు చాలా మంది ప్రజలు నకరం అనుభవించారు. వారి స్థితిని తలచుకుంటే చాలా బాధ వేసేది. ఇప్పుడు అదే కాల్వపై పార్కులో పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో త్రీటౌన్ సమస్యలను పరిష్కరించాను. ప్రస్తుత ఎన్నికల్లో నగర ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా.
– పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి