భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : చీకటైతే వీధి లైట్లు వెలగవు. సెంట్రల్ లైటింగ్ ఉన్నా మిణుకు మిణుకులే. తాగునీటికి రోజూ తండ్లాటే. నీళ్ల కోసం గల్లీల్లో మహిళల పాట్లు. చెత్తా చెదారంతో నిండిపోయే వార్డులు. మురుగు కంపు కొట్టే కాలువలు. వానొచ్చిందంటే జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్, గొల్లగూడెం వార్డులు నీటిలో మునగాల్సిందే. పెట్టేబేడా సర్దుకొని రాత్రుళ్లు ఇళ్లు ఖాళీ చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇక రామవరం ఎస్సీబీ నగర్ పరిస్థితి మరింత దారుణం. మెస్తరు వర్షానికే వందల ఇళ్ల్లు నీట మునిగే పరిస్థితి. కొత్తగూడెం అండర్ బ్రిడ్జి కింద నీళ్లు నిలిచి గంటలకొద్దీ రవాణా సౌకర్యానికి అంతరాయం. ప్రజలు ఛీదరించుకున్నా అటు అధికారులు, ఇటు పాలకులు మొఖం చాటేసుకుని వెళ్లే పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నీ చాంతాడంత. ఉమ్మడి పాలకుల హయాంలో ప్రజలు పడిన బాధలు వర్ణనాతీతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాయకులు మారడంతోపాటు ప్రజల తలరాతలు మారాయి.
పాత రోజులకు చరమగీతం.. అభివృద్ధే కొలమానం..
ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాల అజెండాతో ప్రజల ముందుకొచ్చి పాత రోజులకు చరమగీతం పలికారు. అభివృద్ధే కొలమానంగా పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువులను అభివృద్ధి చేసి జలకళ సంతరించుకునేలా చేశారు. భూగర్భ జలాలు పెరిగి వానకాలంతోపాటు వేసవిలోనూ చెరువులు నిండు కుండలా కనిపించే రోజులొచ్చాయి. నెర్రెలు బారిన నేలలు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. మట్టిదారులన్నీ సీసీ రోడ్లుగా మార్చి, పూడుకుపోయిన మురికి కాలువలకు చక్కటి రూపం తీసుకొచ్చారు. వానొస్తే కొత్తగూడెం పట్టణంలో చుక్కనీరు రోడ్లపై నిలవకుండా చేశారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు హైదరాబాద్ తరహాలో సెంట్రల్ లైటింగ్, పచ్చందాలతో దారులన్నీ మురిసిపోతున్నాయి. డివైడర్ల మధ్యలో మొక్కలు కొత్త అందాలు తెచ్చిపెట్టాయి. ఇక వంద పడకల ఆస్పత్రి కాస్త 350 పడకల ఆస్పత్రిగా మారడంతోపాటు మాతా, శిశు కేంద్రంగా వంద పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారు. దీంతోపాటు మెడికల్, నర్సింగ్ కాలేజీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రాములోరి ఇలాకా ప్రగతి పథంలో పయనించడానికి కారణం సీఎం కేసీఆర్ పాలనే అని చెప్పొచ్చు.
అప్పుడు డివిజన్ కేంద్రం.. ఇప్పుడు జిల్లా కేంద్రం
డివిజన్ కేంద్రంగా ఉన్న కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. కొత్త జిల్లాల ఆవిర్భావంతో జిల్లా కేంద్రంగా అవతరించింది. 2017లో కొత్త జిల్లాగా ఏర్పాటు కాగా.. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ప్రస్తుతం కొత్త భవనాలు వచ్చేశాయి. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణంతో 56 శాఖల అధికారులు ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర ఉండాలని, ప్రజలకు సుపరిపాలన అందాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను రూ.56.50 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీంతో మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్, డీఆర్వోలకు క్వార్టర్లు కూడా అక్కడే నిర్మించారు.
మెడికల్ కాలేజీతో చేరువైన సర్కారు వైద్యం
కేంద్ర ప్రభుత్వం కాదన్నా సీఎం కేసీఆర్ కొత్తగూడెంకు మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. దీంతో ఏజెన్సీకి మెరుగైన వైద్య సేవలు అందించడంలో సఫలమయ్యారనే చెప్పాలి. రూ.500 కోట్ల నిధులు మంజూరు చేసి పాల్వంచ కేఎస్ఎం వద్ద మెడికల్ కళాశాలను ప్రారంభించారు. 150 మంది వైద్య విద్యార్థులు ఇక్కడ సీట్లు పొందే అవకాశం దొరికింది. దీంతోపాటు వంద పడకల మాతా, శిశు కేంద్రం, జిల్లా జనరల్ ఆస్పత్రి అందుబాటులోకి రావడంతో మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు చేరువయ్యాయి. ప్రజలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. మాతా, శిశు మరణాలు జరగకుండా ఎంసీహెచ్ ఆస్పత్రిలో టిఫా స్కానింగ్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను ఇటీవల కాబోయే తల్లులకు అందజేశారు. రూ.4 కోట్ల వ్యయంతో రేడియాలజీ హబ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సీటీ స్కాన్, మమోగ్రామ్, ఎక్స్రే, టుడీ ఎకో పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు పడకలతో డయాలసిస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. వంద మంది పేషెంట్ల వరకు ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటున్నారు.
పచ్చందాలతో కొత్తకళ
పల్లె ప్రగతి ద్వారా రహదారుల రూపురేఖలు మారిపోయాయి. పచ్చందాలతో రహదారులు కొత్త శోభను సంతరించుకున్నాయి. నియోజకవర్గ పరిధిలోని సుజాతనగర్ మండలం నుంచి చుంచుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ మండలం జగన్నాథపురం వరకు రహదారులు పచ్చదనాన్ని పులుముకున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో కొత్తగూడెం-పాల్వంచ పట్టణాలకు డివైడర్లను ఏర్పాటు చేసి మధ్యలో పూల మొక్కలను నాటారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో రెండు పట్టణాలకు కొత్త శోభ వచ్చింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రెండు పట్టణాలను హైదరాబాద్, సికింద్రాబాద్ తరహాలో అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. కిన్నెరసాని తాగునీటి పథకానికి రూ.44 కోట్లు మున్సిపల్ డెవలప్మెంట్ నిధులతో కొత్త పైపులైన్ ఏర్పాటు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.13 కోట్లతో వార్డుల్లో సీసీ రోడ్లతోపాటు రాజీవ్ పార్క్ అభివృద్ధి, ఫుట్బాల్, బాస్కెట్బాల్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వనమా అభ్యర్థన మేరకు ఇటీవల సీఎం కేసీఆర్ కొత్తగూడెంలో నిర్వహించిన సభలో మున్సిపాలిటీకి రూ.115 కోట్లు మంజూరు చేశారు. ఎన్నో ఏళ్లుగా వరద వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడుతున్న ముర్రేడు వాగు బాధితులకు శాశ్వత పరిష్కారం చూపించారు. ఏకంగా రూ.34 కోట్ల నిధులను మంజూరు చేసి ముర్రేడు వాగు పరీవాహక ప్రాంతవాసులకు వరదతో ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నారు. ఏకంగా కొత్తగూడెం నియోజకవర్గంలో రూ.3000 కోట్ల నిధులను మంజూరు చేసి రోడ్లు, సీసీ డ్రెయిన్లు, తాగునీటి సౌకర్యానికి పరిష్కారం చూపుతున్నారు.
ఆసరా పింఛన్లు
ఇతర అభివృద్ధి నిధులు..