ఇల్లెందు రూరల్, జనవరి 3: గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనున్నది. అద్దంలాంటి రోడ్లతో పల్లెలు కళకళలాడనున్నాయి. రవాణా, ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. మారుమూల పల్లెల నుంచి నియోజకవర్గ కేంద్రమైన ఇల్లెందుకు సజావుగా రాకపోకలు సాగించేందుకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఐటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే హరిప్రియానాయక్ కృషితో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2.78 కోట్ల నిధులతో త్వరలోనే ఈ రహదారుల నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. ఇల్లెందు మండలంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నూతన బీటీ రోడ్లు ఏర్పాటయ్యాయి. తాజాగా మరికొన్ని గ్రామాల్లో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అన్నారం, వేపల్లగడ్డ, మర్రిగూడెం పంచాయతీలకు సుమారు రూ.1.06 కోట్ల డీఎంఎఫ్ నిధులతో గతంలో రహదారి నిర్మించారు. సుదిమళ్ల పంచాయతీలో సుమారు రూ.6.05 కోట్లతో తొమ్మిది కిలో మీటర్ల మేర రహదారిని ఏర్పాటు చేశారు. ధర్మాపురం, పూబెల్లి, సుదిమళ్లకు రూ.648.50 లక్షలతో రహదారులను నిర్మించారు. పోచారంతండా నుంచి పోలారం వరకు రూ.190 లక్షల డీఎంఎఫ్ నిధులతో రోడ్లను వేశారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో పలు గ్రామాలకు నూతన రోడ్లు వేసేలా టెండర్లు పిలిచేందుకు ఆర్అండ్బీ అధికారులు సమాయత్తమవుతున్నారు.
ఇందిరానగర్ నుంచి ఆజాద్నగర్ వరకు..
మండలంలోని ఇందిరానగర్ నుంచి ఆజాద్నగర్ వరకు ఇప్పటి వరకూ బీటీ రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాలంటే గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇల్లెందు ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఇందిరానగర్ – ఆజాద్నగర్ వరకు 1.5 కిలోమీటర్ల మేర రూ. 1.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మించనున్నది.
అమర్సింగ్ తండా నుంచి పందిరి మింగ్యాతండా వరకు..
మండలంలోని అమర్సింగ్ తండా నుంచి పందిరిమింగ్యా తండా వరకు నూతన బీటీ రోడ్డు ఏర్పాటు కానున్నది. రూ.కోటి వ్యయంతో సుమారు కిలోమీటరు మేర నిర్మించనున్న ఈ బీటీ రోడ్డును అధికారులు త్వరలోనే ప్రారంభించనున్నారు.
మాణిక్యారం నుంచి దేశియాతండా వరకు..
మాణిక్యారం నుంచి దేశియాతండా వరకు నూతన బీటీ రోడ్డు ఏర్పాటు కానున్నది. సుమారు 0.80 పొడవైన ఈ రహదారిని రూ.28 లక్షల నిధులతో నిర్మించనున్నారు.
కొమరారం నుంచి లక్ష్మీనారాయణ తండా వరకు..
కొమరారం గ్రామం నుంచి లక్ష్మీనారాయణ తండా వరకు సుమారు కిలోమీటరు మేర రూ.30 లక్షలతో బీటీ రోడ్డు ఏర్పాటు కానున్నది.
నరకయాతన పడేవాళ్లం..
మండల కేంద్రమైన ఇల్లెందుకు రావాలంటే రోడ్డు సరిగ్గా లేదు. ఆ రోడ్డుపై రాకపోకలు సాగించాలంటే నరకయాతన పడేవాళ్లం. ఏదైనా అత్యవసర పని మీద ఇల్లెందుకు వెళ్లాలంటే కంకర తేలిన ఆ రోడ్లపై వెళ్లిరాలేక మహా తిప్పలు పడేవాళ్లం. మా కష్టాలను, ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే హరిప్రియ.. ఈ మార్గంలో నూతన బీటీ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి మా ప్రయాణ కష్టాలు తొలగించారు.
–బానోత్ చావలి, దేశియాతండా, ఇల్లెందు మండలం
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం..
నూతన బీటీ రోడ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. పనులకు టెండర్లను ఆహ్వానిస్తున్నాం. టెండర్లు పూర్తికాగానే పనులు మొదలవుతాయి. టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు రూ.17.56 కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు పూర్తి చేసి ఆయా గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
–సయ్యద్ సలార్, ఐటీడీఏ ఏఈ, ఇల్లెందు