ఖమ్మం రూరల్, అక్టోబర్ 27: ‘సీఎం కేసీఆర్ తీన్మార్, ఎమ్మెల్యే కందాళ దోబార్’ అనే నినాదాలు మార్మోగాయి. కూసుమంచి మండలం జీళ్లచెరువులో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు అపూర్వ ఆదరణ లభించింది. సభకు నియోజకవర్గం వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ జన సందోహాన్ని చూసి సీఎం కేసీఆర్ కూడా ‘ఇది పాలేరు నియోజకవర్గ సభలా కాకుండా జిల్లా సభలా ఉందని, అంత పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారని అన్నారు. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగానికి పాలేరు నియోజకవర్గ ప్రజలు ఫిదా అయిపోయాయి. సభ అద్భుతంగా విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా జోష్ పెరిగింది. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రేయింబవళ్లూ శ్రమించి జన ప్రభంజనం సృష్టించారు. కాగా, సరిగ్గా ఉదయం 11 గంటల నుంచి సభకు ప్రజలు రావడం ప్రారంభించారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు వాహనాల తాకిడి కొనసాగింది. సభకు వేలాదిమందితో రావడంతో ఎమ్మెల్యే కందాళను సీఎం కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. తక్కువ మాట్లాడడం, ఎక్కువ పని చేయడం ఎమ్మెల్మే కందాళ నైజమంటూ ప్రశంసించారు. అదే క్రమంలో మరోసారి కూడా కందాళకు భారీ మెజార్టీ అందించాలని సీఎం పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ప్రజలు నిలబడి తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.
సీఎం కేసీఆర్ కేవలం 22 నిమిషాలు మాత్రమే మాట్టాడినప్పటికీ ఆయన ప్రసంగమంతా సభకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎంతో ఆలోచింపజేసింది. స్వరాష్ట సాధనకు ముందు పాలేరు నియోజకవర్గం ఎలా ఉండేదో, తెలంగాన వచ్చాక ఎంతటి అభివృద్ధి సాధించిందో వేదిక నుంచి సీఎం కేసీఆర్ ప్రజలను అడిగారు. దానికి వారంతా ‘బీఆర్ఎస్తోనే ఇంతటి అభివృద్ధి..’ అంటూ బుదులిచ్చారు. నాటి పాలేరు దయనీయ స్థితిని సీఎం కేసీఆర్ ప్రసంగంలో ప్రజలు మరోసారి గుర్తుచేసుకున్నా రు. పాలమూరును తలపించిన పాలేరు నేడు అకుపచ్చ పాలేరు అయిందని, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే యావత్ ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని, హుజూరాబాద్ తరహాలోనే నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు అందిస్తామని భరోసా ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ చప్పట్లతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ చేసిన మేలు గురించి, ప్రస్తుతం ఆయన ప్రవర్తిస్తున్న తీరు గురించి సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు వివరించారు.
కూసుమంచి రూరల్/ తిరుమలాయపాలెం, అక్టోబర్ 27: సీఎం హాజరైన పాలేరు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ముందుగా ఆయా గ్రామాల్లో గులాబీ జెండాలతో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. అంతేస్థాయిలో అనేక వాహనాల్లో బయలుదేరి సభా స్థలికి చేరుకున్నారు.
సీఎం కేసీఆర్ అంటే మా కుటుంబానికి ప్రత్యక్ష దైవం. మా అమ్మకు ఆసరా పింఛన్, నాకు దివ్యాంగుల పింఛన్ ఇస్తూ మా కుటుంబానికి జీవనాధారమయ్యారు. అలాంటి గొప్ప నాయకుడిని చూసేందుకు, ఆయనకు మా కుటుంబం తరఫున మద్దతు తెలిపేందుకు ఇక్కడికి వచ్చా. ఇవ్వాళ్ల సీఎం కేసీఆర్ పాలేరు వస్తున్నారని టీవీలో చూశాను. నా మూడు చక్రాల బండిమీద ఉదయాన్నే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. ఐదు గంటలపాటు వేచి చూశాను. సీఎం కేసీఆర్ రాగానే ఆయనను చూశాను. ఆయన మరోసారి సీఎం అయితేనే నాలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుంది. ఎవరూ పట్టించుకోకున్నా నాలాంటి దివ్యాంగులకు ధైర్యం ఇచ్చారు.
కేసీఆర్ అంటే నాకు ఎంతో అభిమానం. ఈయనకంటే ముందు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ వాళ్లు ఓట్లు వచ్చినప్పడే మాటలు చెప్పేవాళ్లు. ఆ తరువాత మరెప్పుడూ కన్పించేవాళ్లు కాదు. కానీ కేసీఆర్ సీఎం అయిన తరువాత పరిస్థితి ఎంతో మారిపోయింది. మా పొలాలకు భక్తరామదాసు నీళ్లు అందుతున్నాయి. నెర్రెలు వారిన మా పంట భూములన్నీ ఇప్పుడు పచ్చగా కళకళలాడుతున్నాయి. రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నారు. నాకున్న రెండెకరాలకు ఏటా రూ.20 వేలు ఇస్తున్నారు. అందుకే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు ఎంతో ధైర్యంగా ఉంటుంది.
