భద్రాచలం, నవంబర్ 10: ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. మరింత అభివృద్ధి కొనసాగాలన్నా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. పట్టణంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. పలు కాలనీల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు హాజరయ్యారు. ముదిరాజ్ బజార్లో కొల్లు రవి నివాసంలో మాట్లాడుతూ.. 50 ఏళ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని పదేళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని గుర్తుచేశారు.
అలాంటి వ్యక్తి మళ్లీ సీఎం అయితే రాష్ట్ర భవిష్యత్ మరింత అద్భుతంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని సూచించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షితమైన గోదావరి జలాలను అందించిన ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. వైద్యుడిగా ఎంతోకాలంగా ప్రజలకు సేవలందిస్తున్న తనను ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి రమేశ్ గౌడ్, ఎండీ నవాబ్, కొల్లు రవి, ఆర్టీఓ రవి, మంగిపూడి వీరభద్రరావు, కొల్లు సునీత, సిరి తదితరులు పాల్గొన్నారు.