ఖమ్మం సిటీ, మే 28: ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం పట్ల నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు రగిలిపోతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి రూపొందించిన ‘రాకేశ్రెడ్డి ఈ-క్లాస్రూం’ యాప్ను ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, పలువురు నాయకులతో కలిసి అజయ్కుమార్ గురువారం ప్రారంభించారు.
ఖమ్మం ఐఎంఏ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీలిచ్చిన కాంగ్రెస్.. పాలనాపగ్గాలు చేపట్టి రెండున్నరేండ్లు దాటినా ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కనీసం నోటిఫికేషన్లు కూడా ప్రకటించడం లేదని ధ్వజమెత్తారు. పైగా, గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలనే నిస్సిగ్గుగా తమవంటూ చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మభ్యపెట్టారని విమర్శించారు. కానీ, ఇప్పుడున్న ‘జెన్ జడ్’ తలచుకుంటే కేంద్ర, రాష్ట్ర పాలకులకు అధోగతి తప్పదని హెచ్చరించారు.
అడ్డిమారి గుడ్డి దెబ్బలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. నిరుద్యోగ యువతను నిండా ముంచిందని ఆరోపించారు. కొన్ని ప్రేరేపిత యూట్యూబ్ల కారణంగా విద్యార్థులు అదే నిజమని భ్రమించి కాంగ్రెస్కు ఓట్లు వేశారని అన్నారు. నమ్మించి నట్టేట ముంచడమే కాంగ్రెస్ స్వభావమని అన్నారు. కనీసం నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్రెడ్డి ఉన్నత విద్యావంతుడని, నిరుద్యోగ యువత బాధలు తెలిసినవాడని అన్నారు. కాబట్టి ఆయన సారథ్యంలో రూపొందించిన ‘ఈ-క్లాస్రూం యాప్’ను సద్వినియోగం చేసుకుంటూ నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
తాము రూపొందించిన ‘రాకేశ్రెడ్డి ఈ-క్లాస్రూం’ యాప్ ఉచితమని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికోసం తనవంతు సహకారం ఉండాలన్న ఆకాంక్షతోనే ఈ యాప్ను రూపొందించినట్లు చెప్పారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని, ఫీజులు కట్టలేని, హాస్టళ్ల ఫీజులు భరించలేని నిరుపేద విద్యార్థులందరూ ఉచితంగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బొల్లం మల్లయ్యయాదవ్, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్కుమార్, బత్తుల మురళి, నాగండ్ల కోటేశ్వరరావు, అజ్మీరా వీరూనాయక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.