మా సీఎం కేసీఆర్ ఎంతో ధర్మాత్ముడు. నా కొడుకసంటోండు. ఆయనను కండ్లారా చూద్దామనే ఇక్కడికి వచ్చా. ఆయనను చూద్దామని ఎనో ఏండ్లుగా అనుకుంటున్నా. ఎ ప్పుడూ అవకాశం రాలేదు. ఇప్పుడు జీళ్లచెరువుకు వస్తున్నాడని తెలిసింది. అందుకే పొద్దున్నే బయలుదేరి వచ్చా. ఆయనను ఇప్పటిదాకా టీవీల్లోనే చూసేదాన్ని. ఇవ్వాళ నేరుగా చూశాను. అప్పటోళ్లు రూ.200 పింఛన్ ఇచ్చెటోళ్లు. కేసీఆర్ వచ్చిన రూ. 2016 పింఛన్ ఇస్తుండు. మళ్లీ గెలిస్తే దానిని 5వేల దాకా పెంచుతాడంట. మా లాంటి వృద్ధులకు ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పటికే మా ఊరిని చాలా బాగు చేసిండు.
నాకు నెలకు రూ.4 వేల దివ్యాంగుల పింఛన్ ఇస్తున్న సీఎం కేసీఆర్.. నాకు, నా కుటుంబానికి ఆదెరువు అయ్యారు. మా ఊరిని ఎంతో బాగు చేశారు. దాదాపుగా అందరికీ ఏదో ఒక ప్రభుత్వ పథకాన్ని అందించారు. దీంతో సీఎం కేసీఆర్ అంటే మా ఊరి వాళ్లకు ఎంతో అభిమానం. గౌరవం. అందుకే ఇవాళ ఇక్కడి సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారని తెలిసింది. దీంతో మా ఊరి వాళ్లం అంతా కలిసి ఈ సభకు వచ్చాం. మా ఊరు ఇంత గొప్పగా అభివృద్ధి కావడానికి కారణమైన సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డికి మేమంతా మద్దతుగా ఉంటాం. సీఎం కేసీఆర్కు మద్దతుగా నేనే స్వచ్ఛందగా నా మూడు చక్రాల బండి మీద ఈ మీటింగ్కు వచ్చాను. చాలా ప్రసంగం ఎంతో అద్భుతంగా ఉంది.
మా ఊరితోపాటు పాలేరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇవాళ పండుగ లాగా కనబడుతోంది. మూడు రోజు ల నుంచి మా ఊరి వాళ్లం అందరమూ అనుకున్నాం. ఎలాగైనా సీఎం కేసీఆర్ను చూడాలి అని. ఎంత పని ఉన్నా తప్పకుండా మీటింగ్కు రావాలనుకున్నాం. అందుకే చిన్న పిల్లవాడైన నా కొడుకును కూడా వెంట తసుకొని ఇక్కడికి వచ్చా ను. వాడు పెద్దవాడు అయ్యాక తప్పకుండా చెబుతాను. చిన్నప్పుడే నీకు కేసీఆర్ తాతయ్యను చూపించానని. మా ఊరి నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం కష్టమే. కానీ, సీఎం కేసీఆర్ను చూసి వెళ్లాలన్న కాంక్షతో ఇంత దూరం వచ్చాం. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అంటే మా ఊరిలో చిన్న బడికి పోయే పిల్లలకు కూడా తెలుసు.
మా తిరుమలాయపాలెం మండలంలో 70 ఏళ్లుగా సాగునీటి వసతిలేక ఎంతో గోసపడ్డాం. నా చిన్నప్పుడు వరి అన్నం దొరికేదికాదు. ఏడు కండేల లోతు బావులు తీసినా నీరు లేదు. సీఎం కేసీఆర్ వచ్చినంకనే పాలేరు చెరువు నుంచి నీళ్లు ఇచ్చిండు. చెరువులకు నీళ్లు వచ్చినై. రెండు సార్లు వరి పంట పండిస్తున్నం. సర్కారు అంతా మంచే చేస్తున్నది.
రైతులను అన్ని విధాలా ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వ మే. అన్నదాతల కోసం సాగునీటి వసతి, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు వంటి పథకాలను ఇంతకుమునుపు ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదు. గతంలో పండించిన పంట అమ్ముకోవాలంటే ఖమ్మం మార్కెట్కు పోవాల్సి వచ్చేది. ఇప్పుడు మా ఊర్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రం పెట్టి ధాన్యాన్ని కొంటున్నది. కేసీఆర్ సర్కారును మళ్లీ గెలిపించుకోకపోతే రైతులకు మళ్లీ కష్టాలు తప్పవు.
ఈ సారి కూడా కేసీఆర్ ప్రభుత్వానికే మా ఓట్లన్నీ వేస్తాం. సీఎం కేసీఆర్ అనేక పథకాలు తెచ్చి మా లాంటి పేదలను, వృ ద్ధులను ఆదుకుంటున్నడు. అందుకే ఈసారి మా ఓట్ల న్నీ కారు గుర్తుకే. ఆయన తన ప్రాణం అడ్డుపెట్టి తెలంగాణ తెచ్చిండు. అంతటితో ఆగకుండా రూ.200 ఉన్న పింఛన్ను రూ.2016కు పెంచి ఇస్తుండు. ఆయన మళ్లీ గెలిస్తే పేదోళ్లకు బీమా, సన్నబియ్యం, మహిళలకు రూ.3వేలు అందిస్తామని చెబుతున్నారు. ఆయన చెబితే తప్పకుండా చేస్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఎంతో బాగుంది. అన్ని వర్గాలకు మేలు జరిగింది. అందుకని మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. పేదలకు బీమా, సన్నబియ్యం, రూ.400కే గ్యాస్, మహిళలకు రూ.3,000 ఆర్థిక సాయం, పింఛన్ల పెంపు వంటి ఆలోచనలు ఎంతో గొప్పవి. అందుకే కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. అలా అయితేనే మన బతుకులు బాగుంటాయి.