చింతకాని, ఏప్రిల్ 5 : చింతకాని మండలంలో మక్క రైతులు గగ్గోలు పెడుతున్నారు. తగినన్ని కొనుగోలు కేంద్రాల్లేక, పంటను అమ్ముకునే మార్గం కన్పించక ఆర్తనాదాలు చేస్తున్నారు. మండలంలో గతంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ఒకే ఒక్క కొనుగోలు కేంద్రాన్ని తెరిచిందని, అందులో కూడా సరిగా కొనుగోళ్లు జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందుకు కూడా ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోందని అంటున్నారు. రైతులు ఎంతో కష్టపడి అధిక మొత్తంలో పంట పండించినా.. ఎకరానికి 26 క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొంటామంటూ తమను ఇబ్బందులపాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి అధికంగా వస్తోందని, అందుకును అనుగుణంగా ఎకరానికి 40 క్వింటాళ్ల వరకూ కొనుగోలు చేయాలని, అది కూడా రూ.2,600 చొప్పున మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ఈ యాసంగిలో రైతులు మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. ఒక్క చింతకాని మండలంలోనే సుమారు 30 వేల ఎకరాల్లో మక్కలు పండించారు. ఇందులో 10.80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. దీంతో రైతులందరూ తమ పంటను కల్లాల్లో ఆరబోసి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. కానీ ప్రభుత్వం ఇంత వరకూ కొనుగోలు కేంద్రాల ఊసే ఎత్తడం లేదు. ఒకవేళ అకాల వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏమిటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదీగాక, ఇప్పటి వరకూ తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడం, అందులోనూ కొర్రీలు పెడుతుండడం, పైగా మద్దతు ధర ఇవ్వకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఏడాది ఎంతో కష్టపడి మొకజొన్న పంటను సాగుచేశామని, ప్రారంభంలో అనేక ఇబ్బందులు పడ్డామని, ప్రభుత్వం యూరియా అందించకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నామని, అప్పులు చేసి మరీ పంటను కాపాడుకున్నామని, చెమటోడ్చి అధిక దిగుబడి సాధించామని కర్షకులు అంటున్నారు. అందులోనూ ఇటీవలి అకాల వర్షాలు కొంతమేరకు పంట కూడా దెబ్బతిన్నందని అంటున్నారు. అయినా, ఎంతో ఆశతో అధిక దిగుబడి సాధిస్తే.. ఈ 26 క్వింటాళ్ల నిబంధన ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 40 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మక్క రైతులను ఎంతగానో ఆదుకున్నదని, కరోనా సమయంలోనూ రైతుల దగ్గరే వచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసిందని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన ధరను కోల్పోతున్నామని అంటున్నారు.
బోనకల్లు, ఏప్రిల్ 5: బోనకల్లు మండలంలో మొకజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటుచేయాలని, ఎటువంటి కొర్రీలు లేకుండా రైతుల వద్ద ఉన్న పూర్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు డిమాండ్ చేశారు.
బోనకల్లు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని ఆదివారం వారు పర్యటించి.. మొకజొన్న కల్లాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా కేవలం 31 కేంద్రాల ఏర్పాటుకే ప్రభుత్వం ఆదేశాలివ్వడం సరికాదని అన్నారు. అవసరమైన ప్రతి చోటా కేంద్రాలను తెరవాలని, 26 క్వింటాళ్ల మాత్రమే కొంటామనే నిబంధనను ఎత్తివేయాలని, రైతుల వద్ద ఉన్న ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు.గిరి, వెంకటేశ్వర్లు, గోవిందరావు, కొండలరావు, కృష్ణవేణి, రవి, అఖిల్, రమ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.